త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Speaker Gaddam Prasad Kumar | క‌ళ్లెదుటే భూ స‌ర్వే.. ప్ర‌తి నంబ‌ర్‌కు మ్యాపింగ్‌: స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌

Speaker Gaddam Prasad Kumar | తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబుల కాలంలో భూముల సర్వే జరిగిందని.. నేడు సాంకేతిక‌త పెరిగింద‌ని, మీ క‌ళ్ల ముందే, మీ అనుమ‌తితోనే భూములు స‌ర్వే (Lands survey) చేసి, స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించి ప్ర‌తి స‌ర్వే నంబ‌ర్‌కు మ్యాపింగ్(Mapping) చేస్తార‌ని వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తెలిపారు.

S

News | Published On Apr 13, 2026, 5.31 pm IST

Speaker Gaddam Prasad Kumar | క‌ళ్లెదుటే భూ స‌ర్వే.. ప్ర‌తి నంబ‌ర్‌కు మ్యాపింగ్‌: స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబుల కాలంలో భూముల సర్వే జరిగిందని.. మళ్లీ 90 ఏళ్ల‌ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆధ్వ‌ర్యంలో ఇప్పుడు భూముల రీ సర్వే జరుగుతుంద‌ని వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) చెప్పారు. నేడు సాంకేతిక‌త పెరిగింద‌ని, మీ క‌ళ్ల ముందే, మీ అనుమ‌తితోనే భూములు స‌ర్వే (Lands survey) చేసి, స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించి ప్ర‌తి స‌ర్వే నంబ‌ర్‌కు మ్యాపింగ్(Mapping) చేస్తార‌ని తెలిపారు. వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామంలో జరిగిన భూ భారతి-భూసర్వేపై సోమ‌వారం నిర్వ‌హించిన‌ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ఆయ‌న మాట్లాడారు.

అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ బాగా పెరిగిందన్నారు. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పద్ధ‌తులను ఉపయోగించి భూములను సర్వే చేసి సరిహద్దులు నిర్ణయిస్తార‌ని తెలిపారు. ప్రతి సర్వే నెంబర్ కు మ్యాప్ ఇస్తారని పేర్కొన్నారు. ఇదంతా మీ ముందే, మీ అనుమతితోనే జరుగుతుందని వెల్ల‌డించారు. ఈ సర్వే వల్ల‌ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ వివరాలను అన్నింటిని సమీకృత భూ భారతి పోర్టల్ లో నమోదు చేస్తారని వివ‌రించారు. స్మార్ట్ ఫోన్ ద్వారా భూముల‌ వివరాలను, సరిహద్దులను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసుకోవ‌చ్చ‌న్నారు. ఇక‌ గ్రామాల్లో భూమి పంచాయితీలు, గొడవలు ఉండవన్నారు.

ఎలాంటి లోటుపాట్లు లేకుండా భూ యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అధికారులు సక్రమంగా సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వేకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో రైతులకు, ప్రజలకు అన్యాయం జ‌రుగుతుంద‌ని రేవంత్‌రెడ్డితో క‌లిసి ఆనాడే ఇక్క‌డి క‌లెక్ట‌రేట్ ముందు ధర్నా చేసిన‌ట్లు గుర్తుచేశారు. రైతులను ఏడ్పిస్తున్న ధరణిని కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక బంగాళాఖాతంలో కలిపేస్తానని రేవంత్ రెడ్డి అప్పుడే చెప్పారన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ధరణిని రద్దు చేసి ప్రజలకు మేలు చేసే విధంగా భూ భారతి చట్టం తీసుకొచ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మీ పథకంలో మా అక్కా చెల్లెళ్ల‌కు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నామ‌న్నారు. ఇప్పటి వరకు మహిళలు పది వేల కోట్ల రూపాయల ప్రయాణాలు చేశార‌ని తెలిపారు. 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలెండర్, గృహజ్వోతి పథకంలో పేదల ఇళ్ల‌కు ఉచిత కరంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచిన‌ట్లు వివ‌రించారు.

ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని కుటుంబాలన్నింటికి భరోసా ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు చెప్పారు. బడికి వెళ్లే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉదయం అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని అందిస్తున్నామ‌న్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింద‌ని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన విషయం అధికారంలోకి వచ్చే వరకు త‌మ‌కు తెలియద‌న్నారు. ఇప్పుడు నెలకు 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడు కాబట్టే అప్పులను తీరుస్తూ మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నాడ‌న్నారు. రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు.

పెద్దోల్లే కాదు పేదలు కూడా సన్న బియ్యం అన్నం తింటున్నార‌ని.. పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని తెలిపారు. పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామ‌న్నారు. గత ప్రభుత్వం పదేళ్ల‌లో ఒక్క రోడ్డు వేయలేదని, తాను ఇప్పటికే రూ.600 కోట్లతో రోడ్లు వేయించాన‌ని చెప్పారు. ప్రతి గ్రామంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు వేయించామ‌ని వివ‌రించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకుని గ్రామ అభివృద్ధికి పనిచేయాలని స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్, RTI మెంబర్ జాఫర్, AMC చైర్మన్ చేపల శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ ZPTC మహిపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement