త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ChatGPT | భార‌త్‌లో చాట్‌జీపీటీని అధికంగా వాడుతోంది యువ‌తే.. వెల్ల‌డించిన ఓపెన్ఏఐ..

ChatGPT | ఓపెన్ ఏఐ(OpenAI)కి చెందిన జ‌న‌రేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్ చాట్ జీపీటీ (ChatGPT)ని భార‌త్‌లో అధిక శాతం యుక్త వ‌యస్సు వారే ఉప‌యోగిస్తున్నార‌ని ఆ సంస్థ తెలిపింది. 18 నుంచి 24 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగిన వారు చాట్ జీపీటీని అధికంగా వాడుతున్నార‌ని ఓపెన్ఏఐ తెలియ‌జేసింది.

S

Technology | Published On Feb 22, 2026, 1.21 pm IST

ChatGPT | భార‌త్‌లో చాట్‌జీపీటీని అధికంగా వాడుతోంది యువ‌తే.. వెల్ల‌డించిన ఓపెన్ఏఐ..
Advertisement

ChatGPT | ఓపెన్ ఏఐ(OpenAI)కి చెందిన జ‌న‌రేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్ చాట్ జీపీటీ (ChatGPT)ని భార‌త్‌లో అధిక శాతం యుక్త వ‌యస్సు వారే ఉప‌యోగిస్తున్నార‌ని ఆ సంస్థ తెలిపింది. 18 నుంచి 24 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగిన వారు చాట్ జీపీటీని అధికంగా వాడుతున్నార‌ని ఓపెన్ఏఐ తెలియ‌జేసింది. దేశంలోని మొత్తం చాట్ జీపీటీ యూజర్ల‌లో 80 శాతం మంది 30 ఏళ్ల లోపు వారే అని స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ 2026లో ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మ‌న్ ఇవే వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌పంచ వ్యాప్త జ‌న‌రేటివ్ ఏఐ మార్కెట్‌లో భార‌త్ త‌మ‌కు రెండో పెద్ద దేశంగా ఉంద‌ని, భార‌త్‌లో చాట్ జీపీటీకి సుమారుగా 10 కోట్ల మంది వీక్లీ యూజ‌ర్లు ఉన్నార‌ని చెప్పారు. తాజాగా ఓపెన్ ఏఐ విడుద‌ల చేసిన గ‌ణాంకాల‌తో ఈ విష‌యంపై మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది.

వృత్తిప‌ర‌మైన అవ‌స‌రాల‌కు..

చాలా మంది భార‌తీయులు చాట్ జీపీటీని త‌మ ఉద్యోగ లేదా వ్యాపార అవ‌స‌రాల‌కు వాడుతున్నార‌ని ఓపెన్ ఏఐ తెలిపింది. భార‌త్‌లో మొత్తం చాట్ జీపీటీ యూజ‌ర్ల నుంచి వ‌స్తున్న మెసేజ్‌ల‌లో 35 శాతం వ‌ర‌కు వృత్తిప‌ర‌మైన ఉప‌యోగాల‌కు సంబంధించిన‌వే ఉంటున్నాయ‌ని తెలియ‌జేసింది. ప్ర‌పంచ స‌గ‌టుతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ‌గానే ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. చాట్ జీపీటీని భార‌త యూజ‌ర్లు అధికంగా కోడింగ్ సంబంధిత అవ‌స‌రాల‌కు వాడుతున్నార‌ని తేలింది. ప్ర‌పంచంతో పోలిస్తే ఈ విష‌యంలోనూ ఈ శాతం ఎక్కువ‌గానే ఉంద‌ని పేర్కొంది. ముఖ్యంగా ఇటీవ‌లి కాలంలో కోడింగ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు ప్ర‌పంచంతో పోలిస్తే భార‌త్‌లో అధికంగా పెరుగుతున్నాయ‌ని తెలిపింది. దీని వ‌ల్ల భార‌త్‌లో ప్రోగ్రామింగ్ కోసం ఏఐ టూల్స్ వాడ‌కంపై డెవ‌ల‌ప‌ర్ల‌లో ఆస‌క్తి పెరుగుతున్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని తెలిపింది.

ఓపెన్ఏఐ ప్ర‌స్తుతం భార‌త్‌లో త‌న ప‌రిధిని మ‌రింత విస్త‌రించే ప్ర‌ణాళిక‌లో ఉంది. ముంబై, బెంగ‌ళూరుల‌లో ఈ ఏడాది త‌న కార్యాలయాల‌ను ప్రారంభించాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే టాటా గ్రూప్ వంటి కంపెనీల‌తో భాగ‌స్వామ్యం అయి సేవ‌ల‌ను అందిస్తోంది. అలాగే పైన్ ల్యాబ్స్‌, ఇక్సిగో, మేక్ మై ట్రిప్‌, ఎట‌ర్న‌ల్ వంటి కంపెనీల‌తోనూ చాట్ జీపీటీ భాగ‌స్వామ్యం అయి త‌న సేవ‌ల‌ను మ‌రింత విస్తృత ప‌రుస్తోంది. ఇక విద్యార్థుల‌కు కూడా త‌క్కువ నెల‌వారి ఖ‌ర్చుతో నూత‌న స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్‌ల‌ను అందుబాటులోకి తేవాల‌ని ఓపెన్ఏఐ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా క‌నీసం 1 ల‌క్ష మంది విద్యార్థులు త‌మ క‌స్ట‌మ‌ర్లుగా మారాల‌ని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement
Advertisement