త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dilsukhnagar Twin Blasts | దిల్‌సుఖ్‌న‌గ‌ర్ జంట పేలుళ్లు.. నేటితో 13 ఏండ్లు పూర్తి.. ఇంకా ప‌రారీలోనే ప్ర‌ధాన‌ నిందితుడు

Dilsukhnagar Twin Blasts, Dilsukhnagar Blasts, Hyderabad Blasts, Dilsukhnagar, NIA, Indian Mujahideen

G

Telangana | Published On Feb 21, 2026, 9.32 am IST

Dilsukhnagar Twin Blasts | దిల్‌సుఖ్‌న‌గ‌ర్ జంట పేలుళ్లు.. నేటితో 13 ఏండ్లు పూర్తి.. ఇంకా ప‌రారీలోనే ప్ర‌ధాన‌ నిందితుడు
Advertisement

Dilsukhnagar Twin Blasts | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హైద‌రాబాద్ దిల్‌సుఖ్‌న‌గ‌ర్ జంట‌ పేలుళ్ల‌కు (Dilsukhnagar Twin Blasts) శ‌నివారంతో 13 ఏండ్లు పూర్త‌య్యాయి. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ బ‌స్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోట‌ల్‌తోపాటు, మ‌రో బ‌స్టాప్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. దీంతో 18 మంది చనిపోగా.. 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాల‌కు ఇప్ప‌టికీ న్యాయం ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసులో దోషుల‌కు ప‌దేండ్ల క్రిత‌మే ఉరిశిక్ష ప‌డిన‌ప్ప‌టికీ న్యాయ ప్ర‌క్రియ వ‌ల్ల అది ఆల‌స్య‌మ‌వ‌డ‌మే కార‌ణం.

13 ఏండ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజున సాయంత్రం 6.58 గంట‌ల స‌మ‌యంలో జంట పేలుళ్లు జ‌రిగాయి. మొద‌ట 6గంట‌ల 58 నిమిషాల 38 సెకండ్ల‌కు 107 బ‌స్టాప్‌లో బాంబు పేల‌గా, 6 సెకండ్ల త‌ర్వాత (6గంట‌ల 58 నిమిషాల 44 సెకండ్ల‌కు) కోనార్క్ టాకీస్ ఎదురుగా ఉన్న ఏ–1 మిర్చ్‌ సెంటర్‌ వద్ద రెండో పేలుడు సంభ‌వించింది. దీంతో ఓ గ‌ర్భ‌స్థ శిశువు స‌హా 18 మంది చ‌నిపోయారు. మ‌రో 65 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ దాడి త‌మ‌ప‌నేన‌ని ఇండియ‌న్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్ర‌సంస్థ ప్ర‌క‌టించుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై స‌రూర్‌న‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట పోలీస్ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోద‌య్యాయి. అనంత‌రం వాటిని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు (NIA) అప్ప‌గించారు.

ఏడాదిలోనే నిందితులు అరెస్టు

నిందితుల్లో ఐదుగురిని ఏడాదిలోనే ఎన్ఐఏ అరెస్టు చేసింది. కీలక నిందితుడు యాసీన్‌ భత్కల్, అతడి ప్రధాన అనుచరుడు హడ్డీలను 2013 ఆగస్టు 29న బీహార్‌లోని రక్సుల్‌ ప్రాంతంలో, ఎజాజ్‌ షేక్‌ను అదే ఏడాది సెప్టెంబర్‌ 6న ఉత్తరప్రదేశ్‌లోని సహరంగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో, జియా ఉర్ రెహ్మాన్‌ను రాజస్థాన్‌లోని అజ్మీర్‌ రైల్వేస్టేషన్‌లో 2014 మార్చ్‌ 22న, తెహసీన్‌ అక్తర్‌ను పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో 2014 మార్చి 25న అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పేలుళ్ల‌కు ప్ర‌ధాన సూత్ర‌ధారి అయిన మహమ్మద్‌ రియాజ్‌ అలియాస్‌ రియాజ్‌ భత్కల్‌ను పట్టుకోలేక‌పోయారు.

నిందితులంద‌రికీ 2016 డిసెంబరు 13న ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే మ‌ర‌ణ శిఖ‌ను స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఎన్‌ఐఏ కోర్టు తీర్పును జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ పి.శ్రీసుధలతో కూడిన హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. 2025 ఏప్రిల్ 8న‌ ఐదుగురు నిందితులకు ఉరిశిక్షను అమ‌లు చేయాల‌ని తీర్పునిచ్చింది. ఇప్ప‌టికీ అది అమ‌లు కాక‌పోవ‌డం విశేషం.

ఉలిక్కిపడిన హైదరాబాద్ నగరం

2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు చోటు చేసుకున్నాయి. సాయంత్రం 7 గంటల సమయంలో 100 మీటర్ల దూరంలో రెండు బాంబులు పేలాయి. ఏ–1 మిర్చ్‌ సెంటర్‌, వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న 107 బస్‌స్టాప్‌లో పేలుడు సంభ‌వించింది. ఉగ్రవాదులు బాంబులను సైకిళ్లపై అమర్చారు. ఈ పేలుళ్లలో ఐరన్ బోల్ట్‌లు, అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించారు.

ఇంకా పరారీలోనే రియాజ్‌ 

ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్‌ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అత‌డు పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటకకు చెందిన రియాజ్‌పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అత‌నిపై ఇతర దేశాల్లో కూడా కేసులు ఉన్నట్లు తెలుస్తున్న‌ది.

Advertisement
Advertisement