త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND W Vs AUS W | వ‌న్డే సిరీస్ ఆస్ట్రేలియాదే..! మ‌రో మ్యాచ్ ఉండ‌గానే 2-0 తేడాతో కైవ‌సం

IND W Vs AUS W | భార‌త జ‌ట్టు మ‌హిళ‌ల వ‌న్డే సిరీస్‌ను కోల్పోయింది. మూడు మ్యాచుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో కైవ‌సం చేసుకున్న‌ది. హోబ‌ర్డ్‌లో శుక్ర‌వారం జ‌రిగిన రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా వుమెన్స్ జ‌ట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్‌లో చివ‌రి మ్యాచ్ ఆదివారం ఇదే మైదానంలో జ‌రుగ‌నున్న‌ది.

P

Sports | Published On Feb 27, 2026, 5.18 pm IST

IND W Vs AUS W | వ‌న్డే సిరీస్ ఆస్ట్రేలియాదే..! మ‌రో మ్యాచ్ ఉండ‌గానే 2-0 తేడాతో కైవ‌సం
Advertisement
  • సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన జార్జియా వాల్‌

IND W Vs AUS W | భార‌త జ‌ట్టు మ‌హిళ‌ల వ‌న్డే సిరీస్‌ను కోల్పోయింది. మూడు మ్యాచుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో కైవ‌సం చేసుకున్న‌ది. హోబ‌ర్డ్‌లో శుక్ర‌వారం జ‌రిగిన రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా వుమెన్స్ జ‌ట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్‌లో చివ‌రి మ్యాచ్ ఆదివారం ఇదే మైదానంలో జ‌రుగ‌నున్న‌ది.

తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 251 ప‌రుగులు చేసిన టీమిండియా

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ తొమ్మిది వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. టీమ్ ఇండియాకు శుభారంభం ల‌భించింది. ప్రతికా రావల్, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. మంధాన 37 బంతుల్లో నాలుగు ఫోర్లతో 31 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ కేవలం 11 పరుగులకే అవుట్ అయ్యింది. దీప్తి శ‌ర్మ (1) ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌తీకా రావ‌ల్ (52) హాఫ్ సెంచ‌రీ చేసింది. టీమిండియా 103 ప‌రుగుల‌కే కీల‌క నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లోప‌డింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిదిద్దింది. మిగ‌తా బ్యాట‌ర్ల‌తో క‌లిసి 252 ప‌రుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ముందుంచ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 70 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్స‌ర్ స‌హాయంతో 54 ప‌రుగులు చేసింది. మన్‌జోత్ కౌర్ (13), రిచా ఘోష్ (22), కశ్వి గౌతమ్ 25, క్రాంతి గౌర్ (19) ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన వైష్ణ‌వి శ‌ర్మ ఐదు బంతుల్లో 10 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా త‌ర‌ఫున ఆష్లీ గార్డ్నర్, అలానా కింగ్, అన్నాబెల్ స‌ద‌ర్లాండ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. మేగాన్ స్కాట్‌, నికోలా కారీకి చెరో వికెట్ ద‌క్కింది.

36.1 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ఛేదించిన ఆసిస్‌..

భార‌త్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ కేవ‌లం 36.1 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. కెప్టెన్ అలిస్సా హీలీ 6 ర‌న్స్‌కే అవుట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వాల్ రెండో వికెట్ కు 119 పరుగులు జోడించారు. లిచ్‌ఫీల్డ్ 62 బంతుల్లో 80 ప‌రుగులు చేసింది. ఇందులో 11 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉంది. జార్జియా మూడో వికెట్‌కు బెత్ మూనీతో కలిసి 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పింది. జార్జియా సెంచ‌రీతో ఆక‌ట్టుకుంది. 82 బంతుల్లో 101 పరుగులు చేసింది. ఇందులో సిక్స‌ర్‌, 13 ఫోర్లు ఉన్నాయి. బెత్ మూనీ 34 బంతుల్లో 31 పరుగులు, అన్నాబెల్ సదర్లాండ్ 12 బంతుల్లో 10 పరుగులు చేసింది. ఆష్లీ గార్డ్నర్ 14 బంతుల్లో 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి మ్యాచ్‌ని ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. భారత జట్టు తరఫున కశ్వి గౌతమ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టగా, క్రాంతి గౌడ్ ఒక వికెట్ ద‌క్కింది.

ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక టీ20 సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టు వన్డే సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్‌లో ఓట‌మికి కార‌ణాల‌ను కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ వివ‌రించింది. బ్యాటింగ్ పేల‌వంగా ఉండ‌డ‌మే ఓట‌మి కార‌ణ‌మ‌ని.. 300 కంటే ఎక్కువ‌గా ప‌రుగులు చేయాల‌ని భావించినా.. అలా చేయ‌లేక‌పోయామ‌ని తెలిపింది. పిచ్ గ‌తంలో కంటే మెరుగ్గా ఉంద‌ని.. దురదృష్టవశాత్తు గ‌తంలో చేసిన త‌ప్పుల‌ను మ‌ళ్లీ పున‌రావృతం చేశామ‌ని.. వ‌రుస‌గా వికెట్లు కోల్పోతూ వ‌చ్చిన‌ట్లు తెలిపింది. తాము మంచి క్రికెట్ ఆడ‌లేక‌పోయామ‌ని, కానీ కొన్ని సానుకూల అంశాలున్నాయ‌ని చెప్పింది. అమ్మాయిలు రాణిస్తున్నార‌ని.. ప‌ట్టుద‌ల‌తో రాణించాల్సి ఉంద‌ని చెప్పుకొచ్చింది.

Advertisement
Advertisement