త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | రాష్ట్రంలో క‌రెంటు స‌మ‌స్య రానివ్వం: డిప్యూటీ సీఎం భ‌ట్టి

Bhatti Vikramarka | రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతున్న వేళ విద్యుత్ స‌మ‌స్య రానివ్వ‌మ‌ని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా (Power distribution) చేస్తామ‌న్నారు.

S

News | Published On Apr 30, 2026, 3.41 pm IST

Bhatti Vikramarka | రాష్ట్రంలో క‌రెంటు స‌మ‌స్య రానివ్వం: డిప్యూటీ సీఎం భ‌ట్టి
Advertisement

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతున్న వేళ విద్యుత్ స‌మ‌స్య రానివ్వ‌మ‌ని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా (Power distribution) చేస్తామ‌న్నారు. గురువారం ఆయ‌న ప్ర‌జాభ‌వ‌న్‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ఇంధ‌న శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

అద‌న‌పు విద్యుత్ కొనండి..

​రాష్ట్రంలో భానుడి ప్ర‌తాపం వ‌ల్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిందని అధికారులు భ‌ట్టికి వివరించారు. దీనికి వ్యవసాయ అవసరాలూ తోడవడంతో గ్రిడ్‌పై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. ఈ సంద‌ర్భంగా భట్టి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యుత్ మార్కెట్‌పై ఒత్తిడి ఉన్నప్పటికీ, రాష్ట్ర అవసరాలకు లోటు రాకుండా పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులు, తాగునీటి సరఫరా పథకాలు, అత్యవసర సేవలకు విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర పర్యవేక్షించాల‌ని సూచించారు.

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు.  జల విద్యుత్ ఉత్పత్తిని సమర్థంగా నిర్వహించాలన్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నంద‌ని, అన్ని విద్యుత్ సంస్థలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

​రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంద‌ని వివ‌రించారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అన్ని వర్గాల వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌కో సీఎండీ హరీశ్‌, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement