త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ఓటు ప్ర‌క్షాళ‌న వెన‌క పెద్ద కుట్ర‌: రేవంత్‌రెడ్డి

Revanth Reddy | ఓటు ప్ర‌క్షాళ‌న వెన‌క పెద్ద కుట్ర అని తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మండిప‌డ్డారు. దీనికోసం స‌ర్ (SIR) అనే కార్య‌క్ర‌మాన్ని బీజేపీ (BJP) ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింద‌ని, దాంతో పేద‌లు, మైనారిటీల ఓటు హ‌క్కు తొల‌గించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. 

A

Telangana | Published On Jan 8, 2026, 5.06 pm IST

Revanth Reddy | ఓటు ప్ర‌క్షాళ‌న వెన‌క పెద్ద కుట్ర‌: రేవంత్‌రెడ్డి
Advertisement

స‌ర్ పేరుతో పేరుతో పేద‌ల ఓట్లు తొల‌గించేందుకు య‌త్నం
ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ధ‌రించే వ‌ర‌కు ఉద్య‌మించాలి
గాంధీభ‌వ‌న్‌లో టీపీసీసీ విస్తృత‌స్థాయి స‌మావేశంలో ప్ర‌సంగించిన ముఖ్య‌మంత్రి

Revanth Reddy | ఓటు ప్ర‌క్షాళ‌న వెన‌క పెద్ద కుట్ర అని తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మండిప‌డ్డారు. దీనికోసం స‌ర్ (SIR) అనే కార్య‌క్ర‌మాన్ని బీజేపీ (BJP) ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింద‌ని, దాంతో పేద‌లు, మైనారిటీల ఓటు హ‌క్కు తొల‌గించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. వారికి ఓటు హ‌క్కు పోతే రేష‌న్ కార్డు, ఆధార్ కార్డుతో స‌హా అన్ని సంక్షేమ ప‌థ‌కాలు అంద‌కుండా పోతాయ‌ని వివ‌రించారు. అప్పుడు దేశంలో ఉండాలా వ‌ద్దా అనేది బీజేపీ చేతిలో ఉండేలా చూసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan) లో గురువారం నిర్వ‌హించిన టీపీసీసీ (TPCC) విస్తృత‌స్థాయి స‌మావేశానికి రేవంత్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 140 కోట్ల జ‌నాభా క‌లిగిన దేశంలో 80 శాతం ప్ర‌జ‌లు మ‌హాత్మాగాంధీ ఉపాధి హామీ ప‌థ‌కం (MGNREGA)లో స‌భ్యుల‌ని చెప్పారు. అలాంటి ప‌థ‌కాన్ని కేంద్రప్ర‌భుత్వం నీరుగార్చి, పేరు మార్చి, మ‌రో ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో బ‌లం ఉంద‌ని మోదీ ప్ర‌భుత్వం పేద‌ల‌ను ఇబ్బంది పెడుతోంద‌ని మండిప‌డ్డారు. ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ధ‌రించే వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఉద్య‌మించాల‌ని పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర‌..

దేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ కుట్ర చేసింద‌ని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 400 సీట్లు వ‌స్తే రాజ్యాంగాన్ని మార్చాల‌ని ప్ర‌య‌త్నించింద‌ని చెప్పారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశ వ్యాప్తంగా తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారని అన్నారు. అదానీ, అంబానీల‌కు దేశాన్ని అప్పగించే కుట్ర అమలు కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని పేర్కొన్నారు. అంబానీ, అదానీకి తక్కువ వేతనాలకు కూలీలను పంపించేందుకే ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తున్నారని అభిప్రాయ‌ప‌డ్డారు. దీని వెనుక ప్రధాని మోదీ, కార్పొరేట్ కంపెనీల కుట్ర ఉందని చెప్పారు. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ప్రధాని మోదీ తీసుకువ‌చ్చార‌ని, కానీ వాటికి వ్య‌తిరేకంగా రాహుల్‌గాంధీ పోరాటం చేయ‌డంతో.. దేశ రైతులకు మోదీ క్షమాపణ చెప్పి, నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నార‌ని వివ‌రించారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ పేరులోనే గందరగోళం ఉంద‌ని, అస‌లు దేశంలో వికసిత్ భారత్ ఎక్కడుందని ప్ర‌శ్నించారు.

ప‌థ‌కంలో మార్పుల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు..

మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో మార్పులను నిరసిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి, కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి మండలానికి ఒక ఇంచార్జీని నియమించాలన్న ఆయ‌న‌... తాను కూడా ఒక మండ‌ల బాధ్య‌త తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఫిబ్రవరి మూడు నుంచి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ములుగులో ఏర్పాటు చేసే బహిరంగ సభకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల‌ను ఆహ్వానిస్తామ‌ని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 66 శాతం సీట్లను గెలుచుకుందని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చామ‌ని, ఇప్పుడు కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత త‌మ‌ పైన ఉందని అన్నారు. కార్యకర్తల గెలుపు కోసం గల్లీ గల్లీ కాదు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తాన‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను ముఖ్యమంత్రిని అయ్యాన‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎప్పుడూ అండ‌గా నిల‌బ‌డింద‌ని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం దేశం ఇబ్బందుల్లో ఉంద‌ని, ఈ ప‌రిస్థితుల్లో రాహుల్‌గాంధీ ప్ర‌ధాని కావాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మోదీని ఓడించి రాహుల్ ను ప్రధాని చేయడం కోసం అంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement