త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 Mini Auction | వాళ్లు ఒక్క అంత‌ర్జాతీయ మ్యాచ్ కూడా ఆడ‌లేదు.. కానీ ఐపీఎల్ వేలంలో కోట్లు ధ‌ర ప‌లికారు..

S

Sports | Published On Dec 16, 2025, 8.11 pm IST

IPL 2026 Mini Auction | వాళ్లు ఒక్క అంత‌ర్జాతీయ మ్యాచ్ కూడా ఆడ‌లేదు.. కానీ ఐపీఎల్ వేలంలో కోట్లు ధ‌ర ప‌లికారు..
Advertisement

IPL 2026 Mini Auction | దుబాయ్ వేదిక‌గా బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 మినీ వేలంలో ఇద్ద‌రు భార‌త యువ దేశీయ ఆట‌గాళ్లు రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికారు. యువ క్రికెట‌ర్లు ప్ర‌శాంత్ వీర్‌, కార్మీక్ శ‌ర్మ‌ల‌ను ఒక్కొక్క‌రికి ఏకంగా రూ.14.2 కోట్ల చొప్పున మొత్తం రూ.28.4 కోట్ల‌ను చెల్లించి మ‌రీ చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) సొంతం చేసుకుంది. అస‌లు ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం దేశీయ టోర్నీల్లోనే ఆడారు. అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఆడ‌లేదు. అయిన‌ప్ప‌టికీ సీఎస్‌కే ఈ ఇద్ద‌రికీ భారీ ధ‌ర వెచ్చించ‌డం విశేషం. సీనియర్ ప్లేయ‌ర్ల‌కు క్ర‌మంగా ఉద్వాస‌న చెబుతున్న చెన్నై ఒక వ్యూహం ప్ర‌కార‌మే యువ ఆట‌గాళ్ల‌ను తీసుకుంటుంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఐపీఎల్ 2026 మినీ వేలంలో యువ క్రికెట‌ర్లు ప్ర‌శాంత్ వీర్‌, కార్తీక్ శ‌ర్మ‌ల‌కు చెన్నై భారీ ఎత్తున వెచ్చించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అయితే ఆ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఆడ‌లేదు కానీ దేశీయ మ్యాచ్‌ల‌లో స‌త్తా చాటుతున్నారు. అందుక‌నే చెన్నై వారిని కొనుగోలు చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ వేలంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కూడా ఈ ప్లేయ‌ర్ల‌ను ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డింది. కానీ చెన్నై డీల్‌ను ముగించింది. ఇక ప్ర‌శాంత్ వీర్ విష‌యానికి వ‌స్తే ఇత‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప్లేయ‌ర్‌. వ‌య‌స్సు 20 ఏళ్లు. ఆల్ రౌండ‌ర్ ప్లేయ‌ర్‌గా స‌త్తా చాటుతున్నాడు. లెప్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ వేయ‌గ‌ల‌డు. అలాగే బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌రలించ‌డంలోనూ దిట్ట‌. ఈ క్ర‌మంలోనే చెన్నై నుంచి వెళ్లిపోయిన ర‌వీంద్ర జ‌డేజా స్థానాన్ని భ‌ర్తీ చేయాల‌ని ఆ జ‌ట్టు ఇత‌న్ని తీసుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది.

ప్ర‌శాంత్ వీర్ ర‌వీంద్ర జ‌డేజాలాగే బౌలింగ్ చేయ‌డంతోపాటు అత‌ని లాగే లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చి సిక్సుల‌ను బాద‌గ‌ల‌డు. అందుక‌నే ఇత‌న్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. తాజాగా జ‌రుగుతున్న దేశ‌వాళీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్‌లో ఒక మ్యాచ్‌లో ఇత‌ను 10 బంతుల్లో 37 ప‌రుగులు సాధించ‌డ‌మే కాక‌, 3 వికెట్లు తీశాడు. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇత‌నిపై క‌న్నేశాయి. చివ‌ర‌కు చెన్నై ఇత‌న్ని ఎగ‌రేసుకుపోయింది.

ఇక మ‌రో ప్లేయ‌ర్ కార్తీక్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే ఇత‌ను వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్‌. హార్డ్ హిట్టింగ్ చేయ‌డంలో దిట్ట‌. 2006లో రాజ‌స్థాన్‌లోని మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించాడు. త‌రువాత అకాడ‌మిల‌లో శిక్ష‌ణ పొందాడు. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్ అండ‌ర్ 14 జ‌ట్టుకు ఆడాడు. అలాగే అండ‌ర్ 16 మ్యాచ్‌ల‌లోనూ రాణించాడు. 19 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న కార్తీక్ దేశ‌వాళీ టీ20ల‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 12 టీ20లు ఆడిన ఇత‌ని స్ట్రైక్ రేట్ 164 గా ఉంది. మొత్తం 334 ప‌రుగులు చేశాడు. 2024-25 సీజ‌న్‌లో రంజీ ట్రోఫీ ఆడిన ఇత‌ను అందులోనూ స‌త్తా చాటాడు. లిస్ట్ ఎ కెరీర్‌లో 9 మ్యాచ్‌ల‌లో 445 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలోనే కార్తీక్ శ‌ర్మ ఆట తీరు న‌చ్చి అత‌న్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిని చూపించాయి. అయితే ప్ర‌శాంత్ వీర్‌, కార్తీక్ శ‌ర్మ ఇద్ద‌రి బేస్ ప్రైస్ రూ.30 ల‌క్ష‌లు కాగా వీరిద్ద‌రినీ ఒకే ధ‌ర‌కు ఒకే ఫ్రాంచైజీ కొనుగోలు చేయ‌డం విశేషం. మ‌రి సీఎస్‌కే జ‌ట్టుకు వీళ్లు వ‌చ్చే ఐపీఎల్‌లో ఎలా ఆడుతారో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement