త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసులో జైలుకు బాలీవుడ్ క‌మెడియ‌న్‌ – డ‌బ్బుల్లేవ్ – స్నేహితులులేరంటూ కామెంట్స్

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ రాజ్‌పాల్ యాద‌వ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. 2010లో తాను హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అతా ప‌తా ల‌పాతా సినిమా కోసం తీసుకున్న ఐదు కోట్ల అప్పులు చెల్లించ‌క‌పోవ‌డంతో రాజ్‌పాల్ యాద‌వ్ జైలులో ఊచ‌లు లెక్క‌పెట్టాల్సివ‌చ్చింది.

N

News | Published On Feb 10, 2026, 5.25 pm IST

Rajpal Yadav |   చెక్ బౌన్స్ కేసులో జైలుకు బాలీవుడ్ క‌మెడియ‌న్‌ – డ‌బ్బుల్లేవ్ – స్నేహితులులేరంటూ కామెంట్స్
Advertisement

Rajpal Yadav |జీవితం కూడా సినిమాలాంటిదే. ఏ క్ష‌ణం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో ఊహించ‌డం క‌ష్ట‌మే. బాలీవుడ్ క‌మెడియ‌న్ రాజ్‌పాల్ యాద‌వ్‌కు అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. మొన్న‌టివ‌ర‌కు బాలీవుడ్‌లో తిరుగులేని క‌మెడియ‌న్‌గా చెలామ‌ణి అయిన రాజ్‌పాల్ యాద‌వ్ ఇప్పుడు జైలులో ఊచ‌లు లెక్క‌బెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ప‌ద‌హారేళ్ల క్రితం నాడు తీసిన ఓ సినిమాకు తాలూకు అప్పుల‌కు సంబంధించిన చెక్‌బౌన్స్ కేసులో తీహార్ జైలు అధికారుల ముందు రాజ్‌పాల్ యాద‌వ్ లొంగిపోయారు. స‌రెండ‌ర్ కావ‌డానికి ముందు ఓ ఇంట‌ర్వ్యూలో ఈ కేసుపై రాజ్‌పాల్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌లు బాలీవుడ్‌లో వైర‌ల్ అవుతోన్నాయి.

డ‌బ్బు లేదు...

"ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు ? తిరిగి చెల్లించడానికి నా ద‌గ్గ‌ర డబ్బు లేదు. లొంగిపోవడం తప్ప నాకు మరో మార్గం కనిపించడం లేదు" అంటూ రాజ్ పాల్ యాద‌వ్ పేర్కొన్నారు. "పరిశ్రమలో నాకంటూ స్నేహితులు ఎవరూ లేరు . ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఒంట‌రిగా ఎదుర్కోవ‌డం త‌ప్ప ఏం చేయ‌లేక‌పోతున్నాను" అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. రాజ్‌పాల్ యాద‌వ్‌కు బాలీవుడ్ అండ‌గా నిల‌వాలంటూ చాలా మంది నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తుండ‌గా...కొంద‌రు మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ద‌ర్శ‌క‌నిర్మాత‌గా మారి...

బాలీవుడ్‌లో క‌మెడియ‌న్‌గా బిజీగా ఉన్న టైమ్‌లోనే ద‌ర్శ‌కుడిగా మారిన రాజ్‌పాల్ యాద‌వ్ అతా ప‌తా ల‌పాతా పేరుతో ఓ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో తానే హీరోగా న‌టించాడు రాజ్‌పాల్ యాద‌వ్‌. అత‌డి భార్య రాధ యాద‌వ్ ఈ సినిమాను నిర్మించింది. అలా ప‌తా ల‌పాతా నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన ఓ ఫైనాన్షియ‌ర్ నుంచి రాజ్‌పాల్ యాద‌వ్ ఐదు కోట్ల అప్పు తీసుకున్నారు.

15 కోట్ల‌తో తీస్తే...

త‌న ఆస్తులు మొత్తం తాక‌ట్టు పెట్టి, అప్పులు చేసి దాదాపు 15 కోట్ల బ‌డ్జెట్‌తో రాజ్‌పాల్ యాద‌వ్ ఈ సినిమాను నిర్మించారు. థియేట‌ర్ల‌లో ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది కేవ‌లం 40 ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. రాజ్‌పాల్‌ను ఈ సినిమా నిండా ముంచేసింది.

చెక్ బౌన్స్‌...

ఈ సినిమా కోసం చేసిన ఐదు కోట్ల‌ అప్పుల‌కు సంబంధించి ఫైనాన్షియ‌ర్‌కు రాజ్‌పాల్ యాద‌వ్ చాలా సార్లు చెక్‌లు ఇచ్చారు. అవ‌న్నీ బౌన్స్ కావ‌డంతో 2018లో ఫైనాన్షియ‌ర్ కేసు పెట్టారు. ఈ కేసులో రాజ్‌పాల్ యాద‌వ్‌కు ఆరు నెల‌ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టుకు అప్పీల్ చేసిన రాజ్‌పాల్ యాద‌వ్ గ‌డువును ప‌లుమార్లు పొడిగిస్తూ వ‌చ్చారు. రాజ్‌పాల్ యాద‌వ్ తీసుకున్న అప్పు వ‌డ్డీతో తొమ్మిది కోట్ల‌కు వ‌ర‌కు చేరుకుంద‌ట‌. గ‌త ఏడాది కేవ‌లం 75 ల‌క్ష‌లు మాత్ర‌మే చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించ‌డంలో క‌మెడియ‌న్‌ విఫ‌లం కావ‌డంతో గ‌డువును ర‌ద్దు చేయ‌డ‌మే కాకుండా వెంట‌నే లొంగిపోవాల‌ని కోర్టు రాజ్‌పాల్ యాద‌వ్‌కు షాకిచ్చింది. లొంగిపోవ‌డానికి కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని రాజ్‌పాల్ యాద‌వ్ వేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది.

ఆర్‌జీవీ మూవీతో...

రామ్‌గోపాల్ వ‌ర్మ జంగిల్ మూవీతో విల‌న్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్‌పాల్ యాద‌వ్ ఇర‌వైఐదేళ్ల కెరీర్‌లో 200ల‌కుపైగా సినిమాలు చేశారు. ముజ్‌సే షాదీ క‌రోగీ, హంగామా, భూల్ భ‌ల‌య్యా, గ‌ర‌మ్ మ‌సాలాతో పాటు ప‌లు సినిమాల్లో త‌న కామెడీతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. రాజ్‌పాల్ క‌మెడియ‌న్‌గా న‌టించిన భూత్ బంగ్లా, వెల్‌క‌మ్ టూ ది జంగిల్ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

 

 

Advertisement
Advertisement