త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI Services | మ‌న యూపీఐ హ‌వా..! ఎనిమిది దేశాల్లో సేవ‌లు.. పార్ల‌మెంట్‌కు తెలిపిన కేంద్రం

UPI Services | భారత్ రూపొందించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) దేశ సరిహద్దులు దాటి విస్త‌రిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్‌ను ప్రపంచ స్థాయిలో ముందంజలో నిలిపేలా యూపీఐ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

P

Sports | Published On Feb 6, 2026, 7.13 pm IST

UPI Services | మ‌న యూపీఐ హ‌వా..! ఎనిమిది దేశాల్లో సేవ‌లు.. పార్ల‌మెంట్‌కు తెలిపిన కేంద్రం
Advertisement

UPI Services | భారత్ రూపొందించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) దేశ సరిహద్దులు దాటి విస్త‌రిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్‌ను ప్రపంచ స్థాయిలో ముందంజలో నిలిపేలా యూపీఐ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, ఖతార్ వంటి దేశాల్లో యూపీఐ ఆధారిత లావాదేవీలు అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఈ వివరాలను వెల్లడించారు.

అంతర్జాతీయంగా యూపీఐకి పెరుగుతున్న ఆదరణ కార‌ణంగా విదేశీ కరెన్సీ లావాదేవీలు సులభమవుతున్నాయని, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో మరింత మంది భాగస్వాములుగా మారేందుకు అవకాశం ఏర్పడుతోందని ఆయన తెలిపారు. ఫిన్‌టెక్ రంగంలో భారత్ స్థానం గణనీయంగా బలపడుతోందని ఆయన పేర్కొన్నారు. యూపీఐతో పాటు భారత్ అభివృద్ధి చేసిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI), ఇండియా స్టాక్‌ని ఇతర దేశాలతో పంచుకునే దిశగా ఇప్పటికే 23 దేశాలతో అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు మంత్రి వివరించారు. డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థలు, ఆన్‌లైన్ చెల్లింపులు, సురక్షిత డేటా మార్పిడి వంటి అంశాల్లో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా డిజిలాకర్ సేవల అమలుకు క్యూబా, కెన్యా, యూఏఈ, లావోస్ దేశాలతో ప్రత్యేక ఒప్పందాలు కుదిరాయ‌న్నారు. భారత్ జీ20 అధ్యక్షత సమయంలో ‘గ్లోబల్ డీపీఐ రిపాజిటరీ’ని ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ వేదికకు అత్యధిక సంఖ్యలో డిజిటల్ సొల్యూషన్లు అందించిన దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. ఇది ప్రపంచ స్థాయిలో డిజిటల్ పాలనలో భారత్ నాయకత్వాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు. అంతర్జాతీయంగా మాత్రమే కాకుండా దేశీయంగానూ యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నెలలో మాత్రమే రూ.28.33 లక్షల కోట్ల విలువైన సుమారు 21.70 బిలియన్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. ఇది డిజిటల్ చెల్లింపులపై ప్రజల నమ్మకం ఎంత పెరిగిందో సూచిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement