త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల

MP Eatala Rajender | భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్ చేశారు. రూ. 20 వేల కోట్ల విలువైన భూములు హానర్ హోమ్స్‌కి కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది.. నేను వస్తే వెనక్కి తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవడం లేదు? అని రాజేంద‌ర్ నిల‌దీశారు.

S

Telangana | Published On Aug 24, 2026, 7.32 pm IST

MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల
Advertisement

MP Eatala Rajender | త్రినేత్ర‌.న్యూస్ : భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్ చేశారు. రూ. 20 వేల కోట్ల విలువైన భూములు హానర్ హోమ్స్‌కి కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది.. నేను వస్తే వెనక్కి తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవడం లేదు? అని రాజేంద‌ర్ నిల‌దీశారు. 22 A ద్వారా 10 లక్షల కోట్ల ఆదాయం రేవంత్ రెడ్డి లక్ష్యం, అందులో ముప్పై శాతం వీళ్ళ వాటా. పేదలను ఇబ్బంది పెడుతున్న వీరికి శిక్ష తప్పదు అని ఈట‌ల రాజేంద‌ర్ హెచ్చ‌రించారు. కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డులో వేలానికి పెట్టిన ప్లాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన అనంత‌రం ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడారు.

నిజాం కాలంలో 1908లో వరదలు వచ్చినప్పుడు అనేక ఇళ్లు వరదల్లో కొట్టు పోయాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. "సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్" 1911 లో నిజాం ఏర్పాటు చేసి ప్రజలకు ఇల్లు కట్టించారు. 1931 లో "సికింద్రాబాద్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్" ఏర్పాటు చేశారు. ఈ బోర్డ్ 1960లో హౌసింగ్ బోర్డ్‌గా మారింది. ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములు కేటాయించడంతో పాటు రైతుల భూములు కూడా సేకరించారు. కూక‌ట్‌ప‌ల్లి, కైతలాపూర్, హైదర్ నగర్ మూడు గ్రామాల పరిధిలో 1400 ఎకరాలు సేకరించారు. హౌసింగ్ బోర్డ్ ఉద్యోగులకు గజం 1 రూపాయి 25 పైసలకు ఇచ్చారు. ఆర్థిక స్తోమతను బట్టి కొనుక్కొనే విధంగా 66 గజాలు, 111 గజాలు, 311 గజాలు, 400 గజాలు ప్లాటింగ్ చేశారు. జేఎన్టీయూ కోసం హౌసింగ్ బోర్డ్ 100 ఎకరాలు లీజుకు ఇచ్చారు. హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చడానికి తప్ప వ్యాపారం చేయడానికి కాదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-06లో కూకట్‌ప‌ల్లిలో భూముల అమ్మకాలు మొదలుపెట్టారు. మలేషియా టౌన్‌షిప్‌కు 36 ఎకరాలు, హిందూ ప్రాజెక్ట్‌కు 70 ఎకరాలు, లోధాకు 18 ఎకరాలు, ఇండీస్ వన్ సిటీకి 12 ఎకరాలు అమ్మారు. వీరందరూ పెద్ద పెద్ద ఇల్లు కట్టి అమ్ముకోవడంతో పాటు పేదవారికి కూడా ఇల్లు కట్టి ఇవ్వాలి అనే నిబంధన ఉంది. ఒక మలేషియా టౌన్‌షిప్ మాత్రమే పేదలకు ఇళ్లను కట్టించి ఇచ్చారు. ఈ భూములు అమ్మినప్పుడు వచ్చిన రూ. 1200 కోట్లు హౌసింగ్ బోర్డ్ ఖాతాలో నిల్వ ఉన్నాయి.. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని తీసేసుకున్నాడు. ఈ మధ్య గోద్రెజ్ కంపెనీకి 8 ఎకరాల భూమిని అమ్మారు. కూకట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డ్ అంటేనే అత్యంత జనసమ్మర్ధం ఉన్న ప్రాంతం. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజన్ కూడా పోయే దారి లేకుండా అయ్యాయి. స్కూల్స్‌, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాలు, హాస్పిటల్ కట్టుకోవడానికి స్థలాలు కరువయ్యాయి. ఖాళీగా ఉన్న జాగాలను వీటికి కేటాయించండి కానీ అమ్ముకోవద్దు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయినా అమ్ముకుంటున్నారు. హౌసింగ్ బోర్డ్ చట్టం ప్రకారం పేదవారికి ఇళ్ళ జాగాలు ఇవ్వాలి తప్ప ఇలా అమ్ముకోవడానికి హక్కు లేదు. లక్ష అరవై వేల బేస్ ప్రైజ్ పెట్టి ఈ భూములు అమ్ముకోవడానికి హౌసింగ్ బోర్డును వ్యాపార సంస్థగా మార్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలం లేకుండా చేస్తున్నారు. భూములు అమ్ముకొని జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ స్థలం అమ్మొద్దు.. చిన్న చిన్న చిల్డ్రన్ పార్కులుగా తయారు చేయండి. అప్పట్లో ఈ ప్రాంత ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆయనే హౌసింగ్ బోర్డు మంత్రిగా కూడా ఉన్నారు.. అప్పుడు ధర్మారెడ్డి హౌసింగ్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్నారు.. ఆ కాలంలో ఇలాంటివి జరగలేద‌ని ఈట‌ల రాజేంద‌ర్ గుర్తు చేశారు.

ఆస్తులు అమ్ముకుని తిరిగేవాణ్ణి తిరుగుబోతు అనేవారు

ఊర్లలో తాతల ఆస్తులు అమ్ముకుని తిరిగేవాణ్ణి తిరుగుబోతు అనేవారు. ఇప్పుడు రేవంత్ ఆస్తులు అమ్ముతున్నారు.
ఆస్తులు అమ్మటం ఆపకపోతే దీనికి తగిన మూన్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బస్తీలలో పని చేసుకునేవారికి ఊరు అవతల డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తే.. అక్కడ పని లేక వారు.. చేపలను నీళ్లలో నుంచి బయట వేస్తే ఎలా కొట్టుకుని చచ్చిపోతాయో.. వారి పరిస్థితి కూడా అలానే ఉంది. ఎక్కడ ఉన్నవారికి అక్కడే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలి. పేదవారికి కట్టించడానికి మనసు రావడం లేదా? పేదవారి కోసమైతే బడ్జెట్ లేదా ? ఇందిర రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్నది కేవలం స్లోగన్ గానే మిగిలిపోయింది. ఆరు లక్షల రూపాయలకు ఇళ్ళ నిర్మాణం విషయంలో ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. కూకట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డులో రెండో తారీఖున‌ ఏర్పాటుచేసిన వేలంపాటను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాన‌ని ఈట‌ల పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి హాన‌ర్ హోమ్స్ ఎందుకు స్పందించ‌డం లేదు..?

ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో ఎలా కుమ్మక్కవుతాయి అనడానికి ఎల్లమ్మబండ భూములు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ భూముల గురించి 2007 నుంచి నేను కొట్లాడుతున్నాను. ఎల్లమ్మబండం షంషీగూడ సర్వేనెంబర్ 57 భూములను కాపాడవలసిన ప్రభుత్వం... సుప్రీంకోర్టులో అన్ని రికార్డులను ప్రొడ్యూస్ చేయాల్సిన ప్రభుత్వం.. ఆనాడు కుమ్మక్కయి దేశ్‌పాండే అనే అతను గెలవడానికి తోడ్పాటు అయ్యింది. అదే సర్వే నెంబర్లో ఉన్న 300 ఎకరాలలో 170 ఎకరాల్లో పేదవారికి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఎలా ఇచ్చారు ? ప్రభుత్వ భూమి కాకపోతే ఎలా జర్నలిస్టులకు పేదలకు ఇచ్చారు ? ఎకరం 70 కోట్ల ఉన్న 130 ఎకరాలు ఆయనకు అప్పనంగా అప్పగించారు.. స్మశాన వాటికలతో సహా అన్నిటినీ కూలగొట్టి ఆయన ఫెన్సింగ్ వేసుకున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అక్రమంగా ఆక్రమించుకున్న భూములను వెనక్కి తీసుకుంటారని అనుకున్నాము కానీ చేయలేదు. ఐడీఎల్‌లో హానర్ హోమ్స్ పేరుతో ఒక్కో అపార్ట్మెంట్ రూ. 25 కోట్లకు అమ్ముతున్నారు. 300 ఎకరాలు కేసీఆర్ వారికి ఇచ్చారు మేము వస్తే వెనక్కి తీసుకుంటాం అన్న రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవడం లేదు సమాధానం చెప్పాలి. పాత కేటాయింపులన్నిటిపై విచారణ జరుపుతా అన్న రేవంత్ రెడ్డి హానర్ హోమ్స్ మీద ఎందుకు స్పందించడం లేదు. ఎందుకు విచారణ చెప్పటం లేదు ప్రాసిక్యూట్ చేయడం లేదు భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు అని ఈట‌ల రాజేంద‌ర్ నిల‌దీశారు.

ప్ర‌జ‌ల ఉసురు పోసుకుంటున్నారు..

22 ఏ తీసుకొచ్చి పది లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వానికి డబ్బులు వచ్చేలా చేయాలి.. స్వామికార్యం స్వకార్యంలా.. ఒక ముప్పై శాతం కొట్టేయాలని చూస్తున్నారు. వీటన్నిటిని తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారు. అర్బ‌న్ సీలింగ్ ల్యాండ్లను ప్రైవేటు వారికి కట్టబట్టే ప్రయత్నం కూడా ఆపాలని డిమాండ్ చేస్తున్నాను. పేదవాడు పేదవాడిలానే ఉంటున్నాడు, పెద్దవాడు ఒకటే తరంలో పదిరెట్ల ఆస్తులకు ఎలా పెరుగుతున్నారు. ఈ సమాజం ఎటు పోతుందో. ఓట్లు వేసి కూర్చోబెట్టిన కర్మ‌కు మా ఉసురు పోసుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు.

Advertisement
Advertisement