త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Justice Chandraiah | న్యాయ శిఖ‌రం జ‌స్టిస్ గుండా చంద్ర‌య్య క‌న్నుమూత‌

Justice Chandraiah | ఉమ్మ‌డి హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య (72) అనారోగ్యంతో కన్నుమూశారు. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఆదివారం ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వహించనున్నారు.

S

News | Published On May 16, 2026, 2.51 pm IST

Justice Chandraiah | న్యాయ శిఖ‌రం జ‌స్టిస్ గుండా చంద్ర‌య్య క‌న్నుమూత‌
Advertisement
  • సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Justice Chandraiah | త్రినేత్ర‌.న్యూస్: ఉమ్మ‌డి హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య (72) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ బంజారాహిల్స్ అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఆదివారం ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వహించనున్నారు. వివిధ శాఖలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా, ప్రభుత్వ న్యాయవాదిగా న్యాయ రంగంలో విశేష సేవలు అందించారు.

ఇదీ చంద్రయ్య నేప‌థ్యం..

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చంద్ర‌య్య‌ 1954లో జన్మించారు. తల్లిదండ్రులు గుండా బీర్‌పూర్, మార్తమ్మలు. తిమ్మాపూర్ జడ్పీహెచ్ఎస్ లో హైస్కూల్ విద్య‌ను అభ్య‌సించారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో డిగ్రీ, ఉస్మానియూ యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1980 సంవత్సరంలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అనంతరం హై కోర్టు లోక్ అదాలత్ సభ్యుడిగా, పలు జిల్లాల్లో జిల్లా జడ్జిగా, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటి లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా సేవ‌లందించారు. 2016లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. పదవీ విరమణ అనంతరం 2019లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగారు.

చంద్ర‌య్య మృతి న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు తీర‌ని లోటు: సీఎం రేవంత్‌

జస్టిస్ గుండా చంద్రయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివిధ శాఖలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా, ప్రభుత్వ న్యాయవాదిగా వారు న్యాయ రంగంలో విశేష సేవల‌దించార‌న్నారు. సామాజిక అసమానతలు, మానవ హక్కుల ఉల్లంఘనల వంటి అంశాలపై అనేక చరిత్రాత్మక తీర్పులు వెలువరించినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. చంద్ర‌య్య‌ మరణం న్యాయ వ్యవస్థకు తీరని లోటు అని, జస్టిస్ చంద్రయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.

Advertisement
Advertisement