త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaddar Awards | ప్ర‌పంచ సినిమా హ‌బ్‌గా హైద‌రాబాద్ – గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌ వేడుక‌లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌

గ‌ద్ద‌ర్ సినీ అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేడుక గురువారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ అవార్డుల వేడుక‌కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి సీఎం చేతుల మీదుగా స్వీక‌రించారు.

N

News | Published On Mar 19, 2026, 11.51 pm IST

Gaddar Awards | ప్ర‌పంచ సినిమా హ‌బ్‌గా హైద‌రాబాద్ – గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌ వేడుక‌లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌
Advertisement

Gaddar Awards | గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేడుక తార‌ల త‌ళుకుబెళుకుల మ‌ధ్య అట్ట‌హాసంగా జ‌రిగింది. గురువారం హైద‌రాబాద్‌లోని హైటెక్స్ క‌న్వెన్ష‌న్‌ సెంట‌ర్ వేదిక‌గా జ‌రిగిన ఈ అవార్డు వేడుక‌లో టాలీవుడ్ అగ్ర హీరోహీరోయిన్లు అంద‌రూ సంద‌డి చేశారు. ఈ వేడుక‌కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఎన్టీఆర్ అవార్డు...

ఈ వేడుక‌లో ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి స్వీక‌రించారు. ఆయ‌న‌కు సీఎం రేవంత్ రెడ్డి, బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ క‌లిసి ఈ అవార్డును ఆయ‌న‌కు అంద‌జేశారు . పైడి జ‌య‌రాజ్ పుర‌స్కారాన్ని క‌మ‌ల్‌హాస‌న్ అందుకున్నారు. ఏఎన్నార్ అవార్డు జ‌య‌సుధ‌, సినారే అవార్డు సుద్ధాల అశోక్‌తేజ‌, బీఎన్ రెడ్డి ఫిల్మ్ పుర‌స్కారాన్ని సింగీతం శ్రీనివాస‌రావు. టీఎల్ కాంతారావు అవార్డును ఆర్ నారాయ‌ణ‌మూర్తి స్వీక‌రించారు. బెస్ట్ డైరెక్ట‌ర్‌గా నిలిచిన సాయిలు కంపాటితో పాటు బెస్ట్ ఫిల్మ్స్‌గా నిలిచిన రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ది గ్రేడ్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాల మేక‌ర్స్ సీఎం చేతుల మీదుగా అవార్డుల తీసుకున్నారు. ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీకిగాను బెస్ట్ హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న గ‌ద్ద‌ర్ పుర‌స్కారాన్ని సొంతం చేసుకుంది. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డితో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ అవార్డును అంద‌జేశారు. ఈ అవార్డు త‌న‌కు ఎంతో స్పెష‌ల్ అని ర‌ష్మిక మంద‌న్న‌

హైదరాబాద్ సినీ ప‌రిశ్ర‌మ‌కు కేంద్ర‌బిందువు....సీఎం రేవంత్ రెడ్డి...

భాగ్యనగరం అంటే కేవలం ఐటీ హబ్, బిర్యానీ మాత్రమే కాదని, ఇది ప్రపంచ స్థాయి సినిమా హబ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని గ‌ద్ద‌ర్ అవార్డ్స్ వేడుక‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ ముఖ్య భూమిక‌ పోషించారని సీఎం కొనియాడారు. వారి కృషితోనే హైదరాబాద్ సినీ ప‌రిశ్ర‌మ‌కు కేంద్ర‌బిందువుగా మారింద‌ని తెలిపారు. ఇటీవ‌లే నెట్‌ఫ్లిక్స్ త‌మ సంస్థ‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసింద‌ని, నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్లేన‌ని సీఎం అన్నారు. రామోజీ రావు ఫిల్మ్ సిటీని నెల‌కొల్సి హైద‌రాబాద్‌లో సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కృషిచేశార‌ని అన్నారు.

దాస‌రి...ప్ర‌భాక‌ర్‌రెడ్డి...

ప్రజా యుద్ధనౌక గద్దర్ ఒక వ్యక్తి కాదు, ఒక స్ఫూర్తి అని సీఎం అన్నారు. తన పాటతో వేలాది మందిలో చైతన్యం నింపిన ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. సినిమా అనేది సమాజంలో మార్పు తెచ్చే అత్యంత శక్తివంతమైన ఆయుధమ‌ని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. గద్దర్ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి సినిమాను ఒక సాధనంగా మలుచుకోవాలని సినీ మేకర్లకు పిలుపునిచ్చారు.చిత్ర పరిశ్రమ కోసం సొంత స్థలాన్ని త్యాగం చేసిన ప్రభాకర్ రెడ్డిని, పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపించిన దాసరి నారాయణ రావును గ‌ద్ద‌ర్ అవార్డు వేడుక‌లో సీఎం రేవంత్ రెడ్డి స్మ‌రించుకున్నారు

తెలంగాణ ప్ర‌భుత్వ స్ఫూర్తితో...

"క‌ళాకారులు ఎక్క‌డ గౌర‌వించ‌బ‌డ‌తారో ఆ రాజ్యం సుభీక్షంగా ఉంటుంద‌ని నానుడి. ఆ నానుడి అర్థం, ప‌ర‌మార్థం గ్ర‌హించి సినీ క‌ళాకారుల‌ను గౌర‌వించాల‌నే స‌దుద్దేశంతో అవార్డుల‌ను పున‌రుద్ద‌రించారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. ఆయనను ఎప్పుడు క‌లిసిన సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. దేశ సినీ ప‌రిశ్ర‌మ‌కు కేంద్రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దాల‌నే ఆశ‌యంతో తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు సాగుతుంది. సినీ ప‌రిశ్ర‌మ మొత్తం తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎంతో రుణ‌ప‌డి ఉంది" అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ క‌ళాకారుల‌ను గౌర‌వించ‌డంలో మ‌రో తెలుగు రాష్ట్రం వెనుక‌బ‌డిపోయింద‌ని, ఈ అవార్డుల స్ఫూర్తితో చంద్రబాబునాయుడు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప్రోత్సాహాన్ని అందించాల‌ని కోరుకుంటున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు.

హాలీవుడ్ స్థాయికి ఎదిగింది... ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నేడు హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని, ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక ముద్ర వేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.తెలంగాణ ఆత్మను, ఇక్కడి మట్టి మనుషుల గొంతుకను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు గద్దర్ అని భట్టి విక్రమార్క కొనియాడారు. ఆయన పేరిట అవార్డులను అందించడం అంటే, ప్రజాపక్షం వహించే కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమని వెల్ల‌డించారు.
గత పాల‌కులు సినీ అవార్డుల‌ను ఇవ్వ‌కుండా విస్మ‌రించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో గద్దర్ పేరిట మళ్ళీ అవార్డులను ప్రారంభించామని ఆయన తెలిపారు. తెలుగు సినిమా కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా, ప్రపంచానికి తలమానికంగా నిలవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని వెల్లడించారు. సమాజంలో మార్పునకు నాంది పలికే ఎన్నో సందేశాత్మక సినిమాలు వస్తున్నాయని, అటువంటి చిత్రాలను పారదర్శకంగా ఎంపిక చేసిన ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మరియు జ్యూరీ సభ్యులను భ‌ట్టి విక్ర‌మార్క అభినందించారు.
గ‌ద్ద‌ర్ అవార్డుల వేడుక‌లో నాగార్జున‌, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా, అల్లు అర‌వింద్‌, ఖుష్బూతో పాటు ప‌లువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement