త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI | ఇక యూపీఐలో ఇంట‌ర్నెట్ లేకున్నా చెల్లింపులు.. త్వ‌ర‌లో కొత్త ట్యాప్ అండ్ పే ఫీచ‌ర్‌..

UPI | భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) కోసం కొత్త ఆఫ్‌లైన్ పేమెంట్ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వినియోగదారుడి మొబైల్‌లో కానీ, వ్యాపార సంస్థల పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినల్‌లో కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు చేయడం సాధ్యమవుతుంది.

S

Technology | Published On Jul 21, 2026, 4.34 pm IST

UPI | ఇక యూపీఐలో ఇంట‌ర్నెట్ లేకున్నా చెల్లింపులు.. త్వ‌ర‌లో కొత్త ట్యాప్ అండ్ పే ఫీచ‌ర్‌..
Advertisement

UPI | భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) కోసం కొత్త ఆఫ్‌లైన్ పేమెంట్ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వినియోగదారుడి మొబైల్‌లో కానీ, వ్యాపార సంస్థల పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినల్‌లో కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు చేయడం సాధ్యమవుతుంది. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం యూపీఐని నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఈ ఏడాదిలోనే దేశంలోని ప్రముఖ పీఓఎస్ టెర్మినల్ తయారీ సంస్థల పరికరాలకు సర్టిఫికేషన్ ఇవ్వనుంది. దీంతో ఈ పరికరాల్లో ఆఫ్‌లైన్ యూపీఐ లావాదేవీలు సాధ్యమవుతాయి. ఈ కొత్త సదుపాయంతో వినియోగదారులు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను ట్యాప్ చేసి చెల్లింపులు చేయగలుగుతారు. ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితిని రూ.2వేలుగా నిర్ణయించనున్నట్లు సమాచారం. ఇది ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులతో అందుబాటులో ఉన్న ట్యాప్ అండ్ పే ఫీచ‌ర్ ను పోలి ఉంటుంది.

యూపీఐ లైట్ ఎక్స్‌కు కొన‌సాగింపుగా..

ఎన్‌పీసీఐ ప్రవేశపెట్టిన యూపీఐ లైట్ ఎక్స్ సేవకు కొనసాగింపుగా ఈ స‌దుపాయాన్ని తీసుకువస్తోంది. అప్పట్లో ఎన్‌ఎఫ్‌సీ సదుపాయం ఉన్న రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య ఇంటర్నెట్ లేకుండానే పరిమిత మొత్తంలో యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు అదే ఆఫ్‌లైన్ సౌకర్యాన్ని తొలిసారిగా పీఓఎస్ మెషీన్లకు విస్తరించనున్నారు. దీంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా వ్యాపారులు యూపీఐ చెల్లింపులను స్వీకరించగలుగుతారు. విమాన ప్రయాణాల సమయంలో, భూగర్భ మెట్రో నెట్‌వర్క్‌లలో వంటి సిగ్నల్ బలహీనంగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ సదుపాయం ఉపయోగపడనుంది. ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపులను స్వీకరించే అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి ముందు పీఓఎస్ కంపెనీలు ఎన్‌పీసీఐ నుంచి తప్పనిసరిగా సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది.

ఎలా ప‌నిచేస్తుంది..

మొబైల్ యాప్ ద్వారా ట్యాప్ చేసి చెల్లింపు చేసిన వెంటనే, పీఓఎస్ టెర్మినల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ లావాదేవీ వివరాలు నమోదు అవుతాయి. అనంతరం నెట్‌వర్క్ కనెక్టివిటీ తిరిగి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ లావాదేవీ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ కొత్త ఫీచర్‌తో చెల్లింపుల సమయంలో వినియోగదారులు ప్రతిసారీ యూపీఐ పిన్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదని నివేదిక పేర్కొంది. ఇందుకోసం వినియోగదారులు ముందుగానే తమ డివైస్‌లోని యూపీఐ లైట్ వాలెట్ లో నిధులను లోడ్ చేసుకుని, కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటిని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. ఈ చర్యతో యూపీఐ, కార్డ్ నెట్‌వర్క్‌ల మధ్య ఇప్పటివరకు ఉన్న ప్రధాన వ్యత్యాసాల్లో ఒకటి తొలగిపోనుంది. ఎందుకంటే చిప్ ఆధారిత ఆఫ్‌లైన్ లావాదేవీలకు కార్డ్ నెట్‌వర్క్‌లు ఇప్పటికే మద్దతు ఇస్తున్నాయి.

కొన్ని కార్డ్ జారీ సంస్థలు సాంకేతిక, నిర్వహణ సమస్యల కారణంగా విమానాల్లో కార్డ్ ట్యాప్ అండ్ పే వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. ప్రారంభ దశలో రూ.2వేల పరిమితితో రానున్న ఈ కొత్త యూపీఐ ఆఫ్‌లైన్ ఫీచర్ అలాంటి సమస్యలకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement