త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zoho Classes 2.0 | జోహో క్లాసెస్ 2.0 వచ్చేసింది.. ఏఐతో బోధన, విద్యా నిర్వహణ ఇక మరింత సులువు..

Zoho Classes 2.0 | జోహో ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థల కోసం భారత్‌లోనే అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత అకడమిక్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్) జోహో క్లాసెస్ 2.0 ను విడుద‌ల చేసింది. బోధన, అభ్యాసం, విద్యార్థుల లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్, విద్యాసంస్థల పరిపాలన వంటి అన్ని అంశాలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందించేలా దీనిని రూపొందించింది.

S

Technology | Published On Jul 15, 2026, 5.43 pm IST

Zoho Classes 2.0 | జోహో క్లాసెస్ 2.0 వచ్చేసింది.. ఏఐతో బోధన, విద్యా నిర్వహణ ఇక మరింత సులువు..
Advertisement

Zoho Classes 2.0 | జోహో ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థల కోసం భారత్‌లోనే అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత అకడమిక్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్) జోహో క్లాసెస్ 2.0 ను విడుద‌ల చేసింది. బోధన, అభ్యాసం, విద్యార్థుల లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్, విద్యాసంస్థల పరిపాలన వంటి అన్ని అంశాలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందించేలా దీనిని రూపొందించింది. ఇందులో ఏఐ టూల్స్, బహుభాషా మద్దతు, ఇన్‌స్టిట్యూషనల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. జోహో క్లాసెస్ 2.0లో మూడు ప్రధాన కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి ఏఐ ఆధారిత బోధన, అభ్యాస సాధనాలు, విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచే ఫీచర్లు, అలాగే విద్యాసంస్థల పనితీరుపై సమగ్ర విశ్లేషణ అందించే ఇన్‌స్టిట్యూషనల్ ఇంటెలిజెన్స్. ఈ ప్లాట్‌ఫామ్ భారత రాజ్యాంగంలో గుర్తింపు పొందిన అన్ని 22 షెడ్యూల్డ్ భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. దీంతో ఏఐ రూపొందించే కోర్సు కంటెంట్, అసెస్‌మెంట్లు, లెర్నింగ్ మెటీరియల్‌ను విద్యార్థులు తమకు నచ్చిన భాషలో పొందవచ్చు.

ఉపాధ్యాయుల‌కు ప్ర‌త్యేక ఏఐ కోర్స్ బిల్డ‌ర్‌..

ఉపాధ్యాయుల కోసం రూపొందించిన ఏఐ కోర్స్ బిల్డర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సిలబస్, లెసన్ ప్లాన్ లేదా ఒక టాపిక్‌ను అందిస్తే కేవలం 30 సెకన్లలోపు పూర్తి కోర్సును రూపొందిస్తుంది. వీడియో పాఠాల అవుట్‌లైన్లు, చదివే మెటీరియల్, మూల్యాంకన ప్రమాణాలతో కూడిన అసైన్‌మెంట్లు, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ప్రాక్టీస్ టెస్టులు తయారు చేయడంతోపాటు వాటిని కోర్స్ అవుట్‌కమ్స్ (సీఓ), ప్రోగ్రామ్ అవుట్‌కమ్స్ (పీఓ)కు అనుసంధానిస్తుంది. ఉపాధ్యాయులు కోర్సుల విడుదల సమయాన్ని ముందుగానే షెడ్యూల్ చేయవచ్చు. అవసరమైన సమయం వరకు కంటెంట్‌ను లాక్ చేయవచ్చు. వీడియోలలోనే నోట్స్ రాసుకునే అవకాశం కల్పించవచ్చు. అలాగే లక్షకు పైగా కరికులమ్ టెంప్లేట్లను ఉపయోగించవచ్చు. ఫ్లిప్డ్ క్లాస్‌రూమ్ విధానానికి కూడా ఇది మద్దతు ఇస్తుంది. దీంతో విద్యార్థులు తరగతికి ముందు కోర్సు మెటీరియల్‌ను చదివి రావచ్చు.

24 గంట‌లూ అందుబాటులో ఉండే ఏఐ ట్యూట‌ర్‌..

విద్యార్థులకు 24 గంటలూ అందుబాటులో ఉండే ఏఐ ట్యూటర్ సేవలను జోహో క్లాసెస్ 2.0 అందిస్తోంది. మైక్రో లెర్నింగ్ మాడ్యూళ్లు, ఇంటరాక్టివ్ యాక్టివిటీలు, గేమిఫైడ్ లెర్నింగ్ అనుభవం ద్వారా అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేలా ఈ ప్లాట్‌ఫామ్ ను రూపొందించారు. విద్యాసంస్థల కోసం విద్యార్థి అడ్మిషన్ నుంచి కోర్సు పూర్తి చేసే వరకు మొత్తం లైఫ్‌సైకిల్‌ను నిర్వహించే సౌకర్యం ఇందులో ఉంది. అదనపు సహాయం అవసరమైన విద్యార్థులను ఏఐ ద్వారా గుర్తించే టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ఫలితాలు, వారి పాల్గొనడం, సంస్థ పనితీరుపై సమగ్ర విశ్లేషణలను ఇన్‌స్టిట్యూషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా పొందవచ్చు. అలాగే కోడింగ్ అవసరం లేకుండానే అడ్మిషన్లు, లెసన్ ప్లానింగ్, సిలబస్ మేనేజ్‌మెంట్ వంటి విద్యా ప్రక్రియల కోసం కస్టమ్ అప్లికేషన్లు రూపొందించుకునే లో-కోడ్ మైక్రో యాప్ బిల్డర్ ను కూడా జోహో అందిస్తోంది.

భార‌త విద్యావ్య‌వ‌స్థ అవ‌స‌రాల‌కు అనుగుణంగా..

భారత విద్యా వ్యవస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు జోహో తెలిపింది. పాఠశాలలకు దూరంగా ఉన్న విద్యార్థులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, రాష్ట్ర స్థాయి విద్యా నెట్‌వర్క్‌ల కోసం డిజిటల్ విద్యా కార్యక్రమాలను విస్తరించేందుకు ప్రభుత్వ విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఒకే తరగతి గది నుంచి రాష్ట్రవ్యాప్త విద్యా వ్యవస్థల వరకు కేంద్రికృత పరిపాలన, కంటెంట్ పంపిణీ, విద్యార్థుల భాగస్వామ్యం, రిపోర్టింగ్ వంటి అవసరాలను ఈ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తుంది. జోహో క్లాసెస్ 2.0 దేశంలోని అన్ని 22 షెడ్యూల్డ్ భాషలకు మద్దతు ఇవ్వడంతో పాటు నాక్, ఎన్బీఏ, యూజీసీ, ఎన్ఎంసీ అక్రిడిటేషన్ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది. అలాగే జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. వైద్య విద్య కోసం కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) వర్క్‌ఫ్లోలకు అనుగుణంగా కాంపిటెన్సీ ట్రాకింగ్, క్లినికల్ లాగ్ మేనేజ్‌మెంట్, ఓఎస్‌పీఈ, ఓఎస్‌సీఈ, అసెస్‌మెంట్లు, ఆడిట్‌కు సిద్ధంగా ఉండే డాక్యుమెంటేషన్ వంటి సౌకర్యాలను కూడా అందిస్తుంది.

డీపీడీపీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా..

జోహో టెక్నాలజీ స్టాక్‌పై రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్ దేశంలోనే డేటా నిల్వకు మద్దతు ఇస్తుంది. అలాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా 80 లక్షలకు పైగా నోటిఫికేషన్లు పంపినట్లు జోహో వెల్లడించింది. 10 లక్షలకు పైగా అసైన్‌మెంట్ సమర్పణలు నమోదయ్యాయి. లక్ష నిమిషాలకు పైగా లెర్నింగ్ కంటెంట్ వినియోగం జరిగింది. ఉపాధ్యాయులు రూపొందించిన 2 టెరాబైట్లకు పైగా వీడియో కంటెంట్ ను ఈ ప్లాట్‌ఫామ్ హోస్ట్ చేసింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్, శిష్యా స్కూల్, చెట్టినాడ్ హెల్త్ సిటీ, సీజీఐహెచ్‌ఎం, విద్యా మందిర్, గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్, జీఎస్‌ఈ ఇన్‌స్టిట్యూట్ తోపాటు ప్రభుత్వ విద్యా సంస్థలు, భారీ స్థాయి విద్యా కార్యక్రమాలు జోహో క్లాసెస్‌ను ఉపయోగిస్తున్నాయి.

ప్ర‌స్తుతం భార‌త్‌లోనే..

జోహో క్లాసెస్ 2.0 ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉంది. రాబోయే నెలల్లో ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రాంతీయ విద్యా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఫీచర్లతో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రొడక్ట్ లైసెన్సింగ్ ఛార్జీలు లేకుండా ఉచితంగా అందిస్తున్నట్లు జోహో ప్రకటించింది. అలాగే 100 మంది వరకు విద్యార్థులు ఉన్న వ్యక్తిగత ఉపాధ్యాయులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

Advertisement
Advertisement