త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | బీసీసీఐ కఠిన నిర్ణయం.. ఆట‌గాళ్ల‌ను కుటుంబాల‌తో క‌లిసి ఉండేందుకు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌..

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026 సందర్భంగా భారత ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిసి ఉండేందుకు అనుమతి ఇవ్వబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని బోర్డు తేల్చి చెప్పింది.

S

Sports | Published On Feb 10, 2026, 12.21 pm IST

T20 World Cup 2026 | బీసీసీఐ కఠిన నిర్ణయం.. ఆట‌గాళ్ల‌ను కుటుంబాల‌తో క‌లిసి ఉండేందుకు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌..
Advertisement

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026 సందర్భంగా భారత ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిసి ఉండేందుకు అనుమతి ఇవ్వబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని బోర్డు తేల్చి చెప్పింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం, 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సాగే విదేశీ పర్యటనల్లో మాత్రమే ఆటగాళ్లు గరిష్టంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించవచ్చు. అయితే, భారత్ ఆతిథ్య దేశంగా ఉన్న టీ20 వరల్డ్ కప్‌లో ఈ సౌకర్యం వర్తించదని బోర్డు స్పష్టం చేసింది.

బోర్డు ఎలాంటి ఏర్పాట్లు చేయ‌దు..

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఆటగాళ్ల భార్యలు లేదా కుటుంబ స‌భ్యులు జట్టుతో పాటు ప్రయాణించి, అదే హోటల్‌లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ టీమ్ మేనేజ్‌మెంట్ బీసీసీఐని సంప్రదించింది. అయితే, కుటుంబ సభ్యులు ఆటగాళ్లతో కలిసి ఉండేందుకు అవకాశం లేదని బోర్డు తేల్చి చెప్పింది. అవసరమైతే ఆటగాళ్లు తమ కుటుంబాల కోసం స్వయంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చని సూచించింది. భారత్ ఆతిథ్య దేశం కావడంతో బోర్డు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయదు. శ్రీలంకకు కేవ‌లం ఒక పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకే భార‌త్ వెళ్తోంది. క‌నుక ఆ మ్యాచ్‌కు కూడా బోర్డు ఏర్పాట్ల‌ను చేయాల్సిన అవ‌స‌రం లేదు.. అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

తాజా ఫ‌లితాల నేప‌థ్యంలోనే..?

ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ సమయంలో కూడా ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి ఇవ్వలేదు. ఇదే విధానం వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. వరల్డ్ కప్ సమయంలో కొంతమంది ఆటగాళ్లు తమ ఆహార అవసరాల కోసం వ్యక్తిగత చెఫ్‌లను సమీప హోటళ్లలో ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి భోజనం అందించుకునేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. భారత్ ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను 3-1తో కోల్పోయిన తర్వాత ఈ విధానం అమలులోకి వచ్చినట్టు తెలుస్తోంది. కోవిడ్‌ కాలం నుంచి పూర్తి పర్యటనలతోపాటు కుటుంబాలు ఆటగాళ్లతో ఉండడం సాధారణంగా మారింది. అయితే, తాజా ఫలితాల నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిబంధనలను మ‌రింత‌ కఠినతరం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇక టీ20 వరల్డ్ కప్‌లో భారత్ యూఎస్‌ఏపై గెలుపుతో తన‌ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో, ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్థాన్‌తో, ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది.

Advertisement
Advertisement