త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL-RCB | రూ.2లక్షల కోట్ల దిశగా ఐపీఎల్‌ విలువ.. ఆర్సీబీకి అరుదైన ఘనత

IPL-RCB | ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్‌ ప్రభావం మరింత విస్తరిస్తోంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే ఈ లీగ్‌ ఇప్పుడు కేవలం క్రీడా టోర్నీగానే కాకుండా భారీ వ్యాపార వేదికగా ఎదిగింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ విలువ తాజాగా రూ.2 లక్షల కోట్లకు చేరువైంది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ హౌలిహాన్‌ లోకీ 2026 బ్రాండ్‌ వాల్యుయేషన్‌ నివేదిక ప్రకారం.. ఐపీఎల్‌ మొత్తం వ్యాపార విలువ 20.6 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.1.97 లక్షల కోట్లు) చేరింది.

P

Sports | Published On Jul 29, 2026, 6.29 pm IST

IPL-RCB | రూ.2లక్షల కోట్ల దిశగా ఐపీఎల్‌ విలువ.. ఆర్సీబీకి అరుదైన ఘనత
Advertisement

IPL-RCB | ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్‌ ప్రభావం మరింత విస్తరిస్తోంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే ఈ లీగ్‌ ఇప్పుడు కేవలం క్రీడా టోర్నీగానే కాకుండా భారీ వ్యాపార వేదికగా ఎదిగింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ విలువ తాజాగా రూ.2 లక్షల కోట్లకు చేరువైంది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ హౌలిహాన్‌ లోకీ 2026 బ్రాండ్‌ వాల్యుయేషన్‌ నివేదిక ప్రకారం.. ఐపీఎల్‌ మొత్తం వ్యాపార విలువ 20.6 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.1.97 లక్షల కోట్లు) చేరింది. గత ఏడాదితో పోలిస్తే 11.4 శాతం వృద్ధి నమోదైంది. లీగ్‌ బ్రాండ్‌ విలువ కూడా 4.3 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.41 వేల కోట్లు) పెరిగింది. 2023 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువలో రూ.9వేల కోట్లకుపైగా వృద్ధి కనిపించింది.

ఆర్సీబీకి అగ్రస్థానం..

ఫ్రాంచైజీల బ్రాండ్‌ విలువలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త రికార్డు సృష్టించింది. జట్టు విలువ 312 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.2,987 కోట్లు) చేరి, ప్రపంచ క్రికెట్‌లో రూ.3 వేల కోట్ల మార్కుకు చేరువైన తొలి జట్టుగా నిలిచింది. 2025లోని రూ.2,576 కోట్ల విలువతో పోలిస్తే ఏడాదిలో దాదాపు 16 శాతం వృద్ధి సాధించింది. ముంబయి ఇండియన్స్‌ 264 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,528 కోట్లు) విలువతో రెండో స్థానంలో ఉండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 245 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,346 కోట్లు)తో మూడో స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ 244 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,336 కోట్లు)తో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.1,608 కోట్ల విలువతో ఐదో స్థానంలో ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.1,541 కోట్లు, పంజాబ్‌ కింగ్స్‌ రూ.1,513 కోట్లు, గుజరాత్‌ టైటాన్స్‌ రూ.1,503 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.1,494 కోట్లు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ.1,168 కోట్ల విలువను నమోదు చేశాయి.

భారీ పెట్టుబడులతో ఫ్రాంచైజీలకు ఊతం

ఐపీఎల్‌ జట్లలో జరిగిన తాజా యాజమాన్య మార్పులు లీగ్‌ వాణిజ్య బలాన్ని మరింత పెంచాయి. బ్లాక్‌స్టోన్‌, బోల్ట్‌ వెంచర్స్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌తో కూడిన కన్సార్టియం ఆర్సీబీని సుమారు రూ.17,042 కోట్ల విలువతో కొనుగోలు చేసింది. మరోవైపు మిట్టల్‌ కుటుంబం, అదర్‌ పూనావాలా కలిసి రాజస్థాన్‌ రాయల్స్‌ను దాదాపు రూ.15,797 కోట్ల విలువతో సొంతం చేసుకున్నారు. ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి ఐపీఎల్‌కు పెరుగుతున్న ఆదరణకు ఈ ఒప్పందాలు నిదర్శనమని నివేదిక పేర్కొంది.

డిజిటల్‌ జోరు

ఐపీఎల్‌ ఆదరణ డిజిటల్‌ వేదికల్లోనూ కొనసాగుతోంది. 2026 సీజన్‌ను 1.06 బిలియన్‌ స్క్రీన్లలో వీక్షించినట్లు గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాదితో పోలిస్తే వీక్షకుల సంఖ్య 7 శాతం పెరిగింది. కనెక్టెడ్‌ టీవీ విభాగంలో 26 శాతం వృద్ధి నమోదైంది. అయితే సంప్రదాయ టీవీ రేటింగ్స్‌లో 18.8 శాతం తగ్గుదల కనిపించింది. పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని నెస్‌ వాడియా మాట్లాడుతూ.. ఐపీఎల్‌ ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా లీగ్‌లలో ఒకటిగా ఎదుగుతుందని నమ్మామని.. అయితే ఇంత వేగంగా ఈ స్థాయికి చేరుతుందని ఊహించలేదని అన్నారు. ఆటగాళ్ల కెరీర్‌లను మార్చడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించి, భారత క్రీడా రంగానికి కొత్త దిశను చూపిందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement