త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hydrogen Leak | ఇంధనం నింపే సమయంలో హైడ్రోజన్‌ లీక్‌.. నాసా మూన్‌ మిషన్‌కు బ్రేక్‌..!

Hydrogen Leak | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చాలా సంవత్సరాల తర్వాత మరోసారి మూన్‌ మిషన్‌కు సిద్ధమైంది. ఈ నెల 8న ఆర్టెమిస్‌ మిషన్‌ చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక సమస్య ఎదురైంది.

P

Science | Published On Feb 3, 2026, 9.44 am IST

Hydrogen Leak | ఇంధనం నింపే సమయంలో హైడ్రోజన్‌ లీక్‌.. నాసా మూన్‌ మిషన్‌కు బ్రేక్‌..!
Advertisement

Hydrogen Leak | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చాలా సంవత్సరాల తర్వాత మరోసారి మూన్‌ మిషన్‌కు సిద్ధమైంది. ఈ నెల 8న ఆర్టెమిస్‌ మిషన్‌ చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లో రాకెట్‌కు ఇంధనం నింపే సమయంలో హైడ్రోజన్‌ లీక్‌ అయ్యింది. దీంతో ఇంధనం నింపే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ భారీ రాకెట్‌లో అత్యంత చల్లని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ గ్యాస్‌లను ఇంధనంగా ఉపయోగిస్తారు. మొత్తం 7 లక్షల గ్యాలన్లకు పైగా ఇంధనం నింపాల్సి ఉండగా, ప్రక్రియ ప్రారంభమైన రెండు గంటల్లోనే రాకెట్‌ అడుగు భాగం వద్ద అధికంగా హైడ్రోజన్‌ ఉన్నట్లు సెన్సర్లు గుర్తించాయి. అప్పటికే ప్రధాన భాగంలో సగం ఇంధనం మాత్రమే నింపడం గమనార్హం.

లీక్‌ను నియంత్రించేందుకు నాసా శాస్త్రవేత్తలు వెంటనే చర్యలు చేపట్టారు. మూడు సంవత్సరాల క్రితం స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ తొలి ప్రయోగ సమయంలో ఎదురైన ఇలాంటి సమస్యల నేపథ్యంలో రూపొందించిన పద్ధతులనే ఈసారి కూడా ఉపయోగించారు. అప్పట్లో కూడా పలుమార్లు హైడ్రోజన్‌ లీక్‌ కావడంతో ప్రయోగం ఆలస్యమైంది. ఈ మిషన్‌లో పాల్గొననున్న ముగ్గురు అమెరికన్‌, ఒక కెనడియన్‌ వ్యోమగామి ప్రస్తుతం హ్యూస్టన్‌ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తుది పరీక్ష పూర్తయ్యే వరకు వారు వారం రోజులకుపైగా క్వారంటైన్‌లోనే ఉండనున్నారు. తీవ్ర చలివాతావరణం కారణంగా ఇప్పటికే రెండు రోజుల ఆలస్యం కాగా.. శనివారం రాత్రి నాసా కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. మిషన్‌కు ముందు ప్రతి కీలక దశను పూర్తిగా పరీక్షించాలన్నదే నాసా లక్ష్యం. ప్రతి క్లిష్టమైన దశను రిహార్సల్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

కమాండర్‌ రీడ్‌ వైజ్‌మన్‌ నేతృత్వంలోని బృందానికి సంబంధించిన సమస్యలు వేగంగా పరిష్కారమైతే, ఆదివారం నాటికి మిషన్‌ చేపట్టే అవకాశం ఉంది. లేకపోతే మిషన్‌ను ఫిబ్రవరి 11 తేదీకి, అది సాధ్యం కాకపోతే మార్చికి వాయిదా పడే అవకాశముందని నాసా వర్గాలు తెలిపాయి. 2022లో కూడా హైడ్రోజన్‌ సమస్యల కారణంగా ఈ రాకెట్‌ నెలల తరబడి ప్రయోగానికి నోచుకోలేదు. దీంతో ఈసారి పరీక్షను సకాలంలో పూర్తి చేయాల్సిన ఒత్తిడి నాసాపై పెరిగింది. ఈ మిషన్‌లో దాదాపు 10 రోజుల పాటు సాగే ప్రయాణంలో వ్యోమగాములు చంద్రుడి చుట్టూ తిరిగి భూమికి చేరుకుంటారు. ఈ ప్రయాణంలో వ్యోమనౌకలోని వ్యవస్థలు సహా ఇతర కీలక పరికరాల పనితీరును పరీక్షించనున్నారు. గత 50 ఏళ్లలో ఇదే తొలి మానవులతో కూడిన మూన్‌ మిషన్‌ కావడం విశేషం. అపోలో మిషన్‌ తర్వాత నాసా చేపట్టిన ఆర్టెమిస్‌ ప్రోగ్రామ్‌లో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. భవిష్యత్తులో చంద్రుడిపై మానవ ఆవాసం ఏర్పాటుచేయడమే ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యంగా నాసా ప్రకటించింది.

Advertisement
Advertisement