త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asaduddin Owaisi | ఇస్లాంలో ఏది అవ‌స‌ర‌మో.. ఏది కాదో నిర్ణ‌యించ‌డానికి మీరెవ‌రు?: ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi | పాఠ‌శాల యూనిఫామ్‌తోపాటు హిజాబ్ (Hijab) లేదా త‌ల‌పై స్కార్ఫ్‌ ధ‌రించ‌డానికి అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధ్య‌క్షుడు, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi ) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G

Telangana | Published On Aug 26, 2026, 10.31 am IST

Asaduddin Owaisi | ఇస్లాంలో ఏది అవ‌స‌ర‌మో.. ఏది కాదో నిర్ణ‌యించ‌డానికి మీరెవ‌రు?: ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ
Advertisement

Asaduddin Owaisi | త్రినేత్ర‌.న్యూస్‌: పాఠ‌శాల యూనిఫామ్‌తోపాటు హిజాబ్ (Hijab) లేదా త‌ల‌పై స్కార్ఫ్‌ ధ‌రించ‌డానికి అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. ఇస్లాంలో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి అని నిరూపించేందుకు తగిన వాస్తవ లేదా చట్టపరమైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఎంఐఎం అధ్య‌క్షుడు, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi ) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిని ఇస్లాంపై (Islam) జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇస్లాంలో ఏది అవసరమో, ఏది కాదో నిర్ణయించడానికి మీరెవరు?. అమ్మాయిలు హిజాబ్‌ను తలపై ధరిస్తారు కానీ, మెదడుపై కాద‌ని వ్యాఖ్యానించారు. మిలాద్‌-ఉన్-న‌బీ సంద‌ర్భంగా హైద‌రాబాద్ దారుస్సలాంలో జ‌రిగి జ‌ల్సా-ఎ-ర‌హ్మ‌తుల్‌-లిల్‌-అల‌మీన్ స‌భ‌లో ఒవైసీ మాట్లాడుతూ.. ఈ తీర్పుతో తాను ఏకీభ‌వించ‌న‌ని చెప్పారు. ఇది ముమ్మాటికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 19ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. శ‌బ‌రిమ‌ల కేసులో మ‌త‌ప‌ర‌మైన ఆచారాల‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ ఇంకా పెండింగ్‌లోనే ఉంద‌ని గుర్తుచేశారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల‌కు భార‌త రాజ్యాంగం కంటే మ‌నుస్మృతే ఎక్కువ ఇష్ట‌మ‌ని విమ‌ర్శించారు. బాబాసాహెబ్ అంబేద్క‌ర్ రచించిన రాజ్యాంగాన్ని మొద‌టి నుంచీ వ్య‌తిరేకిస్తున్నార‌ని ఆరోపించారు. గోవధ నిషేధాన్ని సమర్థిస్తున్నారు, కానీ ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద బీఫ్ (గోమాంసం) ఎగుమతిదారుగా కొనసాగుతున్న‌ద‌ని చెప్పారు. ఇదంతా డాలర్ల వ్యామోహమేన‌ని మండిపడ్డారు. అదేవిధంగా చేపల నిషేధాన్ని సమర్థిస్తున్నార‌ని, కానీ గుజరాత్‌లోని సూరత్ చేపల మార్కెట్‌కు నరేంద్ర మోదీ చేపల మార్కెట్ అని పేరు పెట్టారని ధ్వ‌జ‌మెత్తారు.

హిందూ వివాహ‌, విడుకులు, వార‌స‌త్వ చ‌ట్టాల ఆధారంగా రూపొందించిన చ‌ట్టాల‌ను యూసీసీ (UCC) అని ఎలా అంటార‌ని ప్ర‌శ్నించారు. వాటిని ముస్లింల‌పై ఎందుకు రుద్దుతున్నార‌ని నిల‌దీశారు. త‌మ‌ను త‌మ మ‌తం నుంచి దూరం చేయాల‌ని చేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌వ‌ని, తాము ఖురాన్‌ను అనుసరిస్తూనే ఉంటామని స్ప‌ష్టంచేశారు.

డ్ర‌గ్స్‌కు బానిస‌ల‌వుతున్నారు..

`తెలంగాణ‌లో, ముఖ్య‌మంగా హైద‌రాబాద్‌లో యువ‌త డ్ర‌గ్స్‌కు బానిస‌ల‌వుతున్నారు. దీంతో భ‌విష్య‌త్తును, జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నార‌ని చెప్పారు. తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సిన విష‌య‌మ‌ని వెల్ల‌డించారు. నేనూ గ‌తంలో సిగ‌రెట్ తాగేవాడిని. కానీ దానిని వ‌దిలేశాను. ఒక వేళ మీరు మ‌త్తుకు బానిస‌లైతే నా ద‌గ్గ‌ర‌కు రండి. నేను మీకు స‌హాయం చేస్తా. డీ-అడిక్ష‌న్ సెంట‌ర్‌లో చేరుస్తా. స‌హాయం అడిగేందుకు సంకోచించాల్సి అవ‌స‌రం లేదు. మీ జీవిత‌, భ‌విష్య‌త్తు చాలా ముఖ్యం` అని అస‌దుద్దీన్ చెప్పారు.

హిజాబ్ తప్పనిసరి కాదు..

హిజాబ్ ధార‌న విష‌య‌మై.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక (UP student) తన తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. ఆరో తరగతి నుంచి తాను హిజాబ్ ధరిస్తున్నానని, అదే పాఠశాలలో 11వ తరగతిలో ప్రవేశం పొందుతున్న నేపథ్యంలో యూనిఫామ్‌తో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని ఆమె కోరింది. అయితే పాఠశాల నిర్దేశించిన యూనిఫామ్‌కు అదనంగా మరో వస్త్రాన్ని జోడించేందుకు విద్యార్థికి ప్రత్యేక హక్కు లేదని జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజీత్ శుక్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి మతాచారం అని చెప్పేందుకు పిటిషన్‌లో ఎలాంటి బలమైన ఆధారాలూ లేవని ధర్మాసనం పేర్కొంది . ఇదే అంశంపై గతంలో వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా కోర్టు ప్రస్తావించింది. హిజాబ్ ధరించకపోతే ఇస్లామిక్ విశ్వాసానికి భంగం కలుగుతుందని నిరూపించే స్థాయిలో ఆధారాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. అదే పాఠశాలలో చదువుతున్న ఇతర ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడంలేదని పేర్కొంది. విద్యార్థులందరికీ సమానమైన యూనిఫామ్ నిబంధనలను అమలు చేసే అధికారం ప్రైవేట్ విద్యాసంస్థలకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisement
Advertisement