త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Mallu Ravi | డోర్నకల్ – గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తా: ఎంపీ మ‌ల్లు ర‌వి

MP Mallu Ravi | నాగర్ కర్నూల్ వెనకబడ్డ ప్రాంతమ‌ని.. రైల్వే నెట్‌వర్క్ ఎంతో అవసరమ‌ని ఎంపీ మ‌ల్లు ర‌వి (MP Mallu Ravi) అన్నారు. డోర్న‌క‌ల్-గ‌ద్వాల (Dornakal-Gadwal) కొత్త రైల్వే లైన్ (New Railway line) కోసం పాద‌యాత్ర (Foot march) చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయ‌న విలేఖరులతో మాట్లాడారు.

S

News | Published On Apr 2, 2026, 6.32 pm IST

MP Mallu Ravi | డోర్నకల్ – గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తా: ఎంపీ మ‌ల్లు ర‌వి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: నాగర్ కర్నూల్ వెనకబడ్డ ప్రాంతమ‌ని.. రైల్వే నెట్‌వర్క్ ఎంతో అవసరమ‌ని ఎంపీ మ‌ల్లు ర‌వి (MP Mallu Ravi) అన్నారు. డోర్న‌క‌ల్-గ‌ద్వాల (Dornakal-Gadwal) కొత్త రైల్వే లైన్ (New Railway line) కోసం పాద‌యాత్ర (Foot march) చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయ‌న విలేఖరులతో మాట్లాడారు. కల్వకుర్తి -మాచర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగంగా ఉంటుందని వివరించారు.

నాగ‌ర్‌క‌ర్నూలుకు లైఫ్ లైన్‌...

డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్ గురించి ప్రతి పార్లమెంట్ సెషన్‌లో మాట్లాడాన‌ని చెప్పారు. రైల్వే మంత్రికి విన‌తులు ఇచ్చాన‌ని గుర్తు చేశారు. ఇటీవల కూడా రైల్వే మంత్రిని క‌లిసి డోర్నకల్-గద్వాల్ రైల్వే లైన్ గురించి గుర్తుచేశాన‌న్నారు. ఈ లైన్ నాగర్ కర్నూలు జిల్లాకు లైఫ్ లైన్ లాంటిదని వివరించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ లైన్ రావడం వల్ల నాగర్ కర్నూల్ పార్లమెంటు రైల్వే నెట్వర్క్‌తో కనెక్ట్ అవుతుందన్నారు. ఈ లైన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లోని కల్వకుర్తికి వచ్చి ఆ తర్వాత వనపర్తి నుంచి గద్వాలకు కనెక్ట్ అవుతుందని వివ‌రించారు.

పూర్తి స్థాయి డీపీఆర్‌..

గురువారం రైల్వే బోర్డు దగ్గరికి వెళ్లి బోర్డ్ డైరెక్టర్ అభిషేక్‌ను కలిశాను. ఈ రైల్వే లైన్ కోసం సర్వే చేసిన మ్యాప్ ని, సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే బోర్డు పంపించిన డీపీఆర్‌ను తీసుకున్నాను. వారం, పది రోజుల్లో పూర్తిస్థాయి డీపీఆర్ సిద్ధం చేసి.. క్యాబినెట్‌కు పంపించే ప్రక్రియను మొదలు పెడతామని రైల్వే బోర్డు డైరెక్టర్ చెప్పారు. రైల్వే శాఖ మంత్రి, డైరెక్టర్, చైర్మన్ అందరితోనూ ఈ రైల్వే లైన్ ని బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ రాయల్ ప్లాంట్ కింద తీసుకోవాలని విజ్ఞప్తి చేశా. జనరల్ రాయల్ ప్లాన్ కింద తీసుకుంటే.. మళ్లీ దానికి రెవెన్యూ రిటర్న్స్ లేవనే ఇబ్బందులు వస్తాయని చెప్పిన‌ట్లు తెలిపారు.

ఈ లైన్ డోర్నకల్ నుంచి సూర్యాపేట జిల్లాలో ప్రవేశించి అక్కడి నుంచి నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి నాంపల్లి మండల కేంద్రం నుంచి కల్వకుర్తి అసెంబ్లీలో ఉన్న మొదటి గ్రామం ఇరువీన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి వెల్దండ మండల హెడ్ క్వార్టర్‌కి వచ్చి.. కల్వకుర్తికి చేరుతుంది. ఆ తర్వాత వేపూరు, తాడూరు మీదుగా నాగర్ కర్నూల్‌కు వస్తుంది. ఇక్కడి నుంచి వనపర్తికి చేరుకుంటుంది. అటునుంచి చెన్నూరు గ్రామం మీదుగా.. చివరగా శ్రీరామ్ నగర్ దగ్గర్లో గద్వాల రైల్వే లైన్‌కి కనెక్ట్ అవుతుంది అని చెప్పారు.

ఇరువీన్ నుంచే పాద‌యాత్ర‌..

త్వరలోనే ఇరువీన్ గ్రామం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి.. శ్రీరామ్ నగర్ వరకు ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో కొనసాగిస్తాను. ఈ రైల్వే లైన్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ పై ఒత్తిడి తేవడానికే పాదయాత్ర చేయబోతున్నాం. కల్వకుర్తి, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల ఎమ్మెల్యేలతో, స్థానిక నాయకులతో, ప్రజలతో కలిసి త్వరలోనే పాదయాత్రను ప్రారంభించబోతున్నా అని వెల్ల‌డించారు.

2.93 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్‌...

2.93 లక్షల కోట్లు బడ్జెట్ రైల్వే శాఖకు వచ్చింది. అందులో ఈ ప్రాజెక్టుకు కూడా బడ్జెట్ మంజూరు చేసి పనులు ఈ ఏడాదే మొదలు పెట్టాలనేదే మా డిమాండ్. ఇదే కాకుండా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల వరకు లైన్ ఏర్పాటు చేయాలని కోరా. ఇది రెండు రాష్ట్రాలను కలుపుతుంది. ఈ లైన్‌ను కూడా త్వరలో మంజూరు చేసి.. బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశాం. నాగర్ కర్నూలు జిల్లాకు ఇంతకాలం అన్యాయం జరిగింది. ఈ లైన్ మంజూరు అయితే.. న్యాయం జరుగుతుంది.

సీఎం లేఖ రాశారు..

ఈ రెండు లైన్ల గురించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు. పలుమార్లు రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నా తరపున కృతజ్ఞతలు. ఈ రెండు రైల్వే లైన్ల సాధనకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరుతున్నాను. గురువారం జీరో అవర్‌లో ఇదే సబ్జెక్టు మీద పార్లమెంటులో మాట్లాడాను. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నాగర్ క‌ర్నూల్ జిల్లాకు రైల్వే లైన్ సాధనకు అందరు సహకరించాలని కోరుతున్నా అని మ‌ల్లు ర‌వి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement