త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు: మాజీ మంత్రి హరీష్ రావు

Harish Rao | స‌ర్పంచ్ (Sarpanch) ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు దిమ్మ‌తిరిగే ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (Harish Rao) అన్నారు. ఈ ఫ‌లితాల్లో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి మైండ్ బ్లాక్ అయింద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో త‌న‌ను క‌లిసిన BRS నూత‌న స‌ర్పంచ్‌ల‌ను ఆయ‌న అభినందిస్తూ ప్ర‌సంగించారు.

A

News | Published On Dec 17, 2025, 2.56 pm IST

Harish Rao | స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు: మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement

రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు బంద్... అభివృద్ధి బంద్...
ఓటమి భయంతోనే డబ్బు సంచులు, పోలీసుల ద్వారా కాంగ్రెస్ ప్రలోభాలు
వచ్చేది వన్ నేషన్ వన్ ఎలక్షన్... రెండేళ్ల‌లో మళ్ళీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం
గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండల సర్పంచుల అభినందన కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి

Harish Rao | స‌ర్పంచ్ (Sarpanch) ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు దిమ్మ‌తిరిగే ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (Harish Rao) అన్నారు. ఈ ఫ‌లితాల్లో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి మైండ్ బ్లాక్ అయింద‌ని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం మల్కాపూర్, కోనైపల్లి, నర్సంపల్లి గ్రామాల్లో గెలిచిన సర్పంచులు, అలాగే అచ్చంపేట నియోజకవర్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత మండలం వంగూరులో 10 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ (BRS) సర్పంచులు హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ​ముఖ్యమంత్రి సొంత గడ్డపై కాంగ్రెస్ ప్రలోభాలను తట్టుకొని నిలబడిన వంగూరు సర్పంచులను, అలాగే గజ్వేల్ సర్పంచులను హరీష్ రావు గారు ప్రత్యేకంగా అభినందించి, శాలువాలతో సత్కరించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ రావు మాట్లాడుతూ ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలిందన్నారు. మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయ్యారని, రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయ్యిందని, ఇక ఈ రాత్రి వచ్చే మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీని నిరాశపరచక తప్పదని చెప్పారు. ఈ ఓటమి భయంతోనే ఇప్పుడు డబ్బు సంచులు పట్టుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరారని, పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ నాయకత్వంలో తూప్రాన్ మండలమే కాదు రాష్ట్రం మొత్తం అద్భుతంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. నాడు ఢిల్లీలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదని, కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తెలంగాణకు ఒక్క అవార్డు కూడా రాలేదని వివ‌రించారు. పల్లెలు అపరిశుభ్రంగా మారాయని, కనీసం కేసీఆర్ (KCR) కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని మండిప‌డ్డారు. ఆనాడు కేసీఆర్ ప్రతి నెలా పల్లెలకు నిధులు విడుదల చేసేవారని, కానీ రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు బంద్ అయ్యాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పల్లె ప్రకృతి వనాలు, డంపు యార్డులు అన్నీ మూలకు పడ్డాయని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని వాపోయారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్న ఆయ‌న అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని అభిప్రాయ‌ప‌డ్డారు.

మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు.

బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే స‌హించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. దాడులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్‌లో గెలిచిన వారిని బలవంతంగా పార్టీలో చేర్చుకోవాలని చూసినా కుదరదని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులని, వారు మీ బెదిరింపులకు లొంగరని వివ‌రించారు.

రెండేళ్ల‌లో మ‌ళ్లీ కేసీఆరే సీఎం

కేంద్రంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం వన్ నేషన్ - వన్ ఎలక్షన్ దిశగా వెళ్తోందని చెప్పారు. బహుశా మరో ఆరు నెలల్లోనో ఏడాదిలోనో ఎన్నికలు రావచ్చని అన్నారు. రెండేళ్లలో కచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేన‌ని తెలిపారు. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్య‌క్తం చేశారు. గెలిచిన సర్పంచులంతా ధైర్యంగా ఉండాల‌ని, మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు. అభివృద్ధి పథంలో మన గ్రామాలన్నీ ప్రయాణిస్తాయని అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement