త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JP Morgan CEO | ఆంథ్రోపిక్ కొత్త ఏఐ మోడ‌ల్‌తో సైబ‌ర్ భ‌ద్ర‌త‌కు పెను ముప్పు.. జేపీ మోర్గాన్ సీఈవో హెచ్చ‌రిక‌..

JP Morgan CEO | టెక్ ప్ర‌పంచంలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ వ‌ల్ల ఇప్ప‌టికే అంత‌ర్జాతీయంగా అనేక కంపెనీలు స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆంథ్రోపిక్ తాజాగా అభివృద్ధి చేస్తున్న మ‌రో కొత్త ఏఐ మోడ‌ల్ క్లాడ్ మైథోస్ టెక్ దిగ్గ‌జ సంస్థ‌ల్లో గుబులు రేపుతోంది.

S

Technology | Published On Apr 11, 2026, 5.39 pm IST

JP Morgan CEO | ఆంథ్రోపిక్ కొత్త ఏఐ మోడ‌ల్‌తో సైబ‌ర్ భ‌ద్ర‌త‌కు పెను ముప్పు.. జేపీ మోర్గాన్ సీఈవో హెచ్చ‌రిక‌..
Advertisement

JP Morgan CEO | టెక్ ప్ర‌పంచంలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ వ‌ల్ల ఇప్ప‌టికే అంత‌ర్జాతీయంగా అనేక కంపెనీలు స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆంథ్రోపిక్ తాజాగా అభివృద్ధి చేస్తున్న మ‌రో కొత్త ఏఐ మోడ‌ల్ క్లాడ్ మైథోస్ టెక్ దిగ్గ‌జ సంస్థ‌ల్లో గుబులు రేపుతోంది. ఈ ఏఐ మోడ‌ల్ ప్ర‌భావంతో ఎంట‌ర్ ప్రైజ్ సాఫ్ట్‌వేర్ స్టాక్స్‌లో సుమారు 2 ట్రిలియ‌న్ డాల‌ర్ల విలువ క్షీణించ‌గా, అమెరికా ట్రెజ‌రీలో అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని కూడా నిర్వ‌హించారు. సాఫ్ట్ వేర్ లోపాల‌ను గుర్తించి దుర్వినియోగం చేసే అసాధార‌ణ సామ‌ర్థ్యం ఈ కొత్త ఏఐ మోడ‌ల్‌కు ఉంద‌ని తెలుస్తుండ‌డంతో సైబ‌ర్ భ‌ద్ర‌త‌, టెక్నాల‌జీ రంగంపై దీని ప్ర‌భావం గురించి తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్తమ‌వుతున్నాయి.

ఏఐ మోడ‌ల్స్ వ‌ల్ల సైబ‌ర్ భ‌ద్ర‌త‌కు ముప్పు..

అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌, ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ ప‌వెల్ ఇటీవ‌ల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటిగ్రూప్, గోల్డ్‌మాన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో వంటి ప్రముఖ బ్యాంకుల సీఈవోలు హాజరయ్యారు. జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జేమీ డైమన్ కు ఆహ్వానం పంపినప్పటికీ ఆయన హాజరు కాలేకపోయారు. ఈ సమావేశంలో వడ్డీ రేట్లు లేదా టారిఫ్‌లు వంటి సాధారణ అంశాలపై కాకుండా, ఆంథ్రోపిక్ ఇంకా విడుదల చేయని క్లాడ్ మైథోస్ ఏఐ మోడల్ వల్ల ఏర్పడే సైబర్ భద్రతా ప్రమాదాలపై చర్చించారు. అయితే జేమీ డైమన్ ఈ స‌మావేశానికి హాజ‌రు కాలేక‌పోయినా ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. రానున్న రోజుల్లో సైబ‌ర్ భ‌ద్ర‌త టెక్ ప్ర‌పంచానికి పెద్ద స‌వాల్‌గా మారుతుంద‌న్నారు. ఏఐ వ‌ల్ల ముప్పు మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని, వాటిని ఎదుర్కొనేందుకు భారీ పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని ఆయ‌న లేఖ‌లో హెచ్చ‌రించారు. అయితే ఆయ‌న ప‌రోక్షంగా ఆంథ్రోపిక్ క్లాడ్ మైథోస్ ఏఐ మోడ‌ల్‌పై వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీంతో ఈ విష‌యం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

భారీగా ప‌త‌న‌మైన ఐటీ స్టాక్స్‌..

ఆంథ్రోపిక్ ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఏఐ మోడ‌ల్స్ కార‌ణంగా ఎంట‌ర్ ప్రైజ్ సాఫ్ట్ వేర్ స్టాక్స్‌లో ఇటీవ‌లి కాలంలో భారీ ప‌త‌నాలు న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలోనే క్లాడ్ మైథోస్ ఏఐ మోడ‌ల్ రిలీజ్ అయితే ఐటీ స్టాక్స్ ఏ ర‌కంగా ప‌త‌నం అవుతాయో అస‌లు ఊహించ‌లేమ‌ని, ఆ రంగానికి చెందిన సంస్థ‌లు తీవ్ర న‌ష్టాల‌ను ఎదుర్కొంటాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ విష‌యాల‌న్నింటిపై ఆంథ్రోపిక్ సంస్థ స్పందించింది. క్లాడ్ మైథోస్ మోడ‌ల్‌ను ప‌బ్లిక్‌కు అందుబాటులో ఉంచ‌లేద‌ని పేర్కొంది. దీన్ని యాక్సెస్ చేయ‌డం అంత ఈజీ కాద‌ని, క‌ఠిన‌మైన నియంత్ర‌ణ‌ల‌తో యాక్సెస్‌ను రిస్ట్రిక్ట్ చేశామ‌ని తెలిపింది. అయితే ఈ మోడ‌ల్ రిలీజ్ అవ‌డంపై మాత్రం ఆ సంస్థ స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

Advertisement
Advertisement