త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Avor EX | మార్కెట్లో మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌.. ఏఐ ఫీచ‌ర్ల‌తో లాంచ్‌.. రూ.799కే బుకింగ్‌..

Avor EX | భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో మరో స్వదేశీ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సమర్థ్ ఈ-మొబిలిటీ గ్రూప్‌కు చెందిన అవోర్ ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈఎక్స్ సిరీస్ ను అధికారికంగా విడుదల చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చేతుల మీదుగా ఈ సిరీస్‌ను ఆవిష్కరించారు.

S

Automobiles | Published On Jul 29, 2026, 1.44 pm IST

Avor EX | మార్కెట్లో మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌.. ఏఐ ఫీచ‌ర్ల‌తో లాంచ్‌.. రూ.799కే బుకింగ్‌..
Advertisement

Avor EX | భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో మరో స్వదేశీ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సమర్థ్ ఈ-మొబిలిటీ గ్రూప్‌కు చెందిన అవోర్ ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈఎక్స్ సిరీస్ ను అధికారికంగా విడుదల చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చేతుల మీదుగా ఈ సిరీస్‌ను ఆవిష్కరించారు. ఈఎక్స్ 2ఎస్, ఈఎక్స్ 2, ఈఎక్స్ 1 అనే మూడు వేరియంట్లలో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,24,999గా నిర్ణయించారు. స్వదేశీ సాంకేతికత, ఏఐ ఆధారిత స్మార్ట్ ఫీచర్లు, ఎక్కువ రేంజ్, శక్తివంతమైన పనితీరుతో ఈ మోటార్‌సైకిల్ భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో గట్టి పోటీ ఇస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. ఈఎక్స్ సిరీస్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత‌ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటి రూపకల్పన చేసినట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ వినియోగంతోపాటు దూర ప్రయాణాలకు కూడా ఇవి అనుకూలంగా ఉంటాయని పేర్కొంది.

పూర్తి చార్జింగ్‌తో 260 కిలోమీట‌ర్ల మైలేజ్‌..

ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రధాన ఆందోళనగా భావించే రేంజ్‌పై అవోర్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈఎక్స్ 2ఎస్ ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 260 కిలోమీటర్ల ఐడీసీ ధ్రువీకరిత రేంజ్, ఈఎక్స్ 2 మోడ‌ల్ 255 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్, ఈఎక్స్ 1 వేరియెంట్ 160 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ను అందిస్తుందని తెలిపింది. నగర ప్రయాణాలతోపాటు దూర ప్రయాణాలకు కూడా ఈ రేంజ్ సరిపోతుందని కంపెనీ పేర్కొంది. ఈ మోటార్‌సైకిల్‌లో రేర్ ఎర్త్ ఫ్రీ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (పీఎంఎస్‌ఎమ్)ను అమర్చారు. ఇది 7.5 నుంచి 10.5 కిలోవాట్ల గరిష్ఠ శక్తిని, 250 ఎన్ఎం పీక్ వీల్ టార్క్ ను అందిచింది. ఈఎక్స్ 2ఎస్ గరిష్ఠ వేగం గంటకు 114 కిలోమీటర్లు కాగా, ఈఎక్స్ 2, ఈఎక్స్ 1 గరిష్ఠ వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉంటుంద‌ని తెలియ‌జేసింది. కంపెనీ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ మోటార్ ప్లస్ స్వింగ్ ఆర్మ్ పవర్‌ట్రెయిన్ వ్యవస్థ వల్ల మెరుగైన బ్యాలెన్స్, స్థిరత్వం, రైడింగ్ అనుభవం లభిస్తుందని వెల్లడించింది.

1500 వాట్ల ఫాస్ట్ చార్జ‌ర్‌..

ఈ బైక్‌లో 1500 వాట్ల ఆన్‌బోర్డ్ ఫాస్ట్ ఛార్జర్ ను అందించారు. సాధారణ 5ఎ లేదా 15ఎ గృహ విద్యుత్ సాకెట్ ద్వారానే ఛార్జ్ చేసుకోవచ్చు. 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటలు, 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 4 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది. దీంతో ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ అవసరం తగ్గుతుందని పేర్కొంది. ఈఎక్స్ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ ఏఐ ఆధారిత స్మార్ట్ సిస్టమ్. ఇందులో అవోర్ సెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏవీఏ (అవోర్ వెహికల్ అసిస్టెన్స్), ఏఐ ఆధారిత అవోర్ సినాప్స్, ఏపెక్స్ పెర్ఫార్మెన్స్ మోడ్, షిఫ్ట్ మాన్యువల్ గేర్ మోడ్, పార్క్ అసిస్ట్, గైడ్ మీ హోమ్ లైట్స్, ఆటో ఇండికేటర్ కట్ ఆఫ్, వెల్‌కమ్ లైట్స్, బీకన్ ట్యాంక్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి రైడింగ్‌ను మరింత సురక్షితంగా, స్మార్ట్‌గా, సౌకర్యవంతంగా మారుస్తాయని కంపెనీ తెలిపింది. డిజైన్ పరంగా కూడా ఈఎక్స్ సిరీస్‌కు ప్రీమియం డ్యుయల్ టోన్ ఫినిష్ ఇచ్చారు. ఈఎక్స్ 2ఎస్, ఈఎక్స్ 2 వేరియంట్లు స్టార్‌లిట్ బ్లూ డ్యుయల్ టోన్, మీటియర్ రెడ్ డ్యుయల్ టోన్, స్టెల్లార్ బ్లాక్ డ్యుయల్ టోన్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈఎక్స్ 1 మాత్రం స్టార్‌లిట్ బ్లూ, మీటియర్ రెడ్, స్టెల్లార్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది.

బ్యాట‌రీపై 5 ఏళ్ల వారంటీ..

భద్రత విషయంలో కూడా ఈ బైక్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. భారతీయ రహదారులపై లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ బైక్ ఏఐఎస్ 156, ఏఐఎస్ 038 భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో టు ఐక్యాట్ ధ్రువీకరించిన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, నాట్రాక్స్ ఆమోదించిన బ్యాటరీని కలిగి ఉంది. అలాగే బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 60వేల కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. అవోర్ ఈఎక్స్ మోటార్‌సైకిల్ బుకింగ్‌లు అధికారిక వెబ్‌సైట్‌లో రూ.799కే ప్రారంభమయ్యాయి. వచ్చే నెల నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లోని షోరూమ్‌లలో ఈ బైక్ అందుబాటులోకి రానుంది. బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండు నెలల్లో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అహ్మదాబాద్‌లోని పరిశోధన కేంద్రంలో గత మూడు సంవత్సరాలుగా కంపెనీ స్వయంగా మోటార్, బ్యాటరీ ప్యాక్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, మోటార్ కంట్రోలర్, డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జర్, ఆపరేటింగ్ సిస్టమ్ వంటి కీలక సాంకేతికతలను అభివృద్ధి చేసింది. 120కిపైగా మేధోసంపత్తి (ఐపీ) దరఖాస్తుల‌ను కూడా దాఖలు చేసినట్లు వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో ఈ వాహనాన్ని రూపొందించినట్లు పేర్కొంది.

3 సంవ‌త్స‌రాల పాటు ప‌రిశోధ‌న‌..

ఈ సందర్భంగా అవోర్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు ప్రియాంక్ రాఖోలియా మాట్లాడుతూ.. ఈఎక్స్ సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి మూడు సంవత్సరాల పాటు పరిశోధన, అభివృద్ధి, పరీక్షలు, ధ్రువీకరణ ప్రక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. అత్యుత్తమ ఇంజినీరింగ్, వినూత్న సాంకేతికత, ప్రపంచ స్థాయి భద్రత, పనితీరును అందించే భారతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ టెక్నాలజీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రతి భారతీయుడికి ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిష్కారాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈఎక్స్ సిరీస్ తొలి అడుగు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement