త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC ODI World Cup | వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్‌లో భారీ మార్పులు.. సూపర్ సిరీస్, సూపర్-7కి ఐసీసీ శ్రీకారం

ICC ODI World Cup | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2027 పురుషుల వన్డే ప్రపంచకప్‌ ఫార్మాట్‌లో కీలక మార్పులు చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి కొత్తగా సూప‌ర్ సిరీస్‌, సూప‌ర్ 7 రౌండ్స్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది.

P

Sports | Published On Jul 15, 2026, 7.45 pm IST

ICC ODI World Cup | వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్‌లో భారీ మార్పులు.. సూపర్ సిరీస్, సూపర్-7కి ఐసీసీ శ్రీకారం
Advertisement

ICC ODI World Cup | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2027 పురుషుల వన్డే ప్రపంచకప్‌ ఫార్మాట్‌లో కీలక మార్పులు చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి కొత్తగా సూప‌ర్ సిరీస్‌, సూప‌ర్ 7 రౌండ్స్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది. మొత్తం టోర్నీలో 14 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి. లీగ్ మ్యాచుల‌కు మ‌రింత ప్రాధాన్యం తీసుకురావ‌డం, టోర్నీని ఉత్కంఠ భ‌రితంగా మార్చ‌డ‌మే దీని ఉద్దేశ‌మ‌ని ఐసీసీ తెలిపింది.

2023 ప్రపంచకప్‌ ఫార్మాట్ ఎలా ఉందంటే?

భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌లో కేవలం 10 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఆ టోర్నీ ఫార్మాట్ చాలా సులభంగా ఉండేది. మొత్తం 10 జట్లు ఒకదానితో ఒకటి ఒక్కో మ్యాచ్ ఆడాయి. ప్రతి జట్టు లీగ్ దశలో 9 మ్యాచ్‌లు ఆడింది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు చేరాయి. అనంతరం ఫైనల్ జరిగింది. అంటే లీగ్ దశ తర్వాత నేరుగా నాకౌట్ దశ ఉండేది. మధ్యలో మరో రౌండ్ ఉండేది కాదు.

2027 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఎలా ఉంటుంది?

2027 ప్రపంచకప్‌లో 14 జట్లు పాల్గొంటాయి. అన్ని జట్లు నేరుగా గ్రూప్ దశలోకి వెళ్లవు. తొలి ద‌శ‌లో సూప‌ర్ సిరీస్ ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చివరి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ముందుగా ‘సూపర్ సిరీస్’ ఆడతాయి. అంటే 12 నుంచి 14వ ర్యాంకుల్లో ఉన్న మూడు జట్లు ఈ దశలో తలపడతాయి. మూడు జట్లు పరస్పరం ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఇందులో విజేతగా నిలిచిన ఒక్క జట్టు మాత్రమే త‌ర్వాత రౌండ్‌కు చేరుతుంది. మిగతా జ‌ట్ల‌న్నీ టోర్నీ నుంచి త‌ప్పుకుంటాయి. దీంతో పేరుకు 14 జట్లు ఉన్నా.. అసలు పోటీ 12 జ‌ట్ల మ‌ధ్యే ఉంటుంది.

గ్రూప్ స్టేజ్‌.. సూప‌ర్ 7..

సూపర్ సిరీస్ తర్వాత మిగిలిన 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఆరేసి జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జిస్తారు. ప్ర‌తి జ‌ట్టు అదే గ్రూప్‌లో మిగ‌తా ఐదు జ‌ట్ల‌తో ఐదు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.
ప్రతి జట్టు తన గ్రూప్‌లోని మిగతా ఐదు జట్లతో ఆడుతుంది. ఆ త‌ర్వాత సూప‌ర్-7 స్టేజ్‌లో అతిపెద్ద మార్పు ఇదే. రెండు గ్రూపుల నుంచి టాప్‌-3 పొజిష‌న్‌లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్-7కి అర్హ‌త సాధిస్తాయి. రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జ‌ట్ల‌లో మెరుగైన ర్యాంక్ ఉన్న జ‌ట్లు సైతం సూప‌ర్‌-7కి చేరుతుంది. దాంతో ఈ గ్రూప్‌లోకి 7 జ‌ట్లు ప్ర‌వేశిస్తాయి. సూప‌ర్‌-7లో జట్లు ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుతాయి.

సెమీ ఫైన‌ల్‌.. ఫైన‌ల్‌..

సూపర్-7లో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. సెమీఫైనల్ విజేతలు ఫైనల్‌లో తలపడతాయి. 2027 ప్రపంచకప్‌లో 14 జట్లను ఆడించాలని ఐసీసీ 2021లోనే నిర్ణయించింది. ప్ర‌ణాళిక ప్ర‌కారం.. 14 జట్లను రెండు గ్రూపులుగా విభ‌జించాల్సి ఉంటుంది. ఒక్కో గ్రూపులో ఏడు జట్లు ఉండాలి. ఆ త‌ర్వాత సూపర్-6 దశ నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్ జ‌ర‌గాలి. కానీ, కొత్త ఫార్మాట్‌లో తొలుత సూప‌ర్ సిరీస్‌ను తీసుకువ‌చ్చింది. ఆ తర్వాత 12 జట్లతో ప్రధాన గ్రూప్ దశ ఉంటుంది. మొత్తం 30 మ్యాచ్‌లు ఈ దశలో జరుగుతాయి. ప్రారంభ మ్యాచ్‌లకు ప్రాధాన్యత పెంచడానికే ఈ మార్పులు చేసినట్లు ఐసీసీ పేర్కొంది.

కొత్త విధానంతో..

బలహీన జట్లు ముందుగానే తమ సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రతి గ్రూప్ మ్యాచ్ కీలకంగా మారుతుంది. సూపర్-7 చేరేందుకు పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది. చివరి వరకు ఎక్కువ జట్లకు సెమీఫైనల్ అవకాశాలుంటాయి. ప్రారంభ దశలో కొన్ని మ్యాచుల ఫ‌లితం ముందే తేలిపోతుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఐసీసీ మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది. “టోర్నీలో ప్రతి దశకు మరింత ప్రాధాన్యత ఉండేలా కొత్త ఫార్మాట్‌ను రూపొందించాం. తొలి రెండు దశల్లో జరిగే ప్రతి మ్యాచ్ ప్రభావవంతంగా ఉంటుంది. సూపర్-7 దశలో ఏడు జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో ఆడి సెమీఫైనల్స్ కోసం పోటీ పడతాయి” అని ఐసీసీ తెలిపింది.

వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌లో మార్పులు..

2011 ప్రపంచకప్‌: 16 జట్లు (రెండు గ్రూపులు, తర్వాత సెమీఫైనల్స్)
2015 ప్రపంచకప్‌: 14 జట్లు (రెండు గ్రూపులు, తర్వాత నాకౌట్)
2019, 2023 ప్రపంచకప్‌లు: 10 జట్లు (రౌండ్ రాబిన్, తర్వాత సెమీఫైనల్స్)
2027 ప్రపంచకప్‌: 14 జట్లు (సూపర్ సిరీస్, సూపర్-7తో కొత్త విధానం)

టోర్నీ పూర్తి షెడ్యూల్, తుది ఫార్మాట్‌పై సెప్టెంబర్‌లో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఐసీసీ తెలిపింది.

ఆతిథ్య దేశాలకు మ్యాచుల కేటాయింపు..

నమీబియా: 3 మ్యాచులు నిర్వహించే అవకాశం
జింబాబ్వే: 8 నుంచి 10 మ్యాచులు
దక్షిణాఫ్రికా : మిగిలిన 41 మ్యాచులు

జట్ల ఎంపిక ఎలా ఉంటుంది?

14 జట్ల ఎంపిక విధానాన్ని ఐసీసీ ఇంకా పూర్తిగా ప్రకటించలేదు. అంచ‌నాల ప్ర‌కారం.. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత పొందే అవకాశం ఉంది. మిగతా కొన్ని జట్లు వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపిక అయ్యే అవ‌కాశాలున్నాయి. మరికొన్ని జట్లు గ్లోబల్ క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధిస్తాయి. క్రికెట్ ప్రపంచకప్ లీగ్-2 ద్వారా కూడా కొన్ని జట్లకు అవకాశం ఉంటుంది.

లాభ న‌ష్టాలు..

బలమైన జట్లకు మరింత మ‌రిన్ని మ్యాచులు ఆడే అవ‌కాశం ఉంటుంది. టోర్నీ చివరి వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. సూపర్-7 కారణంగా సెమీఫైనల్ రేసు చివరి దశ వరకు కొనసాగుతుంది. ఇక న‌ష్టాల విష‌యానికి వ‌స్తే.. ర్యాంకింగ్స్‌లో చివరి మూడు జట్లలో ఉన్న రెండు జట్లు కీల‌క రౌండ్‌కు చేరకుండానే నిష్క్రమిస్తాయి. కొన్ని జట్లకు ప్రపంచకప్‌లో తక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. కొత్త ఫార్మాట్‌ను అభిమానులు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచకప్ ఫార్మాట్‌లోనూ మార్పులు

టీ20 ప్రపంచకప్‌లో కూడా ఐసీసీ కొత్త మార్పులు చేసింది. 2028 టీ20 ప్రపంచకప్‌ నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. గతంలో గ్రూప్ స్టేజ్ తర్వాత ‘సూపర్-8’ ఉండేది. ఇకపై దాని స్థానంలో ‘సూపర్-10’ దశ ఉంటుంది. దీంతో అసోసియేట్ దేశాలకు త‌ర్వాతి రౌండ్‌కు చేరే అవ‌కాశాలు పెరుగుతాయి. తొలి రౌండ్ గ్రూప్‌లలో మార్పులు చేశారు. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించేవారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉండేవి. కొత్త విధానంలో 20 జ‌ట్ల‌ను ఐదు గ్రూపులుగా విభ‌జిస్తారు. 20 జట్లను ఐదు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ప్ర‌తి గ్రూప్‌లో టాప్-2 జట్లు సూపర్-10కు చేరతాయి. దీంతో మొత్తం 10 జట్లు రెండో దశకు అర్హత సాధిస్తాయి.

సూపర్-10 ఫార్మాట్ ఎలా ఉంటుంది?

10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. గతంలో సూపర్-8లో టాప్-2 జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు చేరేవి. కొత్త విధానం ప్ర‌కారం.. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు వెళ్తాయి. రెండో, మూడో స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లు గ్రూప్-ఏ రెండో స్థానం జట్టు.. గ్రూప్-బీ మూడో స్థానం జట్టుతో ఆడుతుంది. గ్రూప్-బీ రెండో స్థానంలో నిలిచిన జ‌ట్టుతో గ్రూప్-ఏ మూడో స్థానంలో నిలిచిన జ‌ట్టు త‌ల‌ప‌డుతుంది. ఈ రెండు మ్యాచుల విజేతలు మిగిలిన రెండు సెమీఫైనల్ స్థానాలను భర్తీ చేస్తాయి. ఆ త‌ర్వాత నాలుగు జ‌ట్లు సెమీస్ ఆడుతాయి. విజేతలు ఫైనల్‌లో తలపడతాయి.

2028 టీ20 ప్రపంచకప్ అర్హ‌త పోటీల్లో మార్పులు

2028 టీ20 ప్రపంచకప్ అర్హత విధానంలో ఐసీసీ మార్పులు చేసింది. స్కాట్లాండ్‌కు నేరుగా అవ‌కాశం క‌ల్పిస్తారు. యూరోపియన్ రీజినల్ ఫైనల్స్‌కు స్కాట్లాండ్ నేరుగా అర్హత పొందుతుంది. మిగతా జట్లకు గ్లోబల్ క్వాలిఫయర్స్ మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. 2026 ప్రపంచకప్‌లో ఆడినప్పటికీ నేరుగా అర్హత పొందని జట్లు గ్లోబల్ క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంటుంది. గ్లోబల్ క్వాలిఫయర్స్‌లో స్థానాలు విష‌యానికి వ‌స్తే.. మిగిలిన ఎనిమిది స్థానాలు ప్రాంతీయ క్వాలిఫయర్స్ ద్వారా భర్తీ అవుతాయి. ఆఫ్రికా, ఆసియా, యూర‌ప్ నుంచి రెండేసి జ‌ట్లు, అమెరికా నుంచి ఒక జ‌ట్టు, ఈస్ట్ ఆసియా-ప‌సిఫిక్ ప్రాంతం నుంచి జ‌ట్ల‌ను భ‌ర్తీ చేస్తారు.

2028 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు ఎలా?

12 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. 8 జట్లు క్వాలిఫయర్స్ టోర్నీకి అర్హ‌త సాధిస్తాయి. మొత్తంగా 20 జట్లు టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటాయి. ప్రస్తుతం ఐసీసీ ఈ మార్పులకు ఆమోదం తెలిపింది. అయితే, నవంబర్‌లో జరిగే ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ తుది సమీక్ష తర్వాతే అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement