త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | సైబ‌ర్ మోసాల‌కు అడ్డాగా ఐపీఎల్ 2026.. టిక్కెట్ల‌ పేరుతో బ్యాంకు ఖాతాలు ఖాళీ..

IPL 2026 | దేశంలో కోట్లాది మంది అభిమానులకు ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు. అర్ధరాత్రి వరకు కొనసాగే గ్రూప్ చాట్స్, చివరి నిమిషంలో జెర్సీలు కొనడం, మ్యాచ్‌ల కోసం ఆఫీస్ సెలవులు ప్లాన్ చేసుకోవడం, కొన్ని సెకన్లలోనే అమ్ముడైపోయే టికెట్ల కోసం హడావుడి.. ఇవన్నీ ఐపీఎల్ ఫీవర్‌లో భాగం. అయితే ఇదే అభిమానుల ఉత్సాహాన్ని ఇప్పుడు సైబర్ నేరగాళ్లు భారీ స్థాయిలో దోపిడీకి వాడుకుంటున్నారు.

S

Technology | Published On May 14, 2026, 10.52 am IST

IPL 2026 | సైబ‌ర్ మోసాల‌కు అడ్డాగా ఐపీఎల్ 2026.. టిక్కెట్ల‌ పేరుతో బ్యాంకు ఖాతాలు ఖాళీ..
Advertisement

IPL 2026 | దేశంలో కోట్లాది మంది అభిమానులకు ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు. అర్ధరాత్రి వరకు కొనసాగే గ్రూప్ చాట్స్, చివరి నిమిషంలో జెర్సీలు కొనడం, మ్యాచ్‌ల కోసం ఆఫీస్ సెలవులు ప్లాన్ చేసుకోవడం, కొన్ని సెకన్లలోనే అమ్ముడైపోయే టికెట్ల కోసం హడావుడి.. ఇవన్నీ ఐపీఎల్ ఫీవర్‌లో భాగం. అయితే ఇదే అభిమానుల ఉత్సాహాన్ని ఇప్పుడు సైబర్ నేరగాళ్లు భారీ స్థాయిలో దోపిడీకి వాడుకుంటున్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెక్‌ (CloudSEK) విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిమానులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాల నెట్‌వర్క్ పనిచేస్తున్న‌ట్లు తేలింది. నకిలీ టికెట్ వెబ్‌సైట్లు, ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ పేరుతో మాల్వేర్ పంపిణీ చేసే ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా అమాయకులను మోసం చేసే స్కామ్‌లు భారీగా పెరిగినట్లు వెల్లడైంది.

600కు పైగా న‌కిలీ డొమైన్‌లు, 400కు పైగా ఫేక్ స్ట్రీమింగ్ సైట్లు..

హిట్ వికెట్‌: ది ఎక్స్‌పాన్సివ్ వెబ్ ఆఫ్ స్కామ్స్ టార్గెటింగ్ మిలియ‌న్స్ ఆఫ్ ఐపీఎల్ ఫ్యాన్స్ దిస్ సీజ‌న్ పేరుతో విడుదలైన ఈ నివేదికలో 600కిపైగా నకిలీ ఐపీఎల్ టికెట్ డొమైన్‌లు, 400కుపైగా ఫేక్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు గుర్తించినట్లు క్లౌడ్‌సెక్ తెలిపింది. వీటిలో అనేక సైట్లు పాస్‌వర్డ్‌ల‌ను దొంగిలించడం, క్రిప్టో వాలెట్లు ఖాళీ చేయడం, బాధితుల డివైస్‌లపై రిమోట్ యాక్సెస్ పొందడం వంటి ప్రమాదకర మాల్వేర్‌ను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మోసాల వెనుక ఉన్న ప్రధాన ఆయుధం అభిమానుల భావోద్వేగాలేనని పరిశోధకులు చెబుతున్నారు. సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌కు టికెట్ దొరకాలనే ఆత్రం, కొన్ని నిమిషాల్లో టికెట్లు అమ్ముడైపోతాయనే భయం, వేలాది ఫాలోవర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ పేజీలు గ్యారంటీ టికెట్ అంటూ చేసే ప్రచారం.. ఇవన్నీ అభిమానులను వలలో పడేస్తున్నాయి. చాలా సందర్భాల్లో అభిమానులు మోసపోయిన విషయం స్టేడియం గేట్ దగ్గరకు వెళ్లాకే బయటపడుతోంది. టికెట్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ కావడం లేదు. బుకింగ్ ఐడీ నకిలీదిగా తేలుతోంది. మ్యాచ్ జరుగుతుంటే బాధితులు బయటే నిలబడిపోతున్నారు.

ఒరిజిన‌ల్‌ను పోలి ఉంటున్న న‌కిలీ సైట్లు..

క్లౌడ్‌సెక్ ప్రకారం ఈ ఫేక్ టికెట్ వెబ్‌సైట్లు అసలు బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లైన బుక్ మై షో, డిస్ట్రిక్ట్ డిజైన్, కలర్ స్కీమ్స్, బ్రాండింగ్‌ను కాపీ చేస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. లిమిటెడ్ సీట్స్ లెఫ్ట్, హర్రీ అప్, డిస్కౌంట్ ప్రైస్ వంటి బ్యానర్లు చూపిస్తూ అత్యవసర పరిస్థితి సృష్టిస్తాయి. అనంతరం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ పోస్టులు, మెటా యాడ్స్, టెలిగ్రామ్ ఛానల్స్, గూగుల్ సెర్చ్ ఫలితాల ద్వారా వీటిని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత ప్రక్రియ మొత్తం అసలైనదిలానే కనిపిస్తుంది. అభిమానులు సీట్లు ఎంపిక చేసుకుని తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తారు. అనంతరం యూపీఐ, క్యూ ఆర్ కోడ్‌లు, కార్డులు లేదా పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లింపులు చేస్తారు. కొద్ది నిమిషాల్లోనే సీటు నంబర్, క్యూ ఆర్ కోడ్‌తో కూడిన ప్రొఫెషనల్ పీడీఎఫ్ టికెట్ కూడా వస్తుంది.

ప్ర‌మాదంలో ప్రేక్ష‌కుల డేటా..

కానీ ఈ స్కామ్‌లు సాధారణ ఫిషింగ్ మోసాల కంటే చాలా ప్రొఫెషనల్‌గా నడుస్తున్నాయని క్లౌడ్‌సెక్ తెలిపింది. ఒక నకిలీ టికెటింగ్ వెబ్‌సైట్ అడ్మిన్ ప్యానల్‌ను పరిశోధకులు యాక్సెస్ చేసినప్పుడు, రియల్ టైమ్‌లో బుకింగ్‌లు నిర్వహించడం, మాన్యువల్‌గా పేమెంట్ వెరిఫికేషన్ చేయడం, డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలు మార్చడం, ఫేక్ టికెట్లు జెనరేట్ చేయడం వంటి పూర్తి ఆపరేషన్ డ్యాష్‌బోర్డ్ కనిపించినట్లు వెల్లడించారు. ఇంకా బాధితుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లను కూడా ఈ సైట్లు సేకరిస్తున్నాయని, భవిష్యత్ మోసాలకు లేదా డేటా అమ్మకాల కోసం వీటిని వాడే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని స్కామ్ వెబ్‌సైట్లలో మెటా పిక్సెల్ ఇంటిగ్రేషన్ ను కూడా గుర్తించినట్లు క్లౌడ్‌సెక్ పేర్కొంది. దీని ద్వారా యాడ్ పనితీరు ట్రాక్ చేసి, మోసపు క్యాంపెయిన్‌లను ఈ-కామర్స్ సంస్థల మాదిరిగానే ఆప్టిమైజ్ చేస్తున్నారని తెలిపింది.

న‌కిలీ స్ట్రీమింగ్ సైట్లతో డేంజ‌ర్‌..

ఇక ఫ్రీ ఐపీఎల్ లైవ్ స్ట్రీమ్ పేరుతో జరుగుతున్న మోసాలు మరింత ప్రమాదకరంగా మారాయి. అధికారిక స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్ ఖరీదైందని భావించి ఉచిత లైవ్ స్ట్రీమ్ కోసం వెతికే అభిమానులను లక్ష్యంగా చేసుకుని వందలాది నకిలీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు రూపొందిస్తున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. వాచ్ ఐపీఎల్ ఆన్‌లైన్ ఫ్రీ, ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమ్ వంటి సెర్చ్ పదాలతో ఈ సైట్లు గూగుల్‌లో కనిపించేలా ఆప్టిమైజ్ చేస్తున్నారు. రెడిట్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అభిమానులు మ్యాచ్ చూడాలని క్లిక్ చేస్తే, వారికి స్ట్రీమింగ్ కాకుండా మాల్వేర్ దాడి ఎదురవుతోంది. పాప్‌అప్స్, ఫేక్ డౌన్‌లోడ్ బటన్లు, రీడైరెక్ట్ లింకుల ద్వారా బాధితులను మోసం చేస్తున్నారు. మ్యాక్‌ఓఎస్ వినియోగదారులను ఫేక్ సెక్యూరిటీ అప్‌డేట్ లేదా గిట్‌హబ్ ఇన్‌స్టాలర్ పేజీలకు పంపించి, టెర్మినల్‌లో ప్రమాదకర కమాండ్లు పేస్ట్ చేయించే ప్రయత్నాలు కూడా గుర్తించినట్లు క్లౌడ్‌సెక్ తెలిపింది. ఒకసారి మాల్వేర్ ఇన్‌స్టాల్ అయితే బ్రౌజర్ పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలు, టెలిగ్రామ్ సెషన్లు, క్రిప్టో వాలెట్లు, ఐక్లౌడ్ సమాచారం, డివైస్‌ల‌లోని ఫైళ్ల వరకు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

మాక్ డివైస్‌లే టార్గెట్‌గా..

పరిశోధకులు ఎస్ హ‌బ్ స్టీల‌ర్ అనే మాల్వేర్‌ను కూడా గుర్తించారు. ఇది పూర్తి స్థాయి మ్యాక్‌ఓఎస్ ఇన్ఫోస్టీలర్‌గా పనిచేస్తూ బ్రౌజర్ డేటా, క్రిప్టో వాలెట్లు, ఆపిల్ నోట్స్, ఐక్లౌడ్ సమాచారం, డెస్క్‌టాప్ ఫైళ్లను టార్గెట్ చేస్తుందని తెలిపారు. ఒకసారి సిస్టమ్‌లోకి ప్రవేశించిన తర్వాత బాధితుడి డివైస్‌పై నిరంతర రిమోట్ యాక్సెస్‌ను కూడా హ్యాకర్లకు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఐపీఎల్ ఎందుకు సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారిందనే అంశంపై కూడా క్లౌడ్‌సెక్ వివరణ ఇచ్చింది. కోట్లాది ఆన్‌లైన్ ప్రేక్షకులు, భారీ స్థాయి డిజిటల్ ట్రాన్సాక్షన్లు, కొద్ది వారాల్లో జరిగే అధిక డిమాండ్ ఇవన్నీ సైబర్ మోసాలకు అనుకూల పరిస్థితులు సృష్టిస్తున్నాయని తెలిపింది. ప్రత్యేకంగా హై-వోల్టేజ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్ సమయంలో అభిమానులు త్వరగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉండటంతో స్కామ్‌లు కూడా ఆ సమయంలో పెరుగుతున్నాయని పేర్కొంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే నకిలీ డొమైన్‌లు, సోషల్ మీడియా పేజీలు, టెలిగ్రామ్ ఛానల్స్ సిద్ధం చేసి, సీజన్ మొత్తం వాటిని యాక్టివ్‌గా నడుపుతున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. అభిమానులు తప్పనిసరిగా అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాలని క్లౌడ్‌సెక్ సూచించింది. సోషల్ మీడియా యాడ్స్, టెలిగ్రామ్ లింకులు, డైరెక్ట్ మెసేజ్‌ల ద్వారా వచ్చే టికెట్ ఆఫర్లను నమ్మొద్దని హెచ్చరించింది.

భారీ డిస్కౌంట్ల‌కు ఆశ ప‌డొద్దు..

అలాగే భారీ డిస్కౌంట్లు, టిక్కెట్లు అమ్ముడైన మ్యాచ్‌లకు గ్యారంటీ టికెట్లు, అనుమానాస్పద డొమైన్ పేర్లు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అనధికారిక స్ట్రీమింగ్ సైట్లను పూర్తిగా దూరంగా ఉంచాలని, ఇవి ఇప్పుడు పైరసీ ప్లాట్‌ఫామ్‌ల కంటే ఎక్కువ‌గా మాల్వేర్ పంపిణీ కేంద్రాలుగా మారుతున్నాయని స్పష్టం చేసింది. ఈమెయిల్, బ్యాంకింగ్, యూపీఐ ఖాతాలకు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేయాలని, డివైస్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలని, అవసరం లేని యాప్ పర్మిషన్‌లు ఇవ్వొద్దని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఐపీఎల్ స్కామ్.. ఒక్క క్లిక్ లేదా మ్యాచ్ చూడాలనే ఒక్క ఆత్రం.. టికెట్ డబ్బుకంటే చాలా ఎక్కువ నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement