త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

హిమాలయాల్లో కూరుకుపోయిన అణు పరికరం.. గంగా నదికి పొంచి ఉన్న ముప్పు?

ఆ అణు ఇంధన జనరేటర్‌లో ఉన్న ఫ్లూటోనియం క్యాప్సూల్స్ జాడ ఇప్పటి వరకు దొరకలేదు. ఆ ఫ్లూటోనియం క్యాప్సూల్స్ వేల సంవత్సరాల పాటు రేడియోధార్మికతను వెదజల్లే సామర్థ్యం కలిగి ఉంది.

J

Science | Published On Dec 15, 2025, 7.40 pm IST

హిమాలయాల్లో కూరుకుపోయిన అణు పరికరం.. గంగా నదికి పొంచి ఉన్న ముప్పు?
Advertisement
  • చైనాపై నిఘా కోసం అమెరికా-భారత్ చేసిన రహస్య ఆపరేషన్ విఫలం

ఇప్పటికే పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణ హాని, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ హిమాలయాలకు పెనుముప్పుగా మారాయి. తాజాగా హిమాలయాలకు మరో ముప్పు రానుంది. అణు శక్తి రూపంలో ఈ ముప్పు రాబోతోందని తాజాగా తెలుస్తోంది. 1960 ల్లో అమెరికాకు చెందిన గూఢచారి సంస్థ(సీఐఏ), భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ).. ఈ రెండు కలిసి సంయుక్తంగా హిమాలయాల్లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించాయి. హిమాలయాల్లో ఉన్న నందా దేవి పర్వతంపై అణు శక్తితో నడిచే ఓ పరికరాన్ని అమర్చేందుకు ప్రయత్నం చేశాయి. కానీ.. ఆ ఆపరేషన్ సఫలం కాలేదు. ఇప్పుడు అదే రేడియోధార్మిక ముప్పుగా మారనుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

చైనాపై నిఘా కోసం యూఎస్, భారత్ మధ్య రహస్య ఒప్పందం

1964 లో చైనా తన తొలి అణు పరీక్షను నిర్వహించిన సమయంలో కోల్డ్ వార్ సాగుతోంది. దీంతో యూఎస్ అప్రమత్తమై చైనా క్షిపణి ప్రయోగాలను, అణు పరీక్షలను గుర్తించేందుకు భూమికి అత్యంత ఎత్తులో ఉండే హిమాలయాలపై ఒక సెన్సార్‌ను అమర్చేందుకు ప్రణాళికలు రచించింది. అప్పుడే అమెరికాకు చెందిన గూఢచారి సంస్థ సీఐఏ రంగంలోకి దిగింది. హిమాలయాల్లో ఎక్కువ భాగం భారత్‌లో ఉండటం వల్ల భారత్‌తో ఆ మిషన్ కోసం చేతులు కలిపింది.

నందా దేవి మిషన్

1965 అక్టోబర్‌లో సీఐఏ ఏజెంట్లు, ఇండియాకు చెందిన పర్వతారోహకులతో కూడిన ఓ బృందం హిమాలయాల్లో ఉన్న నందా దేవి పర్వతంపైకి బయలుదేరింది. నందా దేవి పర్వతం పైన ఉన్న ఒక అణు ఇంధన జనరేటర్ ఏర్పాటు చేసి.. దాని సాయంతో ఒక నిఘా పరికరాన్ని అమర్చాలి. ఆ అణు ఇంధన జనరేటర్‌లో రేడియోధార్మిక పదార్థమైన ప్లూటోనియం క్యాప్సూల్స్ అమర్చారు. ఆ అణు ఇంధన జనరేటర్‌ని బృందం తమ వెంట తీసుకెళ్తోంది.

భారీ మంచు తుపాను

బృందం నందా దేవి పర్వతంపైకి వెళ్తుండగా, కొంత దూరంలో శిఖరాగ్రానికి చేరుకుంటారనగా భారీ మంచు తుపాను సంభవించింది. దీంతో ప్రాణభయంతో ఆ బృందంలోని సభ్యులంతా తమ వెంట తీసుకెళ్తున్న అణు ఇంధన జనరేటర్‌ని అక్కడే వదిలేసి వెనక్కి వచ్చేశారు. వాళ్లు సురక్షిత ప్రాంతం అని భావించిన నాలుగో క్యాంపు వద్ద వదిలేసి తిరిగి కిందికి వచ్చారు.

భారీ హిమపాతం కారణంగా కూరుకుపోయిన పరికరం

కొన్ని నెలల తర్వాత మళ్లీ ఆ ప్రాంతానికి బృందం బయలుదేరి వెళ్లింది. 1966 లో ఆ పరికరం వదిలేసిన ప్రాంతానికి వెళ్లగా అక్కడ ఆ జనరేటర్ కనిపించలేదు. ఆ ప్రదేశం మొత్తం భారీ హిమపాతం కారణంగా ఆనవాళ్లు లేకుండా పోయింది. ఆ అణు పరికరం కూడా కొండ చరియల్లో కూరుకుపోయిందని అనుమానించారు.

వేల సంవత్సరాల పాటు రేడియోధార్మికతను వెదజల్లే సామర్థ్యం

ఆ అణు ఇంధన జనరేటర్‌లో ఉన్న ఫ్లూటోనియం క్యాప్సూల్స్ జాడ ఇప్పటి వరకు దొరకలేదు. ఆ ఫ్లూటోనియం క్యాప్సూల్స్ వేల సంవత్సరాల పాటు రేడియోధార్మికతను వెదజల్లే సామర్థ్యం కలిగి ఉంది.

రిషి గంగ, ధౌలి గంగకు ముప్పు

నందాదేవి గ్లేసియర్స్ కరిగి రిషి గంగలో నీళ్లు కలుస్తాయి. అవి ధౌలి గంట, ఆ తర్వాత ఆ నీళ్లు అలకనంద నదిలో కలుస్తాయి. ఇవన్నీ కలిసి గంగా నదిలో కలుస్తాయి. ఒకవేళ క్యాప్సుల్స్ నుంచి వెలువడే రేడియోధార్మికత నీళ్లలో కలిసి గంగా నది వరకు చేరితే గంగా నదికే పెద్ద ముప్పు పొంచి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు జరిపిన పరీక్షల్లో గంగా నది జల్లాలో ప్రమాదకర స్థాయి రేడియో ధార్మికత కనుగొనబడలేదని అధికారులు చెబుతున్నారు.

కానీ, భవిష్యత్తులో గ్లేసియర్స్ కరుగుతున్న కొద్దీ ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే తరాలు మాత్రం ఆ ఫ్లూటోనియం క్యాప్సూల్స్ వల్ల ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశాలు మాత్రం ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement