త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | సిలిండ‌ర్ ధ‌ర‌ల పెంపు మే డే కానుక‌నా మోదీ? త‌క్ష‌ణ‌మే త‌గ్గించు: కేటీఆర్

KTR | చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా 1000 రూపాయలు పెంచి పేదలకు, కార్మికులకు ప్ర‌ధాని మోదీ (PM Modi) మే డే కానుక ఇచ్చారని బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

S

News | Published On May 1, 2026, 3.32 pm IST

KTR | సిలిండ‌ర్ ధ‌ర‌ల పెంపు మే డే కానుక‌నా మోదీ? త‌క్ష‌ణ‌మే త‌గ్గించు: కేటీఆర్
Advertisement
  • సామాన్యుడు బ‌త‌కొద్దా
  • బ్యాచిల‌ర్లు వాడే చిన్న సిలిండ‌ర్ల‌నూ వ‌దిలిపెట్ట‌వా
  • ధ‌ర‌లు పెంచితే ప‌కోడీలు కూడా వేసుకోలేం
  • పెంచిన ధ‌ర‌లు వెంట‌నే వెన‌క్కి తీసుకోండి
  • మోదీకి కేటీఆర్ డిమాండ్‌

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా 1000 రూపాయలు పెంచి పేదలకు, కార్మికులకు ప్ర‌ధాని మోదీ (PM Modi) మే డే కానుక ఇచ్చారని బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ ధరల (Cylinder Prices) ను భారీగా పెంచడంపై ఆయ‌న స్పందించారు. చివ‌రికి బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్‌నూ మోదీ వద‌ల్లేద‌ని మండిప‌డ్డారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిక‌లు అయిపోగానే ధ‌ర‌లు పెంచుడు మోదీకి అల‌వాటేన‌న్నారు.

హోట‌ళ్లు, రెస్టారెంట్లు మూసేసే దుస్థితి..

దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఒకేసారి 1000 రూపాయల సిలిండర్ ధరను బీజేపీ పెంచింది. పెంచిన సిలిండర్ ధరల‌తో సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. హోటళ్ల‌లో ప‌నిచేసే కార్మికులకు, స్వయం ఉపాధిపై ఆధారపడిన ప్రతి ఒక్కరికి పెంచిన ధరలు సంక‌టంగా మారాయి. మే డే (May Day) రోజున ప్రధానమంత్రి మోదీ కార్మికులందరికీ మే డే కానుకగా ఈ ధరల పెంపు ఇచ్చారు. 1000 రూపాయల సిలిండర్ ధర పెరగడం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. హైదరాబాద్‌లో 3,315 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ ధర అంటే రెస్టారెంట్లు, హోటళ్లు మూసేసుకునే పరిస్థితి వస్తుంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మంది కార్మికుల ఉపాధికి ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది అని కేటీఆర్ అన్నారు.

ప‌కోడీలు కూడా వేసుకోలేని ప‌రిస్థితి..

ఒకప్పుడు ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోమన్న మోదీ, ఈ పెంచిన సిలిండర్లతో పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితికి తీసుకువచ్చాడు. చమురు ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్న బీజేపీ ప్రభుత్వం సెస్ (Cess) పేరుతో 65 రూపాయలు ఉన్న పెట్రోల్‌ని రూ. 110-120 కి పెంచింది. ఇలా అడ్డగోలుగా పెంచిన సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలతో అన్నిటి ధరలు పెరిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఇంత భారీగా సిలిండర్ ధర పెంచితే సామాన్యుడు బతికేదెట్లా? ఈ విషయంలో కేంద్రం పునరాలోచన చేసి ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

బ్యాచిల‌ర్లు వాడే సిలిండ‌ర్ల‌నూ వ‌దల్లేదు..

ఇప్పటికే ఇరాన్ - అమెరికా యుద్ధం పేరుతో హోటళ్లలో, రెస్టారెంట్లలో పనిచేసే వారి పరిస్థితి, వాటిపై ఆధారపడిన వ్యక్తుల ఉపాధి తగ్గిపోయింది. చివరికి బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్‌ను కూడా మోదీ వదిలిపెట్టలేదు. పెంచిన గ్యాస్ ధరల‌తో రోజువారీ టిఫిన్లు, భోజనం ఖర్చులు భారీగా పెరిగి ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది. మరోవైపు సిలిండర్ల ధర ఆకాశాన్నంటుతుంది అని విచారం వ్య‌క్తం చేశారు.

కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరల పెంపుపై చేయాల్సిన పోరాటాలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వెంటనే కేంద్రం పెంచిన పెట్రోల్ ధరలను వెనక్కి తీసుకోవాలి.

ట్యాగ్స్:

Advertisement
Advertisement