త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌తో ముంబ‌యి సిద్ధివినాయ‌క ఆల‌యానికి సూర్య‌కుమార్‌, గంభీర్‌

P

Sports | Published On Mar 14, 2026, 8.54 pm IST

T20 World Cup | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌తో ముంబ‌యి సిద్ధివినాయ‌క ఆల‌యానికి సూర్య‌కుమార్‌, గంభీర్‌
Advertisement

T20 World Cup | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav), హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir) శ‌నివారం ముంబ‌యిలోని ప్ర‌ముఖ సిద్ధివినాయ‌క మందిరాన్ని (Shree Siddhivinayak Temple) సంద‌ర్శించారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీతో ఆల‌యానికి చేరుకొని, వినాయ‌కుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆలయ అధికారులు, పురోహితులతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగారు. ఈ సంద‌ర్భంగా ఆలయ ప్రాంగణం “గణపతి బప్పా మోరియా”, “భారత్ మాతా కి జై” నినాదాల‌తో మార్మోగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి.

గత ఆదివారం అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వ‌రుస‌గా రెండోసారి, మొత్తంగా మూడోసారి ట్రోఫీని గెలిచింది. విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు ఐసీసీ చైర్మన్ జైషా అహ్మదాబాద్ సమీపంలోని హనుమాన్ ఆలయాన్ని కూడా ట్రోఫీతో కలిసి సందర్శించారు. అయితే, ఈ చర్యపై మాజీ క్రికెటర్, ప్రస్తుత ఓ పార్టీ నేత అయిన కీర్తి ఆజాద్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 1983 వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. గౌతమ్ గంభీర్, బీసీసీఐ కార్యదర్శి దేవ‌జిత్ సైకియా ఆ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. ఈ విషయంపై క్రీడాభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు రాణించింది. సూపర్ ఎయిట్స్ దశలో దక్షిణాఫ్రికా చేతిలో చేతిలోనే ఓటమి పాలైంది.

ఇదిలా ఉండ‌గా.. టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. మ‌ళ్లీ అంద‌రి దృష్టి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌పై ప‌డింది. వ‌చ్చే ఏడాది ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగ‌నున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు గంభీర్ తెలిపాడు. ఐపీఎల్ సీజన్ ముగిసే సరికి టీమ్ మేనేజ్‌మెంట్ వ‌ద్ద స్ప‌ష్ట‌మైన బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఐపీఎల్‌లో మార్చి 28 నుంచి మొద‌లుకానుంది. అయితే, ప్రస్తుతం తొలి దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. మూడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను బట్టి మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

Advertisement
Advertisement