త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్‌.. యూఎస్‌ఏ జట్టుకు బెస్టాఫ్ ల‌క్ చెప్పిన‌ ట్రంప్..

T20 World Cup 2026 | భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్‌ఏ క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభం కాగా మార్చి 8న ఫైనల్‌తో ముగియనుంది.

S

Sports | Published On Feb 9, 2026, 7.45 am IST

T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్‌.. యూఎస్‌ఏ జట్టుకు బెస్టాఫ్ ల‌క్ చెప్పిన‌ ట్రంప్..
Advertisement

T20 World Cup 2026 | భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్‌ఏ క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభం కాగా మార్చి 8న ఫైనల్‌తో ముగియనుంది. భారత్, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్‌తో కలిసి యూఎస్‌ఏను గ్రూప్-ఎ లో చేర్చారు. ఈ సందర్భంగా ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో స్పందిస్తూ.. భారత్‌లో క్రికెట్ వరల్డ్‌కప్ ప్రారంభమైందని ఇప్పుడే తెలిసింది. టీమ్ యూఎస్‌ఏకు శుభాకాంక్షలు. మనకు చాలా బలమైన జట్టు ఉంది. అమెరికా మొత్తం మీకు స‌పోర్ట్ గా ఉంది.. అని పోస్టు చేశారు.

కాగా యూఎస్‌ఏ తమ టీ20 వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న ముంబై వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ భారత్‌ను గట్టిగా పరీక్షించింది. అయినప్పటికీ చివరికి ఆతిథ్య జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. పవర్‌ప్లేలో యూఎస్‌ఏ బౌలర్లు చెలరేగి భారత్‌ను 46/4కి కుదించారు. అభిషేక్ శ‌ర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా అలీ ఖాన్ అతన్ని ఔట్ చేశాడు. పవర్‌ప్లే చివరి ఓవర్‌లో షాడ్లీ వాన్ షాల్క్‌విక్ 3 వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచాడు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ బాధ్యత తీసుకున్నాడు. 49 బంతుల్లో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సూర్యకుమార్, 10 ఫోర్లు, 4 సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 161/9 పరుగులు చేసింది. ఇది సూర్యకుమార్ కెరీర్‌లో నాలుగో అర్ధసెంచరీగా నిలిచింది. యూఎస్‌ఏ తరఫున వాన్ షాల్క్‌విక్ 4/25తో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. అనంత‌రం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్‌ఏను భారత్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన యూఎస్‌ఏ 132/8 పరుగులకే పరిమితమైంది. భారత బౌలింగ్‌లో మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ 3/29తో ఆక‌ట్టుకున్నాడు. ఈ విజయంతో భారత్ వరల్డ్‌కప్‌ను గెలుపుతో ఆరంభించగా, యూఎస్‌ఏ మాత్రం పోరాటం చేసి ఓడినా తమ ప్రతిభతో క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement