త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI | ఏఐతో మానవాళికి ముప్పే.. ఆంథ్రోపిక్ సీఈవో సంచలన వ్యాఖ్యలు..

AI | అంతర్జాతీయంగా గ‌త వారం రోజులుగా అత్యంత శ‌క్తివంత‌మైన ఏఐ మోడ‌ల్స్‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. రాబోయే కొన్నేళ్ల‌లో ఏఐ వ‌ల్ల మ‌నుషులే అంత‌రించిపోయే ప్ర‌మాదం ఉందా అనే దిశ‌గా ఈ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

S

Technology | Published On Sep 14, 2026, 1.51 pm IST

AI | ఏఐతో మానవాళికి ముప్పే.. ఆంథ్రోపిక్ సీఈవో సంచలన వ్యాఖ్యలు..
Advertisement

AI | అంతర్జాతీయంగా గ‌త వారం రోజులుగా అత్యంత శ‌క్తివంత‌మైన ఏఐ మోడ‌ల్స్‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. రాబోయే కొన్నేళ్ల‌లో ఏఐ వ‌ల్ల మ‌నుషులే అంత‌రించిపోయే ప్ర‌మాదం ఉందా అనే దిశ‌గా ఈ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐతో ముడిపడిన ప్రమాదాల గురించి ఆ రంగంలోని కంపెనీలు ఎన్నో ఏళ్లుగా ప్రజలకు నిజం చెప్పలేదని ఆయన అంగీకరించారు. అదే సమయంలో ఏఐతో నిజమైన ప్రమాదాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డారియో అమోడీ అభివృద్ధి చెందుతున్న ఏఐ మోడళ్లపై ఉన్న భయాలు, విస్మరించలేని ప్రమాదాల గురించి మాట్లాడారు. తాను ప్ర‌జ‌ల‌తో అబద్ధం చెప్పన‌ని, నిజమైన ప్రమాదాలు ఉన్నాయని వెల్ల‌డించారు. ఈ సాంకేతికతలో ప్రమాదాలు ఉన్నాయనే విషయాన్ని పరిశ్రమ చాలా కాలంగా ప్రజలకు చెప్పకుండా దాచింద‌ని పేర్కొన్నారు.

మాన‌వాళి అంత‌మ‌వుతుందా..

ఏఐ వల్ల ఎదురయ్యే ప్రధాన ప్రమాదాల్లో మానవాళి పూర్తిగా అంతం కావడం కూడా ఒకటని అమోడీ అన్నారు. ఆంథ్రోపిక్ మాజీ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఇటీవల ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమోడీ స్పందించారు. ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ వంటి కంపెనీలు ప్రజల ప్రాణాలతో జూదం ఆడుతున్నాయని కాక్సన్ ఆరోపించారు. ఏఐని నిర్మిస్తున్న వ్యక్తులు, ఈ దశాబ్దం ముగిసేలోపే ఏఐ మనందరినీ చంపే అవకాశం ఉందని నిజంగానే నమ్ముతున్నార‌ని పేర్కొన్నారు. కాక్సన్ హెచ్చరికపై స్పందించిన అమోడీ.. ఏఐ అభివృద్ధి ఇంత వేగంగా జరుగుతున్నప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో తాను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని అన్నారు. అయితే ప్రస్తుతం ఏఐ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ఇది ఒక హెచ్చరిక సంకేతంగా చూడాలని స్పష్టం చేశారు. సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలోనూ అమోడీ.. కాక్సన్ అభిప్రాయాలతో తాను విభేదించిన దానికంటే ఎక్కువగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. అయితే ఏఐ వల్ల విపత్తు తప్పదని మాత్రం ఆయన చెప్పలేదు. ఇదే సమయంలో ఓపెన్‌ఏఐ భద్రతా పరిశోధకుడు మార్కస్ విలియమ్స్.. రాబోయే మూడేళ్లలో ఏఐ కారణంగా మానవాళి అంతరించిపోయే అవకాశం 70 శాతం వరకు ఉంటుంద‌ని ఇటీవల పేర్కొన్నారు.

ఎలా నిర్మించార‌న్న‌దే ముఖ్యం..

అయితే ఏఐ ప్రమాదాన్ని ఒక సాధారణ శాతంగా చెప్పడం సరికాదని అమోడీ అన్నారు. పరిశ్రమ ఏ దిశలో అభివృద్ధి చెందుతుందనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుందని వివరించారు. ఏఐని సరైన విధానంలో నిర్మిస్తే చెడు పరిణామాలు సంభవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, తప్పు విధానంలో నిర్మిస్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలన్న అమోడీ పిలుపుకు ఇతర టెక్ రంగ ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభించింది. ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ తమ కంపెనీ వ్యవస్థలను స్వతంత్ర మూల్యాంకన సంస్థలు ఉద్యోగుల స్థాయి ప్రాప్యతతో పరిశీలించే విధానానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఎలాన్ మస్క్ కూడా ఎక్స్‌లో డారియో చెప్పింది సరైనదే అని స్పందించారు. ఏఐ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్ కొత్త ఏఐ మోడళ్ల విడుదలను నిలిపివేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అలా చేయాల్సిన అవసరం లేదని డారియో అమోడీ స్పష్టం చేశారు. ప్రతి కొత్త తరం ఏఐ మోడల్‌ను విడుదల చేసే ముందు తగిన స్థాయిలో పరీక్షించాలని ఆయన అన్నారు.

కిల్ స్విచ్ ఉండాలి..

ఎక్స్‌లో షేర్ చేసిన ఒక వ్యాసంలోనూ అమోడీ ఆంథ్రోపిక్ తమ వ్యవస్థలకు మూడో పక్ష మూల్యాంకన సంస్థలకు శాశ్వతంగా ఉద్యోగుల స్థాయి ప్రాప్యత కల్పించబోతున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా మోడళ్ల ప్రవర్తన, శిక్షణ ప్రక్రియలు, కంపెనీ ప్రకటించిన భద్రతా విధానాలను అమలు చేస్తుందా లేదా అనే అంశాలను స్వతంత్రంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. అయితే ఏఐ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు మరిన్ని ప్రతిపాదనలు కూడా చర్చలో ఉన్నాయి. సూపర్‌ఇంటెలిజెన్స్‌పై నిషేధం విధించడం, ప్రమాదకరంగా మారే ఏఐ వ్యవస్థలను వెంటనే నిలిపివేయగలిగే తప్పనిసరి కిల్ స్విచ్ ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు అందులో ఉన్నాయి. కిల్ స్విచ్ ఆలోచన మంచిదే అని అమోడీ అన్నారు. అయితే సూపర్‌ఇంటెలిజెన్స్‌పై పూర్తిస్థాయి నిషేధానికి తాను మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఏఐ ద్వారా లభించే అద్భుతమైన ప్రయోజనాలు, ముఖ్యంగా వైద్య రంగంలో కొత్త చికిత్సలు, ప్రాణరక్షక పరిష్కారాలను కోల్పోవడం తనకు సమ్మతం కాదని చెప్పారు. అలలాగే అమెరికా ఈ సాంకేతికతను పూర్తిగా నిలిపివేసినా.. ఇతర దేశాలు, ముఖ్యంగా నియంతృత్వ పాలనలో ఉన్న దేశాలు దీన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని వివరించారు.

ఒకే కంపెనీ, ప్ర‌భుత్వం చేతుల్లో ఉండొద్దు..

చైనా ఏఐ అభివృద్ధిని నెమ్మదించకపోతే అమెరికా మాత్రం నెమ్మదించాలా అనే ప్రశ్నకు అమోడీ స్పందిస్తూ.. ఇదే అత్యంత క్లిష్టమైన సమస్య అని అన్నారు. ఏఐ విషయంలో అమెరికా ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇదే అత్యంత కఠినమైన అంశమని పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలనే ప్రశ్నపైనా అమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వంటి శక్తివంతమైన సాంకేతికతను ఒక ప్రైవేట్ కంపెనీ నిర్మించడం తనకు మొదటి నుంచీ విచిత్రంగానే అనిపించిందని అన్నారు. ఈ వాస్తవం పట్ల తాను అసౌకర్యంగా ఉన్నానని చెప్పారు. అలాగే సరైన ప్రభుత్వాల కలయికతో కూడిన పర్యవేక్షణకు తాను సిద్ధంగా ఉన్నానని అమోడీ తెలిపారు. అయితే మొత్తం సాంకేతికతను ఒకే ప్రభుత్వానికి అప్పగించడం కూడా ప్రమాదకరమేనని హెచ్చరించారు. ఒక కంపెనీ ఏఐని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్లే.. ఒక ప్రభుత్వం కూడా ఈ శక్తివంతమైన సాంకేతికతను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement