త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone | మీరు ఐఫోన్‌ను వాడుతున్నారా..?  వెంట‌నే ఒక‌సారి రీస్టార్ట్ చేయండి.. ఎందుకంటే..?

iPhone | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ వినియోగదారులకు ముఖ్య‌మైన‌ భద్రతా హెచ్చరికను జారీ చేసింది. వందల మిలియన్ల ఐఫోన్ల‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్న సైబర్ దాడులపై ఆ సంస్థ అలర్ట్ ఇచ్చింది. హ్యాకింగ్ ప్రమాదాన్ని తగ్గించే ముందు జాగ్రత్త చర్యగా తమ ఐఫోన్‌లను వెంటనే రీస్టార్ట్ చేయాలని వినియోగదారులకు యాపిల్ సూచించింది.

S

Technology | Published On Jan 14, 2026, 6.30 am IST

iPhone | మీరు ఐఫోన్‌ను వాడుతున్నారా..?  వెంట‌నే ఒక‌సారి రీస్టార్ట్ చేయండి.. ఎందుకంటే..?
Advertisement

iPhone | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ వినియోగదారులకు ముఖ్య‌మైన‌ భద్రతా హెచ్చరికను జారీ చేసింది. వందల మిలియన్ల ఐఫోన్ల‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్న సైబర్ దాడులపై ఆ సంస్థ అలర్ట్ ఇచ్చింది. హ్యాకింగ్ ప్రమాదాన్ని తగ్గించే ముందు జాగ్రత్త చర్యగా తమ ఐఫోన్‌లను వెంటనే రీస్టార్ట్ చేయాలని వినియోగదారులకు యాపిల్ సూచించింది. ఈ మేర‌కు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కాగా యాపిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముప్పు అత్యంత అధునాతన స్పైవేర్ దాడులకు సంబంధించినదిగా తేలింది. వీటిలో జీరో-క్లిక్ ఎక్స్‌ప్లాయిట్స్ అనే సాంకేతికతను హ్యాకర్లు వినియోగిస్తున్నారని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. సాధారణ స్కామ్‌లు లేదా మాల్‌వేర్‌లతో పోలిస్తే, ఈ దాడుల్లో వినియోగదారులు ఎలాంటి లింక్‌ల‌పై క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, అటాచ్‌మెంట్ ల‌ను తెరవాల్సిన పనిలేదు, యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరమూ లేదు. అయినా కూడా వినియోగ‌దారుల‌కు చెందిన ఐఫోన్‌ల‌ను సుల‌భంగా హ్యాక్ చేయ‌వ‌చ్చు. దీన్నే జీరో-క్లిక్ ఎక్స్‌ప్లాయిట్స్ మెథ‌డ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

హై-వాల్యూ వ్య‌క్తులే టార్గెట్‌..

ఇక ఈ విధానంతో హ్యాకర్లు వినియోగదారుల‌కి తెలియకుండానే వారి ఐఫోన్‌ల‌లోకి చొర‌బ‌డే అవ‌కాశం ఉంటుంద‌ని యాపిల్ తెలియ‌జేసింది. సాధారణంగా ఈ తరహా సైబ‌ర్‌ దాడుల‌ను హ్యాక‌ర్లు హై-వాల్యూ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చేప‌డుతార‌ని వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, పోలీసులు, ర‌క్ష‌ణ శాఖ అధికారులు తదితరులు ఒక‌వేళ ఐఫోన్ల‌ను వాడితే ఈ టెక్నిక్ స‌హాయంతో వారి ఐఫోన్ల‌ను చాలా సుల‌భంగా హ్యాక్ చేయ‌వ‌చ్చు. దీంతో వారి వ‌ద్ద సున్నితమైన సమాచారం ఉంటుంది కనుక దాన్ని హ్యాక‌ర్లు త‌స్క‌రిస్తారు. ఈ క్ర‌మంలోనే ఆ హై వాల్యూ వ్య‌క్తుల వ‌ద్ద ఉండే సందేశాల‌తోపాటు వారి కాల్స్‌, ఈ-మెయిల్స్, ఇత‌ర డేటాను హ్యాక‌ర్లు సేక‌రించి దాన్ని సైబర్ నేరగాళ్లకు లేదా ఇత‌ర సంస్థ‌లు, సంఘ విద్రోహ శ‌క్తుల‌కు విక్ర‌యిస్తారు. ఇలా హ్యాక‌ర్లు ఈ విధానం ద్వారా పెద్ద ఎత్తున డేటా చోరీకి పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని యాపిల్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ఐఫోన్‌ను వెంట‌నే రీస్టార్ట్ చేయాలి..

ఈ దాడులు చాలాసార్లు జీరో-డే వల్నరబిలిటీస్ ను వినియోగించుకుంటాయని పేర్కొంది. అంటే, దాడి జరుగుతున్న సమయంలో యాపిల్‌కే తెలియని భద్రతా లోపాలను హ్యాకర్లు ఉపయోగించుకుంటారు. దీంతో ఒక వేళ యాపిల్ సంస్థ‌ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఆ లోపాన్ని సరిచేస్తే ఆలోపే దుండగులు డేటా దుర్వినియోగానికి పాల్పడగలుగుతారు. క‌నుక వారికి ఈ విధానం చాలా సుల‌భంగా ఉంటుంది. అదే క్ర‌మంలో ఐఫోన్ వినియోగ‌దారుల‌తోపాటు, యాపిల్‌కు కూడా ఇది స‌వాల్‌గా మారుతుంది. అలాంటి త‌క్కువ సమ‌యంలో ఐఫోన్‌ను హ్యాక‌ర్ నుంచి సుర‌క్షితంగా ఉంచ‌డం చాలా క‌ష్టంగా మారుతుంది. క‌నుక‌నే ఇలాంటి వాటిని నిరోధించేందుకు యాపిల్ త‌ర‌చూ త‌న ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు గాను సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను విడుద‌ల చేస్తుంది. కాబ‌ట్టి ఐఫోన్ వినియోగ‌దారులు త‌ర‌చూ త‌మ ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను కొత్త వెర్ష‌న్‌కు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇలాంటి హ్యాక‌ర్ల బారిన ప‌డే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయి. అయితే ఈ నూత‌న హ్యాకింగ్‌ విధానం బారిన ప‌డ‌కుండా ఉండేందుకు వినియోగ‌దారులు త‌మ ఐఫోన్ల‌ను ఒక‌సారి రీస్టార్ట్ చేస్తే చాల‌ని, దీంతో చాలా వ‌ర‌కు హ్యాక‌ర్ల నుంచి ముప్పు త‌ప్పుతుంద‌ని యాపిల్ తెలిపింది. క‌నుక ఐఫోన్ వినియోగ‌దారులు ఉన్న ప‌ళంగా వెంట‌నే త‌మ ఐఫోన్ ను ఒక‌సారి రీస్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐఓఎస్ వెర్ష‌న్ ను అప్ డేట్ చేయాలి..

అయితే ఐఫోన్ల‌ను రీస్టార్ట్ చేయడం శాశ్వత పరిష్కారం కాదని యాపిల్ స్పష్టం చేసింది. కొన్ని రకాల స్పైవేర్‌ల‌ను అడ్డుకోవడంలో ఇది సహాయపడుతుందని, అలాగే హ్యాకర్లు ఐఫోన్ పై నియంత్రణ కొనసాగించడం కష్టమవుతుందని తెలిపింది. పూర్తి స్థాయి భద్రతా పరిష్కారం అందుబాటులోకి వచ్చే వరకు ఈ చర్య అదనపు రక్షణగా ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది. అయితే ఈ అత్యాధునిక దాడుల ప్రభావం సాధారణ వినియోగదారులపై పడే అవకాశం చాలా తక్కువేనని కూడా యాపిల్ స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కంపెనీ సూచించింది. తాజా iOS వెర్షన్‌తో ఐఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం, తెలియని లింక్‌లను క్లిక్ చేయకుండా వెంట‌నే మెసేజ్‌ల‌ను డిలీట్ చేయ‌డం, అనుమానాస్పద సందేశాలు లేదా ఫైళ్లను తెరవకపోవడం వంటి సేఫ్టీ చర్యలను పాటిస్తే ఐఫోన్ల‌ను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చ‌ని, తద్వారా డేటా కూడా సుర‌క్షితంగా ఉంటుంద‌ని యాపిల్ తెలిపింది. ఇక ప్రస్తుతం పరిస్థితిని యాపిల్ నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెల‌ప‌గా, ఐఫోన్ల సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడానికి ఆ సంస్థ‌ భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. ఈ క్ర‌మంలోనే ఐఫోన్ వినియోగదారులు క్రమం తప్పకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను ప‌రిశీలించాల‌ని, ఫోన్‌ను అప్‌డేట్ చేయాల‌ని సూచించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement