త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mohammad Kaif | పాండ్యా ఆడి ఉంటే 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేవాళ్లం: మహ్మద్ కైఫ్

Mohammad Kaif | ఆస్ట్రేలియా క్రికెట్‌పై ఒకప్పుడు మైటీ అనే ముద్ర ఉండేదని, అయితే ఇప్పుడు ఆ స్థాయి ప్రదర్శనలకు వారు దూరమయ్యారని మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా ఆడుంటే భారత్‌ కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించేదని ఆయన స్పష్టం చేశారు.

S

Sports | Published On Feb 18, 2026, 8.08 am IST

Mohammad Kaif | పాండ్యా ఆడి ఉంటే 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేవాళ్లం: మహ్మద్ కైఫ్
Advertisement

Mohammad Kaif | ఆస్ట్రేలియా క్రికెట్‌పై ఒకప్పుడు మైటీ అనే ముద్ర ఉండేదని, అయితే ఇప్పుడు ఆ స్థాయి ప్రదర్శనలకు వారు దూరమయ్యారని మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా ఆడుంటే భారత్‌ కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించేదని ఆయన స్పష్టం చేశారు. టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే నిష్క్రమించిన నేపథ్యంలో కైఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 వరల్డ్‌కప్ ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా ఆడలేకపోవడం భారత్‌కు పెద్ద లోటుగా మారిందని కైఫ్ అభిప్రాయపడ్డారు. వరుసగా తొమ్మిది విజయాలతో ఫైనల్‌కు చేరిన భారత్‌, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తుదిపోరులో మాత్రం 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ట్రావిస్ హెడ్ చేసిన 137 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించింది. అయితే ఆ మ్యాచ్‌లో హార్దిక్ ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని కైఫ్ అన్నారు.

అస్థిరంగా ఆసీస్ ఫామ్‌..

సోషల్ మీడియాలో స్పందించిన కైఫ్.. 2023 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియాను మైటీ ఆసీస్ అని పిలిచారు. కానీ ఆ తర్వాత వారి ప్రదర్శన గణనీయంగా పడిపోయింది. 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో వారు ఆ స్థాయిని చూపలేకపోయారు. అహ్మదాబాద్ ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా ఆడుంటే ఆస్ట్రేలియా అప్పుడే ఓడిపోయి ఉండేద‌ని అన్నారు. ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా ఫామ్ అస్థిరంగా కొనసాగుతోంది. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆఫ్గ‌నిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి పాలై సెమీఫైనల్‌కు చేరలేకపోయారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో సెమీఫైనల్‌లోనే నిష్క్రమించారు. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరినా, లార్డ్స్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడి దశాబ్ద కాలంగా కొనసాగిన ఐసీసీ టోర్నీల విజ‌య‌ పరంపరకు తెరదించారు.

2009 త‌రువాత మ‌ళ్లీ ఇప్పుడే..

టీ20 వరల్డ్‌కప్ 2026లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2021 ఛాంపియన్లైన ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే బయటకు వెళ్లింది. ఐర్లాండ్‌పై ఒక్క విజయం మాత్రమే సాధించగా, జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోవడం, శ్రీలంక చేతిలో ఎనిమిది వికెట్లతో పరాజయం పాలవడం వారి పతనాన్ని స్పష్టంగా చూపించింది. ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ వర్షంతో రద్దవడంతో ఆస్ట్రేలియా సూపర్-8కు అర్హత కోల్పోయింది. ఇది 2009 తర్వాత వారికి ఎదురైన అత్యంత వేగవంత‌మైన‌ వరల్డ్‌కప్ నిష్క్రమణగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో కైఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియా, ఇప్పుడు అదే స్థాయిలో నిలబడేందుకు తీవ్రంగా కష్టపడుతోందని విశ్లేష‌కులు, మాజీలు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement