త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌, స‌ర్వే విభాగాలు: పొంగులేటి

Ponguleti Srinivas Reddy | రెవెన్యూ (Revenue), స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ (Stamps and Registration), స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్ ఫామ్ మీదకు తీసుకువచ్చి భూభార‌తి (Bhu Bharati) పోర్ట‌ల్ తో అనుసంధానం చేస్తున్నామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రకటించారు.

A

News | Published On Dec 22, 2025, 6.29 pm IST

Ponguleti Srinivas Reddy | ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌, స‌ర్వే విభాగాలు: పొంగులేటి
Advertisement

భూభారతి పోర్టల్ తో అనుసంధానం
ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూస‌మాచారం
ప్ర‌తి స‌ర్వే నెంబ‌ర్‌కు మ్యాప్ రూప‌క‌ల్ప‌న
సీసీఎల్ఏ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలో స్ప‌ష్టం చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
Ponguleti Srinivas Reddy | భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్థ‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా వేగ‌వంతంగా అందించేందుకు రెవెన్యూ (Revenue), స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ (Stamps and Registration), స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్ ఫామ్ మీదకు తీసుకువచ్చి భూభార‌తి (Bhu Bharati) పోర్ట‌ల్ తో అనుసంధానం చేస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. వ‌చ్చే జ‌న‌వ‌రి నెల‌లో ఆధునీక‌రించిన ఈ వ్య‌వ‌స్ధ‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. నాంప‌ల్లిలోని సీసీఎల్ఏ (CCLA) కార్యాలయాన్ని మంత్రి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అనంత‌రం వివిధ విభాగాల అధికారుల‌తో ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ ప‌రిపాల‌న‌కు కేంద్ర‌మైన సీసీఎల్ఏ కార్యాల‌యం నిర్వ‌హ‌ణ తీరు ప‌ట్ల‌ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కార్పొరేట్‌కు ధీటుగా ఆఫీసును ఆధునికీక‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వ‌చ్చే నెల‌లో మ‌రోసారి కార్యాల‌యాన్ని త‌నిఖీ చేస్తాన‌ని, అప్ప‌టివ‌ర‌కు కొంత‌మార్పు క‌నిపించాల‌ని అన్నారు. వ‌రుస‌గా విభాగాల వారీగా స‌మీక్షించ‌డం కూడా జ‌రుగుతుంద‌ని ఇందుకు సంబంధించి అధికారుల పూర్తి స‌మాచారంతో సిద్దంగా ఉండాల‌న్నారు.

ద‌శాబ్దాల క్రితం ప్ర‌భుత్వం వివిధ అవ‌స‌రాల కోసం ప్రైవేటు వ్య‌క్తుల నుంచి భూ సేక‌ర‌ణ జ‌రిపింద‌ని, ఇప్ప‌టికీ కొన్ని భూములు ప్రైవేటు వ్య‌క్తుల పేరు మీదే ఉన్నాయ‌ని ఇవ‌న్నీ కూడా రికార్డుల‌లో మార్చాల‌ని అన్నారు. అలాగే అసైన్డ్, భూధాన్ భూములపై స‌మీక్ష‌తో పాటు కొన్ని సంవ‌త్స‌రాల నుంచి ఉద్యోగుల‌పై విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఏ విభాగంలో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి, కోర్టు కేసుల‌న్నింటిపై పూర్తిస్ధాయి స‌మీక్ష నిర్వ‌హిస్తాన‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గానిర్మించ‌బోయే త‌హ‌శీల్దార్ కార్యాలయాలు ఒకే మోడ‌ల్‌గా ఉండాల‌ని ఇందుకు సంబంధించిన డిజైన్ రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు.

ఒక్క క్లిక్‌తో రైతుకు సంబంధించిన భూముల పూర్తి స‌మాచారం ల‌భించేలా ఉండాల‌ని చెప్పారు. అదేవిధంగా రిజిస్ట్రేష‌న్‌, మ్యుటేష‌న్‌, మార్కెట్ విలువ‌, విలేజ్ మ్యాప్, ప్రతి స‌ర్వే నెంబ‌ర్‌కు మ్యాప్‌, నాలా ఆర్డ‌ర్లు, ఆర్వోఆర్, గ్రామాల న‌క్షా, ఫీడ్ బ్యాక్ వంటి పూర్తి స‌మాచారం ల‌భించేలా స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌తో అనుసంధానం చేస్తూ భూభార‌తి పోర్ట‌ల్‌ను పూర్తి స్ధాయిలో ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. ఆధార్ నెంబ‌ర్‌తో అనుసంధాన‌మైన మొబైల్ నెంబ‌ర్ ద్వారా లాగిన్ అయిన వెంట‌నే కావాల్సిన స‌మాచారం ల‌భిస్తుంద‌న్నారు. క్ర‌య విక్ర‌యదారుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌తి స‌ర్వే నెంబ‌ర్‌కు మ్యాప్ ను రూపొందించే ప్ర‌క్రియను త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు.

రెవెన్యూ వ్య‌వ‌స్ధ ఆధునీక‌రణ చేసే ప్ర‌తిప‌నిలో సామాన్యుని కోణం ఉండాల‌ని ఎలాంటి లోపాల‌కు, తారుమారుకు ఆస్కారం లేకుండా సాఫ్ట్ వేర్‌ను అభివృద్ది ప‌ర‌చాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో రెవెన్యూ కార్య‌ద‌ర్శి డి.ఎస్. లోకేష్ కుమార్‌, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ ఐ.జీ. రాజీవ్ గాంధీ హ‌నుమంతు, సీసీఎల్ఏ ఇన్‌ఛార్జి కార్య‌ద‌ర్శి మంధా మ‌క‌రంద్‌, ఎన్ఐసి ఎస్‌ఐఓ ప్ర‌సాద్‌, విజ‌య్‌మోహ‌న్‌, కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement