త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sammakka Saralamma | స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర‌కు 24 గంట‌ల్లో 80 ల‌క్ష‌ల మంది

Sammakka Saralamma Jathara | మేడారం సమ్మక్క–సారక్క (Sammakka Saralamma Jathara) మహా జాతరలో నిన్న‌టి నుంచి ఈ రోజు వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉండ‌వ‌చ్చ‌ని తెలిపారు.

A

Telangana | Published On Jan 29, 2026, 4.35 pm IST

Sammakka Saralamma | స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర‌కు 24 గంట‌ల్లో 80 ల‌క్ష‌ల మంది
Advertisement

ఎన్న‌డూ లేనంత‌గా భ‌క్తుల తాకిడి
స‌మ్మ‌క్క గ‌ద్దెపైకి వ‌చ్చే స‌మయానికి కోటికి మించే అవ‌కాశం
విలేక‌రుల‌కు వివ‌రాలు వెల్ల‌డించిన మంత్రులు పొంగులేటి, సీత‌క్క

Sammakka Saralamma | త్రినేత్ర‌.న్యూస్‌: మేడారం సమ్మక్క–సారక్క (Sammakka Saralamma) మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. నిన్న‌టి నుంచి ఈ రోజు వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్ల‌డించారు. సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉండ‌వ‌చ్చ‌ని తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తున్నారని తెలిపారు. మేడారంలో మంత్రి సీత‌క్క‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింద‌ని, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

మేడారం శాశ్వత అభివృద్ధికి 70 ఎకరాల విస్తరణ

మేడారం జాతర శాశ్వత అభివృద్ధి కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. మొత్తంగా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మరిన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించనున్నట్లు వివరించారు. జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం రామప్ప–లక్నవరం–జంపన్న వాగు వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని, వాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి శాశ్వత నీటి నిల్వకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.

2500 కోట్ల‌తో బాసర–భద్రాచలం టెంపుల్ సర్క్యూట్

దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ప్రాధాన్యతను మరింత పెంచేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్ల వ్యయంతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిలో మేడారం ఆలయాన్ని కూడా భాగంగా చేర్చనున్నట్లు ఆయన ప్రకటించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో ఇరుకైన రోడ్ల కారణంగా ఇబ్బందులు ఉండేవని, ఈసారి ఫోర్-లేన్ రోడ్లతో రాకపోకలు చాలా సులభమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత తాగునీటి వ్యవస్థతో పాటు భారీ సంఖ్యలో శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా చెట్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తల్లులు గద్దెల నుంచి తిరిగి వనప్రవేశం చేయనున్నారని, అప్పటివరకు భక్తులు ఓపికతో దర్శనాలు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement