త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | అహ్మదాబాద్‌లో భారత్‌ నయా చరిత్ర.. టీ20 ప్రపంచకప్‌ విజేతగా సూర్యకుమార్‌ సేన..!

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. పొట్టి కప్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ అందుకొని రికార్డును సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి టైటిల్‌ను సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. టీమిండియా విధించిన 256 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది.

P

Sports | Published On Mar 8, 2026, 10.53 pm IST

T20 World Cup | అహ్మదాబాద్‌లో భారత్‌ నయా చరిత్ర.. టీ20 ప్రపంచకప్‌ విజేతగా సూర్యకుమార్‌ సేన..!
Advertisement
  • న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం
  • కీలక మ్యాచ్‌లో రాణించిన బౌలర్లు
  • 159 పరుగులకే కివీ‌స్‌ ఆలౌట్‌
  • అహ్మదాబాద్‌లో రికార్డు సృష్టించిన టీమిండియా
  • వరుసగా రెండోసారి పొట్టి కప్‌ గెలిచిన జట్టుగా ఘనత

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. పొట్టి కప్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ అందుకొని రికార్డును సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి టైటిల్‌ను సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. టీమిండియా విధించిన 256 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. విధ్వంసకర ఓపెనర్‌ అలెన్‌ ఫిల్‌ (9)ను అక్షర్‌ పటేల్‌ త్వరగానే పెవిలియన్‌కు పంపాడు. దాంతో టీమిండియాకు భారీ ఊరట దక్కినట్లయ్యింది. ఆ తర్వాత రచిన్‌ రవీంద్ర (1), గ్లెన్‌ ఫిలిప్‌ (5), మార్క్‌ చాప్‌మన్‌ (3) తక్కువ స్కోర్‌కే అవుట్‌ అయ్యారు. డారిల్‌ మిచెల్‌ (17) పర్వాలేదనిపించాడు. ఓపెనర్‌ టిమ్‌ స్టిఫెర్ట్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివరలో కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ (43) వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే రన్‌రేట్‌ భారీగా పెరిగింది.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు జస్‌ప్రీత్‌ బుమ్రా ఎంపిక కాగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు సంజు శాంసన్‌కు దక్కింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌, భారత జట్టు ఆటగాళ్లకు మెడల్స్ అందించారు. అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌కు ఐసీసీ చైర్మన్‌ జై షా ట్రోఫీని బహుకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

కీలక మ్యాచ్‌లో రాణించిన బౌలర్లు

ఫైనల్‌లో టీమిండియా బౌలర్లు రాణించారు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వెంటవెంట వికెట్లు తీస్తూ వచ్చారు. టీమిండియా బౌలర్ల ధాటికి న్యూజిలాండ్‌ బౌలర్లలో ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా (15/4), అక్షర్‌ పటేల్‌ (27/3) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. వీరిద్దరి ధాటికి కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. అక్షర్‌ పటేల్‌ కివీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ అలెన్‌ ఫిల్‌ని త్వరగా పెవిలియన్‌కు పంపి టీమిండియాకు భారీ ఊరట కలిగించాడు. అలాగే, గ్లెన్‌ ఫిలిప్‌, డారిల్‌ మిచెల్‌ను అవుట్‌ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. బుమ్రా రచిన్‌ రవింద్ర, మిచెల్‌ శాంట్నర్‌, జేమ్స్‌ నీషమ్‌, మ్యాట్‌ హెన్రిని అవుట్‌ చేశాడు.

వరుసగా రెండోసారి.. సరికొత్త చరిత్ర

టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌ కప్‌ నెగ్గింది. 2024లో యూఎస్‌-వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ నాయకత్వంలో టీమిండియా విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్‌ కప్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని భారత జట్టును రెండోసారి టైటిల్‌ను సాధించింది. గతంలో ఎన్నడూ వరుసగా రెండు సార్లు గెలిచిన రికార్డు లేదు. వరుసగా రెండు టైటిల్స్‌ సాధించిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు గెలిచిన దాఖలలు లేవు. ఐసీసీ టోర్నీని గెలిచి భారత్‌ మరో రికార్డును నెలకొల్పింది. ఇదిలా ఉండగా.. వరుసగా ఐసీసీ టైటిల్స్‌ సాధించిన జట్టుగా ఘనత సాధించింది. భారత్ 2024 టీ20 వరల్డ్‌కప్‌, 2025 చాంపియన్స్ ట్రోఫీని గెలువగా.. తాజాగా టీ20 వరల్డ్‌కప్-2026ని సైతం నెగ్గి వరుసగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. మహేంద్ర సింగ్‌ ధోనీ, రోహిత్‌ శర్మ తర్వాత భారత జట్టుకు టీ20ల్లో ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌గా సూర్యకుమార్‌ ఘనత సాధించాడు.

మెరుపు బ్యాటింగ్‌..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని అందించారు. అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌ ఇద్దరు కివీస్‌ బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడి చేశారు. అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి వేగంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పవర్‌ప్లేలో ఈ ఇద్దరూ వరుస బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు వేగంగా పెరిగింది. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆకట్టుకున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌లో వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలు చేయడం విశేషం. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. అభిషేక్ ఔటయ్యాక వచ్చిన ఇషాన్‌ కిషన్‌ సైతం దూకుడుగా ఆడాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేయడంతో భారత్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. అయితే, 15, 16 ఓవర్ల మధ్యలో న్యూజిలాండ్ బౌలర్ జేమ్స్‌ నీషమ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. క్రీజులో కుదురుకున్న శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ను అవుట్‌ చేయడంతో పాటు సూర్యకుమార్‌ డకౌట్‌ చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. చివరలో శుభమ్‌ దూబే స్కోర్‌ బోర్డును పరుగులెత్తించాడు. కేవలం 8 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతను 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తిలక్‌ వర్మ తోడుగా నిలువడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. చివరి ఓవర్లో దూబే చేసిన దూకుడు భారత్ శిబిరంలో జోష్ నింపింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్‌ హెన్రీ, రచిన్‌ రవీంద్రకు చెరో వికెట్‌ దక్కింది.

Advertisement
Advertisement