త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Godawari Pushkaraalu-Cabinet sub committee meeting | రోజుకు 1,568 బస్సులు.. 6,740 రౌండ్ల‌ ట్రిప్పులు

Godawari Pushkaraalu-Cabinet sub committee meeting | గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు 1,568 బస్సులను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించామ‌ని ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు.

S

Telangana | Published On Sep 18, 2026, 3.16 pm IST

Godawari Pushkaraalu-Cabinet sub committee meeting | రోజుకు 1,568 బస్సులు.. 6,740 రౌండ్ల‌ ట్రిప్పులు
Advertisement
  • గోదావ‌రి పుష్క‌రాల్లో 4,74,293 మంది భక్తులను త‌ర‌లించేందుకు ఏర్పాట్లు
  • కేబినెట్ స‌బ్ క‌మిటీ స‌మావేశంలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డి

Godawari Pushkaraalu-Cabinet sub committee meeting | త్రినేత్ర‌.న్యూస్‌: గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు 1,568 బస్సులను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించామ‌ని ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. ఈ బస్సులు రోజుకు సుమారు 6,740 రౌండ్ ట్రిప్పులు తిరుగుతాయ‌న్నారు. రోజుకు సుమారు 4,74,293 మంది భక్తులను బస్సుల ద్వారా తరలించేలా ఏర్పాట్లు ప్రతిపాదించిన‌ట్లు వివ‌రించారు. అసెంబ్లీ కమిటీ హాల్1లో గోదావరి పుష్కరాలు - 2027పై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన శుక్ర‌వారం నిర్వ‌హించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పుష్కరాల సన్నద్దత, ఘాట్ల నిర్మాణం, రవాణా, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్ల పురోగతిపై సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా పొన్నం మాట్లాడారు.

35 డిపోల వినియోగం..

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ముందస్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పుష్కర ఘాట్లకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు. పుష్కరాల సమయంలో ప్రత్యేక సేవల నిర్వహణ కోసం సుమారు 35 డిపోలను వినియోగించనున్నారు.

ఏ రీజియ‌న్‌లో ఎన్నంటే..

ఇందులో కరీంనగర్ రీజియన్ నుంచి 10 బస్ డిపోలు, గోదావరిఖని, హుజురాబాద్, హుస్నాబాద్, జగిత్యాల, కరీంనగర్ -1, కరీంనగర్ -2, కోరుట్ల, మంథని, సిరిసిల్ల, వేములవాడ డిపోలు ఉన్నాయి. నిజామాబాద్ రీజియన్ నుంచి ఆర్మూరు, కామారెడ్డి, నిజామాబాద్ -1, నిజామాబాద్2, బాన్సువాడ, బోధన్ డిపోలు.. ఆదిలాబాద్ రీజియన్ నుంచి భైంసా, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల డిపోలు.. వరంగల్ రీజియన్ నుంచి హన్మకొండ, వరంగల్ -1, వరంగల్ -2, నర్సంపేట, తొర్రూరు, మహబూబాబా బాద్, పరకాల, భూపాలపల్లి.. ఖమ్మం రీజియన్ నుంచి ఖమ్మం, సత్తుపల్లి, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, మదీరా, భద్రాచలం డిపోల నుంచి బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి.

తాత్కాలిక ఘాట్ల కోసం రూ.7.60 కోట్లు

రద్దీకి అనుగుణంగా ముఖ్యమైన పుష్కర ఘాట్ల వద్ద తాత్కాలిక బస్ టెర్మినల్స్, బస్ పాయింట్లు, ప్రయాణికుల వేచి ఉండే ప్రదేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. పొచంపాడు, కందకుర్తి, దోంచండ, తడిబొల్లి, కాళేశ్వరం తదితర ముఖ్య ఘాట్ల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేస్తాం. తాత్కాలిక ఘాట్ ల వద్ద ఏర్పాట్ల కోసం సుమారు రూ.7.60 కోట్ల వ్యయం అంచనా వేశాం. ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీరు, బెంచీలు, సీటింగ్, లైటింగ్, హైమాస్ట్ లైట్లు, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్, తాత్కాలిక షెల్టర్లు, టెంట్లు వంటి సదుపాయాలు కల్పించ‌నున్నాం.

బస్సుల నిర్వహణ, ప్రయాణికుల రద్దీ నియంత్రణ, ప్రత్యేక బస్ పాయింట్ల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక రూపొందిస్తాం. 14 బస్ స్టేషన్ల ఆధునీకరణ అభివృద్ధి ప్రతిపాదించగా, ఇందుకు సుమారు రూ.130 కోట్ల వ్యయం అంచనా వేశారు. 14 బస్ స్టేషన్ లలో ధర్మపురి, గోదావరి ఖని, నిజామాబాద్, నవీపేట్, రంజని, కొత్తగూడెం, భద్రాచలం, చెన్నూరు, లక్సెట్టిపేట, బాసర, కాళేశ్వరం, మంథని, మంచిర్యాల బస్ స్టేషన్లను అభివృద్ధి చేయాలని ఆర్టీసీ కార్యాచరణ తీసుకుంది.

పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఆర్టీసీ సేవలను నిర్వహించనుంది. మొత్తంగా, గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించడమే ఆర్టీసీ కార్యాచరణ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా ఉంది అని పొన్నం వివ‌రించారు.

ఈ స‌మావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకట్ స్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ, ఆర్ అండ్ బీ తదితరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement