World Cup Tourneys | వరల్డ్ కప్ టోర్నీలను గతంలో ఏయే దేశాలు బహిష్కరించాయి..? అప్పుడు ఐసీసీ ఏం చేసింది..?
World Cup Tourneys | త్వరలో జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్లో భారత్లో ఆడే విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మధ్య చర్చలు కొనసాగిన విషయం తెలిసిందే. భద్రతా పరిస్థితులపై బంగ్లాదేశ్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలే దీనికి కారణం. కాగా ఇది క్రికెట్ చరిత్రలో తొలిసారి కాదు.
World Cup Tourneys | త్వరలో జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్లో భారత్లో ఆడే విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మధ్య చర్చలు కొనసాగిన విషయం తెలిసిందే. భద్రతా పరిస్థితులపై బంగ్లాదేశ్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలే దీనికి కారణం. కాగా ఇది క్రికెట్ చరిత్రలో తొలిసారి కాదు. గతంలో కూడా భద్రత, రాజకీయ కారణాలతో పలు జట్లు ఐసీసీ టోర్నీలకు లేదా ఆతిథ్య దేశాలకు వెళ్లేందుకు నిరాకరించాయి. 1996 వన్డే ప్రపంచకప్కు భారత్, పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఆ సమయంలో శ్రీలంకలో పౌరయుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. టోర్నీ ప్రారంభానికి కేవలం రెండు వారాల ముందు, 1996 జనవరిలో కొలంబోలో జరిగిన బాంబు పేలుడు భద్రతా ఆందోళనలను మరింత పెంచింది.
1996లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్..
శ్రీలంకకు మద్దతుగా భారత్-పాకిస్థాన్ సంయుక్త జట్టు కొలంబోలో ఓ స్నేహపూర్వక మ్యాచ్ కూడా ఆడింది. అయితే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు మాత్రం తమ గ్రూప్ మ్యాచ్ల కోసం కొలంబో వెళ్లేందుకు నిరాకరించాయి. దీంతో ఆ మ్యాచ్లను ఫోర్ఫీట్గా పరిగణించి శ్రీలంకకు పాయింట్లు ఇచ్చారు. అయినప్పటికీ శ్రీలంక క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించడమే కాకుండా, ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి చరిత్రాత్మకంగా ప్రపంచకప్ను గెలుచుకుంది.
2003లో ఇంగ్లండ్, న్యూజిలాండ్..

2003 ప్రపంచకప్ ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్త ఆతిథ్యంలో నిర్వహించారు. ఈ టోర్నీలో రెండు జట్లు ఆతిథ్య దేశాలకు వెళ్లేందుకు నిరాకరించాయి. జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రభుత్వం (అప్పుడు ప్రధాని టోనీ బ్లేర్) కఠిన నిర్ణయం తీసుకోవడంతో, హరారేలో జరిగే మ్యాచ్కు ఇంగ్లండ్ వెళ్లలేదు. మరోవైపు కెన్యాలోని నైరోబీకి వెళ్లేందుకు న్యూజిలాండ్ నిరాకరించింది. మోంబాసాలో కొన్ని నెలల ముందు జరిగిన బాంబు పేలుడే ఇందుకు కారణం. రెండు జట్లు తమ మ్యాచ్లను వేరే దేశాలకు మార్చాలని కోరినా ఐసీసీ అంగీకరించలేదు. ఫలితంగా జింబాబ్వే, కెన్యాలకు వాక్ ఓవర్ ద్వారా పాయింట్లు లభించాయి. ఇంగ్లండ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా, న్యూజిలాండ్ సూపర్ సిక్స్ దశకు చేరింది. కెన్యా అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సెమీ ఫైనల్స్కు చేరడం విశేషం.
2009లో జింబాబ్వే, 2015-16 లో ఆసీస్..
2009 టీ20 ప్రపంచకప్కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే జింబాబ్వే ఆటగాళ్లకు బ్రిటన్ వీసాలు లభించవన్న అనుమానాలు నెలకొన్నాయి. జింబాబ్వే-బ్రిటన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు అప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2008 జూలైలో ఐసీసీ, జింబాబ్వే బోర్డు మధ్య ఒప్పందం కుదిరింది. క్రికెట్ ప్రయోజనాల కోసమే టోర్నీ నుంచి తప్పుకుంటున్నామని జింబాబ్వే ప్రకటించింది. తాము ఆహ్వానం లేని పార్టీకి వచ్చిన అతిథులుగా మారకూడదనుకుంటున్నాం.. అంటూ వ్యాఖ్యానించింది. అయితే పూర్తి భాగస్వామ్య ఫీజు మాత్రం జింబాబ్వేకు చెల్లించారు. వారి స్థానంలో క్వాలిఫయర్స్ ద్వారా స్కాట్లాండ్ జట్టును ఎంపిక చేశారు. అలాగే 2015 అక్టోబర్లో భద్రతా కారణాలతో బంగ్లాదేశ్లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ను ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. ఆ తర్వాత 2016 అండర్-19 ప్రపంచకప్ బంగ్లాదేశ్లో నిర్వహించాల్సి ఉండగా, అదే వైఖరిని కొనసాగిస్తూ బంగ్లాదేశ్లో ఆస్ట్రేలియన్ ప్రయోజనాలకు ముప్పు ఉంది అంటూ టోర్నీకి వెళ్లలేమని ప్రకటించింది. ఐసీసీ ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని చెప్పినా నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియా స్థానంలో ఐర్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నారు.
2025లో భారత్..

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. దీన్ని 29 ఏళ్ల తర్వాత పాకిస్థాన్లో జరిగిన తొలి ఐసీసీ టోర్నీగా చెప్పారు. అయితే 2008 తర్వాత భారత్ పాకిస్థాన్లో ఆడకపోవడంతో భారత జట్టు వెళ్తుందా? అన్న ప్రశ్న మొదటి నుంచే నెలకొంది. పాకిస్థాన్ 2023 వన్డే ప్రపంచకప్ కోసం భారత్కు వచ్చినప్పటికీ, 2025లో భారత్ ప్రతిగా వెళ్లే విషయంలో స్పష్టత రాలేదు. చివరకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి లేదని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఐసీసీ, రెండు బోర్డుల మధ్య దీర్ఘకాల చర్చల అనంతరం ఒక ఒప్పందానికి వచ్చారు. 2024-2027 కాలంలో భారత్ లేదా పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ టోర్నీల్లో, ప్రత్యర్థి దేశానికి సంబంధించిన మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని నిర్ణయించారు. దీని ప్రకారం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్లు దుబాయ్లో జరిగాయి. చివరకు భారత్ ఆ టోర్నీని గెలుచుకోవడం విశేషం.
కఠినంగానే ఐసీసీ వైఖరి..
అయితే ఆయా సమయాల్లో ఐసీసీ ఏ దేశానికి కూడా అనుకూలంగా వ్యవహరించలేదు. ఆ పరిస్థితుల్లో నిర్దేశించిన నియమాల ప్రకారమే ఐసీసీ వ్యవహరించింది. టోర్నీల ప్రారంభానికి ముందే కొన్ని సార్లు షెడ్యూల్ను మార్చింది. కానీ కొన్ని సందర్భాల్లో అది కుదరలేదు. దీంతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లే ఆయా సందర్భాల్లో మ్యాచ్లను ఆడకుండా ఫోర్ఫీట్ అయ్యాయి. ఈ క్రమంలో వారు ఓటమి చెందినట్లు భావించి ప్రత్యర్థి జట్లకు పాయింట్లను ఇచ్చారు. కానీ ఏ సందర్భంలో కూడా ఒక జట్టుకు ఉద్దేశపూర్వకంగా మేలు చేసే విధానాన్ని ఐసీసీ పాటించలేదు. అలాగే ఎప్పుడూ నిబంధనల ప్రకారమే వ్యవహరించింది. ఆయా ఇంగ్లిష్ దేశాల క్రికెట్ బోర్డుల పట్ల కూడా కఠిన వైఖరినే ప్రదర్శించింది. కనుక బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) ఆరోపించినట్లు ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలను పాటించలేదని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఐసీసీ కూడా బీసీబీ పట్ల కఠినంగానే ఉండబోతుందని స్పష్టమవుతోంది. అయితే ఆయా సందర్భాలను చూస్తే భద్రత లేదా రాజకీయ కారణాలతో దేశాలు క్రికెట్ టోర్నీలను బహిష్కరించడం కొత్తేమీ కాదని అర్థమవుతోంది. కానీ బంగ్లాదేశ్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తుందని ఐసీసీ భావిస్తే మాత్రం ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఇంకాస్త అధికంగానే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






