త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACP Kiran Kumar | నేరాల‌కు చెక్‌ పెట్టేద్దాం: బెల్లంప‌ల్లి ఏసీపీ కిర‌ణ్‌కుమార్‌

ACP Kiran Kumar | ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడే నేరాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని బెల్లంప‌ల్లి ఏసీపీ కిర‌ణ్‌కుమార్ అన్నారు. ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలు, ఆభరణాల వ్యాపారులు తమ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

S

News | Published On May 8, 2026, 4.36 pm IST

ACP Kiran Kumar | నేరాల‌కు చెక్‌ పెట్టేద్దాం: బెల్లంప‌ల్లి ఏసీపీ కిర‌ణ్‌కుమార్‌
Advertisement
  • గ‌న్ లైసెన్స్ ఉన్న వారిని నియ‌మించుకుంటే మేలు
  • ఆధునిక సీసీ కెమెరాలతో ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌రం
  • ఆధార్‌కు లింకు ఉన్న ఫోన్ నంబ‌ర్లు చెక్ చేశాకే లాడ్జీల్లో గ‌దులివ్వాలి
  • గోల్డ్ షాపులు, లాడ్జీల మేనేజ‌ర్ల స‌మీక్షా స‌మావేశంలో ఏసీపీ కిర‌ణ్‌కుమార్ సూచ‌న‌లు

ACP Kiran Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడే నేరాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని బెల్లంప‌ల్లి ఏసీపీ కిర‌ణ్‌కుమార్ అన్నారు. ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలు, ఆభరణాల వ్యాపారులు తమ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది ఎల్ల‌ప్పుడూ అప్రమత్తంగా ఉండాల‌న్నారు. మందమర్రి (Mandamarri) లోని ఇల్లందు క్లబ్‌లో బెల్లంపల్లి సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్యాంకులు, ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ షాపులు, లాడ్జీల మేనేజర్లు, యజమానులతో ఆయ‌న‌ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఏసీపీ మాట్లాడుతూ.. నేరాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులకు లాడ్జిల్లో గదులు కేటాయించే సమయంలో వారి ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ నంబర్లను పరిశీలించిన అనంతరమే గదులు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయని, దొంగలు బంగారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. బ్యాంకులు, ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలు, ఆభరణాల వ్యాపారులు తమ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హెచ్చ‌రించారు.

ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. ఫైర్ సైరన్‌లను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గన్ లైసెన్స్ కలిగిన వ్యక్తులను భద్రతా సిబ్బందిగా నియమిస్తే పూర్తి స్థాయి భద్రత కల్పించవచ్చని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నేర సంఘటనలు జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల‌ని కోరారు. ఈ ప్రాంతాన్ని నేరరహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద కదలికలతో ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ సమావేశంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, మందమర్రి సీఐ పర్స రమేష్, బెల్లంపల్లి ఎస్‌ఐలు, బ్యాంకు మేనేజర్లు, గోల్డ్ షాప్ యజమానులు, లాడ్జ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement