త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu | రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకే రాజ‌కీయ యాత్ర‌లు : శ్రీధ‌ర్ బాబు

Sridhar Babu | రైతుల దీక్షకు సంఘీభావం పేరిట పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ నేతలకు తగదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హితవు పలికారు.

S

Telangana | Published On Apr 8, 2026, 4.38 pm IST

Sridhar Babu | రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకే రాజ‌కీయ యాత్ర‌లు : శ్రీధ‌ర్ బాబు
Advertisement

రైతుల దీక్షకు సంఘీభావం పేరిట రాజకీయమా..?
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలన్నదే ప్రధాన అజెండా
వికారాబాద్ జిల్లా అభివృద్ధి చూసి ఓర్వలేకే మొసలి కన్నీరు
బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారంపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్ : రైతుల దీక్షకు సంఘీభావం పేరిట పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ నేతలకు తగదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హితవు పలికారు. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న భూసేకరణపై ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు, పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లేందుకే ‘రాజకీయ యాత్ర’లు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర వెనుకబాటుకు గురైన వికారాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోంటే ఓర్వలేకే మొసలి కన్నీరు కారుస్తున్నారని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విమర్శించారు.

తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా మార్చేందుకు మేం అహర్నిశలు కృషి చేస్తోంటే, చూసి తట్టుకోలేకే మాపై బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. పెట్టుబడులు రాకుండా... మన యువతకు ఉపాధి దక్కకుండా అసత్యాలను వండి వార్చుతూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ‘కొత్త పరిశ్రమల ఏర్పాటుకు భూములు అవసరం. ఇప్పటికే ఆపరేషన్‌లో ఉన్న చందనవెల్లి, సీతారాంపూర్ తదితర ఇండస్ట్రియల్ పార్కుల్లో కొత్త యూనిట్లకు కేటాయించేందుకు భూములు అందుబాటులో లేవు. కొన్ని చోట్ల ఉన్నా... న్యాయపరమైన వివాదాలు, యాక్సెస్ రోడ్డు అందుబాటులో లేదు. ఇలాంటి తరుణంలోనే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం’ అని వివరించారు.

మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రేడియల్ రోడ్డు

‘పారిశ్రామికాభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే లక్ష్యంతో అన్ని రంగాల్లో వెనుకబడిన వికారాబాద్ జిల్లా పరిధిలోని కొడంగల్, పరిగి తదితర ప్రాంతాలను ఎంపిక చేశాం. కొడంగల్, కోస్గి, దోమ, పరిగి తదితర ప్రాంతాల కనెక్టివిటీని పెంచేందుకు... మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రేడియల్ రోడ్డు, ఆర్ఆర్ఆర్ ను ప్రతిపాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అవసరమైన మేరకు మాత్రమే భూసేకరణ చేయబోతున్నాం. అదీ కూడా నిబంధనల ప్రకారమే. భూ సేకరణ చట్టం - 2013 ప్రకారం డీపీఆర్ ను తయారు చేసి, ప్రభుత్వం నుంచి 10-ఏ జీవో తీసుకున్న తర్వాతే పరిగి మండల పరిధిలోని రాపోల్, కాడ్లాపూర్‌లో భూసేకరణకు నోటిఫికేషన్ ను జారీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్ ను టీజీఐఐసీ కోరింది’ అని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ కుట్రలో భాగస్వామ్యం కావొద్దు

‘భూముల్ని కోల్పోయిన వారికిచ్చే నష్ట పరిహారం విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. సత్యదూరం. చట్ట ప్రకారం నష్ట పరిహారం, ఆర్అండ్ఆర్ బెనిఫిట్ కింద ఇళ్ల స్థలాల్ని అందజేస్తున్నాం’ అని వివరించారు. ‘ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన వికారాబాద్ ప్రాంత రూపురేఖల్ని మార్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడికి పరిశ్రమలొస్తే మీ బిడ్డలకు ఉద్యోగాలొస్తాయి. వలసలు ఆగిపోతాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. మీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా సాగుతున్న బీఆర్ఎస్ కుట్రలో భాగస్వామ్యం కావొద్దు’ అని స్థానికులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని, వారి త్యాగాన్ని ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని సహకరించాలని మంత్రి శ్రీధ‌ర్ బాబు కోరారు.

Advertisement
Advertisement