త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WPL 2026 | మా విజ‌యానికి అదే కార‌ణం.. అస‌లు విష‌యం చెప్పిన స్మృతి మంధానా..

WPL 2026 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధానా, తమ జట్టు 3 సంవత్సరాల్లో 2 సార్లు డబ్ల్యూపీఎల్ గెలుచుకోవడాన్ని అద్భుతమైన విజయంగా అభివర్ణించింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్ లో లారెన్ బెల్, జార్జియా వోల్ కీలక పాత్ర పోషించారని ఆమె స్పష్టం చేసింది.

S

Sports | Published On Feb 6, 2026, 7.48 am IST

WPL 2026 | మా విజ‌యానికి అదే కార‌ణం.. అస‌లు విష‌యం చెప్పిన స్మృతి మంధానా..
Advertisement

WPL 2026 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధానా, తమ జట్టు 3 సంవత్సరాల్లో 2 సార్లు డబ్ల్యూపీఎల్ గెలుచుకోవడాన్ని అద్భుతమైన విజయంగా అభివర్ణించింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్ లో లారెన్ బెల్, జార్జియా వోల్ కీలక పాత్ర పోషించారని ఆమె స్పష్టం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు జట్టు, 2 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహిళల టీ20 ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్యం. ఇతర బౌలర్లు అందరూ ఓవర్‌కు 9 పరుగులకుపైగా ఇచ్చినప్పటికీ, లారెన్ బెల్ మాత్రం 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకంగా నిలిచింది. ఈ స్పెల్ లేకపోతే లక్ష్యం మరింత భారీగా ఉండేదని మంధానా స్ప‌ష్టం చేసింది.

లారెన్ బెల్ స్పెల్ కీల‌కం..

ట్రోఫీ స్వీకరించే ముందు మాట్లాడిన మంధానా.. ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ అని మాకు తెలుసు. అయినా ఫైనల్‌లో 200కు పైగా స్కోరు సాధించడం గొప్ప విషయం. చివరి 4 ఓవర్లలో మేం బౌలింగ్‌ను బాగా కట్టడి చేశాం. ముఖ్యంగా లారెన్ బెల్ వేసిన స్పెల్ మ్యాచ్‌ను మలుపుతిప్పింద‌ని స్ప‌ష్టం చేసింది. చేజింగ్‌లో గ్రేస్ హారిస్ త్వరగా ఔటైన తర్వాత, మంధానా - జార్జియా వోల్ జోడీ కేవలం 92 బంతుల్లోనే 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో మిగిలిన లక్ష్యం సులభమైంది. వోల్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడగా, మంధానా ఆపై వేగం పెంచి కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించింది. ఆమె 41 బంతుల్లో 87 పరుగులతో జట్టును విజయంలోకి నడిపించింది.

ప్ర‌తి ప్లేయ‌ర్‌కి త‌మ పాత్ర ఏమిటో ముందే చెప్పాం..

ఫైనల్‌లో వోల్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతుందనే నమ్మకం నాకు ముందే ఉంది. ఆమె గత కొన్ని రోజులు అదనంగా సాధన చేసింది. ఆ కష్టానికి ఫలితం దక్కింది.. అని మంధానా ప్రశంసించింది. ఈ సీజన్‌లో స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ లేకపోయినా, జట్టు సపోర్ట్ స్టాఫ్ అందరికీ స్పష్టమైన పాత్రలు కేటాయించడమే విజయానికి కారణమని మంధానా పేర్కొంది. ప్రతి ప్లేయ‌ర్‌కి తమ పాత్ర ఏమిటో ముందే చెప్పారు. అలా ఉంటే కెప్టెన్‌గా నా పని చాలా సులభమవుతుంద‌ని తెలిపింది. మరోవైపు, వరుసగా మూడోసారి ఫైనల్‌లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్, తన జట్టు పోరాట పటిమపై గర్వం వ్యక్తం చేసింది. 204 పరుగులు ఫైనల్‌లో గొప్ప స్కోరు. మా అమ్మాయిలు అందరూ పోరాడారు. కొంచెం తేడాతో కప్ చేజారింది కానీ, జట్టుగా మేం చూపిన ఆత్మవిశ్వాసమే నాకు సంతృప్తి.. అని ఆమె పేర్కొంది. ఈ విజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి డబ్ల్యూపీఎల్ చరిత్రలో నూత‌న అధ్యాయాన్ని లిఖించింది.

Advertisement
Advertisement