త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs AFG | అఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్

IND Vs AFG | చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అఫ్ఘనిస్థాన్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ విజృంభించగా, ఛేదనలో యశస్వి జైస్వాల్ సెంచరీతో మెరిశాడు.

P

Sports | Published On Jun 20, 2026, 8.38 pm IST

IND Vs AFG | అఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్
Advertisement

IND Vs AFG | చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అఫ్ఘనిస్థాన్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ విజృంభించగా, ఛేదనలో యశస్వి జైస్వాల్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ కూడా అర్ధశతకంతో రాణించడంతో భారత్ లక్ష్యాన్ని అలవోకగా చేరుకుంది. వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్‌గా ఇది తొలి సిరీస్ విజయం కావడం విశేషం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కచ్చితమైన లైన్, లెంగ్త్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా వంటి కీలక ఆటగాళ్లను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేర్చి ఆఫ్ఘన్ జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించిన ప్రసిద్ధ్, 8.2 ఓవర్లలో 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఒకవైపు వికెట్లు కూలుతున్నా, అఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాత్రం ధైర్యంగా పోరాడాడు.

ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నంలో అతడు 131 బంతుల్లో 102 పరుగులు చేసి శతకం నమోదు చేశాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (50) అర్ధశతకంతో సహకరించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయ‌గ‌లిగింది. అయితే, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో అఫ్ఘనిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ శుభారంభం అందించారు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ ఆఫ్ఘన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. బౌండరీల వర్షం కురిపిస్తూ తొలి వికెట్‌కు 170 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. రోహిత్ 69 బంతుల్లో 79 పరుగులు చేసి ఔటైనప్పటికీ అప్పటికే భారత్ విజయం దాదాపు ఖరారైంది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముగింపుకు తీసుకెళ్లాడు. అద్భుత టైమింగ్‌తో ఆకట్టుకున్న అతడు 86 బంతుల్లో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి ప్రేక్షకులను అలరించాడు. ఫలితంగా భారత్ 28.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Advertisement
Advertisement