త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSE | ఎన్ఎస్ఈ ప్రీ-ఓపెన్ సెషన్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే కొత్త నిబంధనలు..

NSE | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ప్రీ-ఓపెన్ సెషన్‌కు సంబంధించి సవరించిన నిబంధనలను సోమ‌వారం నుంచి అమలు చేయనుంది. అయితే ప్రీ-ఓపెన్ సెషన్ సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉదయం 9 గంటల నుంచి 9:15 గంటల వరకు 15 నిమిషాల ప్రీ-ఓపెన్ సెషన్‌లోనే కొత్త విధానం అమల్లోకి రానుంది.

S

Business | Published On Sep 7, 2026, 11.26 am IST

NSE | ఎన్ఎస్ఈ ప్రీ-ఓపెన్ సెషన్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే కొత్త నిబంధనలు..
Advertisement

NSE | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ప్రీ-ఓపెన్ సెషన్‌కు సంబంధించి సవరించిన నిబంధనలను సోమ‌వారం నుంచి అమలు చేయనుంది. అయితే ప్రీ-ఓపెన్ సెషన్ సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉదయం 9 గంటల నుంచి 9:15 గంటల వరకు 15 నిమిషాల ప్రీ-ఓపెన్ సెషన్‌లోనే కొత్త విధానం అమల్లోకి రానుంది. కొత్త విధానం ప్రకారం ఆర్డర్ ఎంట్రీ సమయాన్ని వివిధ దశలుగా విభజించారు. రెండో దశలో మార్కెట్ ఆర్డర్లపై పరిమితి విధించారు. ఈ మార్పులు ఈక్విటీ క్యాష్ మార్కెట్‌లో సెబీ ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) విధానానికి అనుగుణంగా ప్రీ-ఓపెన్ సెషన్‌ను మార్చేందుకు తీసుకొచ్చారు. అలాగే క్యాష్, డెరివేటివ్స్ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించడం, మార్కెట్ కార్యకలాపాల్లో ఒక దశ నుంచి మరో దశకు సాఫీగా మారేలా చేయడం కూడా ఈ సవరణల ప్రధాన ఉద్దేశంగా ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది.

ప్రీ-ఓపెన్ సెషన్‌లో కొత్త విధానం..

ఉదయం 9 నుంచి 9:05 గంటల వరకు మొదటి దశ కొనసాగుతుంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు లిమిట్ ఆర్డర్లతో పాటు మార్కెట్ ఆర్డర్లను కూడా నమోదు చేయవచ్చు. ఇప్పటికే ఇచ్చిన ఆర్డర్లలో మార్పులు చేయడం లేదా వాటిని రద్దు చేయడం కూడా సాధ్యమవుతుంది. ఉదయం 9:05 నుంచి 9:10 గంటల వరకు రెండో దశ ఉంటుంది. ఈ దశలో కేవలం లిమిట్ ఆర్డర్లను మాత్రమే నమోదు చేయడానికి, మార్చడానికి లేదా రద్దు చేయడానికి అనుమతి ఉంటుంది. అంటే ఈ సమయంలో కొత్తగా మార్కెట్ ఆర్డర్లను నమోదు చేయలేరు. ఉదయం 9:10 నుంచి 9:12 గంటల వరకు ఆర్డర్లను సరిపోల్చడం, ట్రేడ్లను నిర్ధారించడం జరుగుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉదయం 9:08 నుంచి 9:12 గంటల ఆర్డర్ మ్యాచింగ్ వ్యవధికి బదులుగా ఇకపై 9:10 నుంచి 9:12 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రారంభ ధర నిర్ణయించడంతోపాటు కొనుగోలు, విక్రయ ఆర్డర్లు సరిపోల్చి ట్రేడ్లను నిర్ధారిస్తారు. ఉదయం 9:12 నుంచి 9:15 గంటల వరకు బఫర్ పీరియడ్ ఉంటుంది. ప్రీ-ఓపెన్ సెషన్ ముగిసిన తర్వాత సాధారణ నిరంతర ట్రేడింగ్ ప్రారంభమయ్యే వరకు ఈ సమయం మార్పిడికి ఉపయోగపడుతుంది.

ఏ షేర్లకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి?

కొత్త నిబంధనలు కేవలం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడర్లకు మాత్రమే పరిమితం కావు. ఇవి ఈక్విటీ లేదా క్యాష్ మార్కెట్‌లోని ప్రీ-ఓపెన్ సెషన్‌కు వర్తిస్తాయి. మెయిన్ బోర్డులో నమోదైన కంపెనీలతోపాటు ఎస్‌ఎంఈ షేర్లు, పార్ట్లీ పెయిడ్-అప్ షేర్లు, ఇన్‌విట్స్, రీట్స్ వంటి వివిధ ఈక్విటీ సెక్యూరిటీలకు కూడా ఈ సవరించిన నిబంధనలు వర్తిస్తాయి. అందువల్ల ఈ మార్పులు కేవలం పెద్ద కంపెనీలు లేదా లార్జ్ క్యాప్ షేర్లకు మాత్రమే పరిమితం కావు. చిన్న కంపెనీల షేర్లు, ఇతర అర్హత కలిగిన ఈక్విటీ సెక్యూరిటీలు కూడా కొత్త ప్రీ-ఓపెన్ సెషన్ నిబంధనల పరిధిలోకి వస్తాయి.

ఈక్విటీ క్యాష్ మార్కెట్‌లో ఆగస్టు 4న ప్రవేశపెట్టిన కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) విధానానికి అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ ప్రీ-ఓపెన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్‌ను సవరించింది. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ద్వారా మార్కెట్ ముగింపు ధరను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, పటిష్టంగా నిర్ణయించడమే లక్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. డెరివేటివ్ కాంట్రాక్టులు ఉన్న క్యాష్ మార్కెట్ షేర్లకు ఇది వర్తిస్తుంది. కొనుగోలు, విక్రయ ఆర్డర్లను ఒకే లిక్విడిటీ పూల్‌లోకి తీసుకువచ్చి, వేలం విధానం ద్వారా షేర్ ముగింపు ధరను నిర్ణయించేలా సీఏఎస్ రూపొందించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement