త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | రాజ‌స్థాన్‌తో అందుక‌నే ఓడిపోయాం.. అస‌లు కార‌ణం చెప్పిన ర‌షీద్‌ఖాన్‌..

IPL 2026 | అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో శ‌నివారం రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ చేతిలో గుజ‌రాత్ టైటాన్స్ కేవ‌లం 6 ప‌రుగుల తేడాతో ఓడిపోవ‌డంపై ఆతిథ్య జ‌ట్టు తాత్కాలిక కెప్టెన్ ర‌షీద్ ఖాన్ స్పందించాడు.

S

Cricket | Published On Apr 5, 2026, 10.05 am IST

IPL 2026 | రాజ‌స్థాన్‌తో అందుక‌నే ఓడిపోయాం.. అస‌లు కార‌ణం చెప్పిన ర‌షీద్‌ఖాన్‌..
Advertisement

IPL 2026 | అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో శ‌నివారం రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ చేతిలో గుజ‌రాత్ టైటాన్స్ కేవ‌లం 6 ప‌రుగుల తేడాతో ఓడిపోవ‌డంపై ఆతిథ్య జ‌ట్టు తాత్కాలిక కెప్టెన్ ర‌షీద్ ఖాన్ స్పందించాడు. మ్యాచ్ అనంత‌రం మాట్లాడుతూ తాము త‌మ ఇన్నింగ్స్‌లో మ‌ధ్య ఓవ‌ర్ల‌లో మూమెంటం కోల్పోయామ‌ని, అది చివ‌ర్లో చేయాల్సిన ప‌రుగుల‌పై ప్ర‌భావం చూపించింద‌ని, అందువ‌ల్లే ఓట‌మి పాలయ్యామ‌ని అన్నాడు. రాజస్థాన్ 210/6 స్కోర్ చేసిన తర్వాత 211 లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం వరకు గెలుపు దిశగా కనిపించింది. ముఖ్యంగా ఓపెనర్ సాయి సుద‌ర్శ‌న్ స్థిరమైన ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడిపించాడు. అయితే మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో జట్టు ఫ్లో దెబ్బతింది. చివరకు గుజరాత్ 204/8 వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. తుషార్ దేశ్‌పాండే వేసిన చివరి ఓవర్లో గుజ‌రాత్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

మ‌ధ్య ఓవ‌ర్ల‌లో వికెట్లు కోల్పోయాం..

ఈ ఓటమిపై స్పందించిన రషీద్ త‌మ ఓట‌మికి మ‌ధ్య ఓవ‌ర్ల‌లో జ‌ట్టుకు ఫ్లో దెబ్బ‌తిన‌డ‌మే కార‌ణ‌మని అన్నాడు. రెగ్యుల‌ర్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ లేక‌పోయినా జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బరిచింద‌ని, బౌల‌ర్లు కూడా బాగానే బౌలింగ్ చేశార‌ని అన్నాడు. తాము చాలా బాగా బౌలింగ్ చేశామ‌ని, ప్రారంభంలో బలంగా ఆడినప్పటికీ రాజ‌స్థాన్‌ను 210 కే క‌ట్ట‌డి చేయ‌డం గొప్ప విషయం అని అన్నాడు. ఈ పిచ్‌పై బౌలర్ల ప్రయత్నం అద్భుతమ‌ని, బ్యాటింగ్‌లో కూడా తాము మంచి ఆరంభం చేశామ‌ని అన్నాడు. ఓపెనర్లు మంచి ప్రారంభం ఇచ్చార‌ని, కానీ 12, 13వ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం త‌మ‌కు పెద్ద దెబ్బగా మారింద‌ని, అదే సమయంలో మ్యాచ్‌పై త‌మ‌ పట్టు తగ్గింద‌ని అన్నాడు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని, లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యమేనని భావించినట్లు చెప్పాడు. ఇలాంటి పిచ్‌పై ఓవర్‌కు 9-10 పరుగులు చేయడం పెద్ద పని కాద‌ని, కానీ వికెట్ల‌ను కోల్పోవ‌డంతో జ‌ట్టు మూమెంటం దెబ్బ తింద‌ని, కొంత సమయం పాటు డాట్ బాల్స్ ఆడ‌డం దెబ్బ తీసింద‌ని అన్నాడు. బౌండరీలు సులభంగా వచ్చాయి కానీ ఆ సమయంలో త్వరగా వికెట్లు కోల్పోవడం వల్ల చివరి వరకు అదే వేగాన్ని కొనసాగించలేకపోయామ‌ని తెలిపాడు.

మ‌ళ్లీ పుంజుకుంటాం..

అయితే ఇప్ప‌టికే గుజ‌రాత్ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో ఓడిన నేప‌థ్యంలో త‌మ జ‌ట్టు మ‌ళ్లీ పుంజుకుంటుంద‌ని, త‌దుప‌రి మ్యాచ్‌లలో విజ‌యం సాధిస్తామ‌న్న న‌మ్మ‌కాన్ని ర‌షీద్ వ్య‌క్తం చేశాడు. ప్రతి ఆటగాడికి తనదైన గేమ్ ప్లాన్ ఉంటుంద‌ని, పరిస్థితులను బట్టి ఆడటం చాలా ముఖ్యమ‌ని అన్నాడు. మ్యాచ్ అవసరాలు బోర్డుపై స్పష్టంగా కనిపిస్తాయ‌ని, ఇది పనిని సులభం చేస్తుంద‌ని, టోర్నమెంట్ ప్రారంభ దశలోనే ఉంద‌ని, త‌మ‌ తప్పిదాల నుంచి నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో మరింత బలంగా తిరిగి వస్తామ‌ని పేర్కొన్నాడు.

చివ‌రి ఓవ‌ర్‌లో తుషార్ దేశ్‌పాండే అద్భుత బౌలింగ్‌..

కాగా ఈ మ్యాచ్ చివరి ఓవర్లో గుజరాత్‌కు 11 పరుగులు అవసరమయ్యాయి. అయితే రాజ‌స్థాన్ బౌల‌ర్‌ తుషార్ దేశ్‌పాండే క‌చ్చితమైన యార్కర్లతో బ్యాటర్లను కట్టడి చేశాడు. త‌మ‌ చర్చ చాలా స్పష్టంగా జరిగింద‌ని, ఒక్క బౌండరీ కొడితే సరిపోతుందని భావించామ‌ని, ఆ ఓవర్లో ఎక్కువ బౌండరీలు అవసరం లేదని అనుకున్నామని, కానీ తుషార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడ‌ని, అతను వేసిన యార్కర్లు చాలా ప్రభావవంతంగా ఉన్నాయ‌ని తెలిపాడు. అయితే అతను ఒక బంతిని లైన్ మిస్ చేసినప్పుడు దాన్ని తాను సిక్స్‌గా మలచాల్సింద‌ని రషీద్ అన్నాడు. కాగా గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు కెప్టెన్ గిల్ గాయం కార‌ణంగా త‌ప్పుకోగా ఇప్పుడు అత‌ను త‌దుప‌రి మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉండ‌డం సందేహంగా మారింది. ఇది జ‌ట్టుపై ప్ర‌భావం చూపించింది. మ‌రి గుజ‌రాత్ త‌రువాతి మ్యాచ్‌లలో ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుందో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement