త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండ‌దు.. ప్రైవ‌సీ లేన‌ట్లే..

Instagram | మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన చాట్‌లలో ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) సదుపాయాన్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు మే 9 నుంచి అమల్లోకి రానుంది. దీని వల్ల వినియోగదారులు పంపించుకునే సందేశాలు ఇకపై పూర్తిగా ప్రైవేట్‌గా ఉండవు.

S

Technology | Published On Mar 16, 2026, 2.32 pm IST

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండ‌దు.. ప్రైవ‌సీ లేన‌ట్లే..
Advertisement

Instagram | మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన చాట్‌లలో ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) సదుపాయాన్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు మే 9 నుంచి అమల్లోకి రానుంది. దీని వల్ల వినియోగదారులు పంపించుకునే సందేశాలు ఇకపై పూర్తిగా ప్రైవేట్‌గా ఉండవు. ఇన్‌స్టాగ్రామ్ తన సపోర్ట్ పేజీలో వెల్లడించిన ప్రకారం 2026 మే 8 తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌కు స‌పోర్ట్‌ ఉండద‌ని పేర్కొంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే పంపిన సందేశాలను పంపిన వ్యక్తి, స్వీకరించే వ్యక్తి మాత్రమే చూడగలిగే విధంగా ఉండటం. ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం ఈ విధానం వల్ల మీరు, మీరు సంభాషిస్తున్న వ్యక్తులు మాత్రమే పంపిన సమాచారాన్ని చూడగలరు లేదా వినగలరు. మెటా సహా మరెవరూ దానిని చూడలేరు. అయితే కొత్త మార్పుల తర్వాత మెటా సంస్థకు కూడా ఆ సందేశాను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే డేటా కోసం అభ్యర్థించే ప్రభుత్వ సంస్థలు కూడా ఆ సమాచారాన్ని చూడగల అవకాశం ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ హెల్ప్ పేజీల్లో అప్‌డేట్‌..

ఇప్పటి వరకు మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సేవలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. దీనివల్ల ప్లాట్‌ఫామ్‌లో పంపిన సందేశాలను పంపిన వ్యక్తి, స్వీకరించే వ్యక్తి మాత్రమే చూడగలిగేలా భద్రత ఉంటుంది. కానీ మే 8 తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఎన్‌క్రిప్షన్ సదుపాయం ఇక అందుబాటులో ఉండదు. ఈ మార్పు గురించి సంస్థ అధికారికంగా ప్రెస్ రిలీజ్ లేదా బ్లాగ్ పోస్టు విడుదల చేయలేదు. అయితే ఈ సమాచారం ఇన్‌స్టాగ్రామ్ హెల్ప్ పేజీల్లో అప్‌డేట్ అయింద‌ని జీఎస్ఎం అరీనా వెల్ల‌డించింది. ఈ మార్పు అమల్లోకి వచ్చే ముందు వినియోగదారులు తమకు అవసరమైన సందేశాలు లేదా మీడియా ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

త‌క్కువ మంది ఉప‌యోగిస్తున్నందునే..

ఈ నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్ ప్రైవసీ విధానంలో ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఈ విషయంపై మెటా ప్రతినిధి డీనా ఎల్-కస్సాబీ లూస్ మాట్లాడుతూ చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నార‌ని, అందువ‌ల్ల‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను నిలిపివేయాలని నిర్ణయించామ‌ని ది వెర్జ్‌కు తెలిపారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంశం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. వినియోగదారుల సంభాషణలను ప్రభుత్వ సంస్థలతో పంచుకుంటున్నందుకు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో ఎన్‌క్రిప్షన్ సదుపాయం ఉండడం వల్ల చిన్నారులతో అక్రమంగా సంప్రదింపులు జరిపే వ్యక్తులను గుర్తించడం కష్టమవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయం కావాలనుకునే వినియోగదారులు వాట్సాప్‌ను ఉపయోగించాలని మెటా సూచించింది. అలాగే ఈ సదుపాయం మెసెంజర్‌లో కొనసాగుతుందని కూడా సంస్థ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement