త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadi Srinivas | 2023లో పాసైన బిల్లును తిరిగి తెస్తే మ‌ద్ద‌తిస్తం: ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్‌

Aadi Srinivas | మ‌హిళా బిల్లుకు డీలిమిటేష‌న్(Delimitation)ను జోడించుకొని వ‌చ్చిన బీజేపీ(BJP)కి త‌గిన గుణ‌పాఠం జ‌రిగింద‌ని ప్ర‌భుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీ‌నివాస్ (Aadi Srinivas) అన్నారు. మ‌హిళా బిల్లును విడిగా తీసుకొని వ‌స్తే పార్ల‌మెంటులో ఆమోదం పొందేద‌న్నారు. బీజేపీ వేసిన త‌ప్ప‌ట‌డుగుల వ‌ల్లే బిల్లు ఆగింద‌ని చెప్పారు.

S

News | Published On Apr 18, 2026, 1.56 pm IST

Aadi Srinivas | 2023లో పాసైన బిల్లును తిరిగి తెస్తే మ‌ద్ద‌తిస్తం: ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హిళా బిల్లుకు డీలిమిటేష‌న్(Delimitation)ను జోడించుకొని వ‌చ్చిన బీజేపీ(BJP)కి త‌గిన గుణ‌పాఠం జ‌రిగింద‌ని ప్ర‌భుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీ‌నివాస్ (Aadi Srinivas) అన్నారు. 2023లో మ‌హిళా బిల్లు(Women's Bill)కు మ‌ద్ద‌తిస్తే పాస్ అయిందని.. అదే బిల్లును య‌ధాత‌థంగా తీసుకొస్తే మ‌ద్ద‌తిస్త‌మ‌ని రాహుల్‌గాంధీ స‌భ‌లో, కేసీ వేణుగోపాల్ స‌భ‌లో, ప్రియాంక గాంధీ స‌భ‌లో ప‌దే ప‌దే చెప్పినా బీజేపీ మొండిగా వ్య‌వ‌హ‌రించిద‌న్నారు. శ‌నివారం ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. మ‌హిళా బిల్లును విడిగా తీసుకొని వ‌స్తే పార్ల‌మెంటులో ఆమోదం పొందేద‌న్నారు. బీజేపీ వేసిన త‌ప్ప‌ట‌డుగుల వ‌ల్లే బిల్లు ఆగింద‌ని చెప్పారు. అస‌లు మ‌హిళ‌ల ప‌ట్ల ఆ పార్టీకి చిత్త‌శుద్ధి లేనే లేదని మండిపడ్డారు.

2026లో జ‌నాభా లెక్క‌లు జ‌రిగిన త‌ర్వాత పున‌ర్విభ‌జ‌నతో పాటు మ‌హిళా బిల్లును పెడ‌తామ‌ని ఒక చ‌ట్టం తెచ్చారు. ఇంత హ‌డావుడిగా బిల్లును తీసుకొచ్చి మీరు ఏం సాధించారో చెప్పండి. కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌, దేశంలో మోదీ, అమిత్‌షాకు మ‌హిళ‌ల 33 శాతం రిజ‌ర్వేష‌న్ తీసుకురావాల‌నే చిత్త‌శుద్ధి ఉంటే 2023లో పాసైన బిల్లును మ‌ళ్లీ లోక్‌స‌భ‌లో పెట్టి ఆమోదింప‌జేయాలి. త‌ర్వాత‌ 2029 ఎన్నిక‌ల్లో మీరు ముందుకు పోయినా స‌రే దానికి కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తిస్తది.

బీజేపీ త‌ప్ప‌ట‌డుగుల వ‌ల్లే బిల్లు ఆగింది...

ఈరోజు నిర‌స‌న చేసే కార్య‌క్ర‌మం ఏదైతే ఉందో అది బీజేపీ త‌మ ఉనికిని కాపాడుకొనే ప్ర‌య‌త్నమే త‌ప్పా మ‌రొక‌టి కాదు. డీలిమిటేష‌న్ తో క‌లుపుకొని మ‌హిళా బిల్లును తెచ్చిన బీజేపీ ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ చెప్పాలి. మీరు వేసిన త‌ప్పట‌డుగుల వ‌ల్ల‌నే ఈ బిల్లు ఆగింది. మ‌హిళా బిల్లును విడిగా పెట్టుంటే ఆమోదం పొందేదే. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న ఫ‌లించిన వేళ ద‌క్షిణాదిలో బీజేపీకి నూక‌లు చెల్లిన‌ట్లే. తేజ‌స్వీ సూర్య చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించిన కిష‌న్‌రెడ్డి, ఎన్ రాంచంద‌ర్‌రావు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది అని ఆది శ్రీ‌నివాస్ డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ గ‌ణ‌న కూడా జ‌ర‌పండి...

2026 జ‌న‌గ‌ణ‌న జ‌రుగుతుంది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జ‌న‌గ‌ణ‌న జ‌ర‌పండి. 2028లో చ‌ట్టం తెచ్చి 2029లో మీరు ఎన్నిక‌ల‌కు పోండి.. మేం దానికేం వ్య‌తిరేకం కాదు. ద‌క్షిణాది, ఈశాన్య రాష్ట్రాల‌కు అన్యాయం చేస్తూ మీరు ముందుకు పోవాల‌ని చూస్తే దాన్ని వ్యతిరేకిస్తం. ప్ర‌జా ప‌క్షాన‌, ప్ర‌జాస్వామ్య పంథాలో ఆ బిల్లును అడ్డుకున్నం త‌ప్పా మేం మ‌హిళా రిజర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకం కాదు. 2026 జ‌నాభా లెక్క‌ల త‌ర్వాత‌నే ముందుకు పోతామ‌న్నా మీరు 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం ఎందుకు పోవాల్సి వ‌స్తుంది? మీర‌నుకున్న‌ట్లే పోతే 2024 ఎన్నిక‌ల్లో 181 మంది మ‌హిళ‌లు చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉండేవాళ్లు క‌దా.. ఎందుకు ఆ ప‌ని చేయ‌లేక‌పోయారు? ఈ విష‌యాల‌న్నింటిని దేశవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్న‌రు.

బీజేపీ నాయ‌కుల‌కు సాంఘిక బ‌హిష్క‌ర‌ణ‌..

ఈ డీలిమిటేష‌న్ ను ఎందుకు క‌లుపుకొని పోయార‌నేదే స‌గ‌టు మ‌హిళా త‌ల్లిలో ఆవేద‌న క‌న‌బ‌డుతోంది. మూడు రోజుల ప్ర‌త్యేక స‌మావేశాలు పెట్టి బీజేపీ నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు. మ‌రో మూడు రోజులు పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు పెట్టి మ‌హిళా బిల్లును విడిగా తీసుకొని రండి. త‌ప్ప‌నిస‌రిగా కాంగ్రెస్ మ‌ద్ద‌తిస్తుంది. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం చేద్దామ‌నుకున్న బీజేపీ నాయ‌కుల‌కు ఈరోజు సాంఘిక బ‌హిష్క‌ర‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. ద‌క్షిణ‌, ఈశాన్య రాష్ట్రాల‌కు ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా ఊరుకోమ‌ని రాహుల్ గాంధీ అన్నార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు అని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement
Advertisement