త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sumathi | డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. విద్యార్థుల కదలికలపై నిరంతర నిఘా: సీపీ సుమతి

CP Sumathi | ప్రొడక్టివిటీకి చిరునామాగా, వేలాది మంది విద్యార్థులతో విద్యా కేంద్రంగా ఉన్న దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామ‌ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి (CP Sumathi) తెలిపారు.

G

Hyderabad | Published On May 8, 2026, 7.07 am IST

CP Sumathi | డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. విద్యార్థుల కదలికలపై నిరంతర నిఘా: సీపీ సుమతి
Advertisement

CP Sumathi | త్రినేత్ర‌.న్యూస్‌: యువతను మత్తు రక్కసి కోరల (Drugs) నుంచి కాపాడేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. నగరంలో ప్రొడక్టివిటీకి చిరునామాగా, వేలాది మంది విద్యార్థులతో విద్యా కేంద్రంగా ఉన్న దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామ‌ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి (CP Sumathi) తెలిపారు. విద్యార్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేరగాళ్ల కంటే ఒక అడుగు ముందే ఉండాలన్న సంకల్పంతో అత్యాధునిక సాంకేతికతను వినియోగిచుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు.

డ్రోన్ పోలీసింగ్..

అర్ధరాత్రి వేళల్లో విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తామ‌ని తెలిపారు. రాత్రిపూట పెట్రోలింగ్ చేసే పోలీసులకు ప్రత్యేక `డ్రగ్ డిటెక్షన్ కిట్లు` అందించ‌మాని, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులకు తక్షణమే పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటార‌ని చెప్పారు.

సీసీ కెమెరాలు..

ఈ ప్రాంతంలో ఉన్న 3,200 కెమెరాలలో 70 శాతానికి పైగా క్రియాశీలంగా ఉన్నాయని, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించామ‌ని తెలిపారు. హాస్ట‌ళ్ల‌పై ప్ర‌త్యేక నిఘా ఉంచామ‌ని పేర్కొన్నారు. సరూర్ నగర్ పరిధిలోని హాస్టళ్లలో ఇప్పటికే ప్రత్యేక ఆడిట్ నిర్వహించామ‌న్నారు. హాస్టల్ నిర్వాహకులు తప్పనిసరిగా హై-రిజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల‌ని తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాల‌న్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే హాస్టళ్లను సీజ్ చేయడానికి కూడా వెనుకాడేది లేద‌ని స్పష్టం చేశారు.

పాన్ డబ్బాలే టార్గెట్

మత్తు పదార్థాల విక్రయాలకు కేంద్రాలుగా మారుతున్న పాన్ డబ్బాలపై ప్రత్యేక నిఘా ఉంచామ‌న్నారు. నిషేధిత పదార్థాలు విక్రయిస్తే కఠినమైన పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగర భద్రతలో సామాన్య పౌరులు, పెడెస్ట్రియన్లు సైతం భాగస్వాములు కావాలని సూచించారు.

ఒక్క కేసుతో జీవితాంతం చీకటి

దేశంలోనే తెలంగాణ అత్యంత యువ రాష్ట్రం. 15 నుంచి 30 ఏండ్ల‌ వయసు అనేది దేశానికి పునాది వంటిది. ఈ సమయంలో కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలే తప్ప, క్షణికానందం కోసం మత్తుకు బానిస కావొద్ద‌ని సీపీ సూచించారు. ఒక్కసారి మత్తు పదార్థాల నిరోధక చట్టం (NDPS) కేసులో చిక్కుకుంటే, కెరీర్ అక్కడితో ముగిసిపోతుంద‌ని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలకు శాశ్వతంగా దూరమవుతార‌ని హెచ్చ‌రించారు.

గతంలో తాను సికింద్రాబాద్ డీసీపీగా ఉన్నప్పుడు ఎదురైన సవాళ్లను సీపీ సుమ‌తి గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని అక్రమ లాడ్జీలు డ్రగ్స్ విక్రయాలకు ఎలా అడ్డాగా మారాయో వివరించారు. ప్రస్తుతం అలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన గ్రౌండ్ లెవల్ నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. బాధితులకు శిక్షలతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని జనజీవన స్రవంతిలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement