త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

22వేల కోట్లు వస్తాయనుకుంటే..4వేల కోట్లే వచ్చాయి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ. 22,782 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 10 నెలలు గడుస్తున్నా అందింది కేవలం సుమారు రూ. 4,000 కోట్లు మాత్రమే. అంటే రావాల్సిన దాంట్లో 20 శాతం కూడా అందలేదు. ఇది తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న ఆర్థిక అణచివేత (Fiscal Suppression) కు ఇది మరో సాక్ష్యం"

a

News | Published On Feb 1, 2026, 9.38 pm IST

22వేల కోట్లు వస్తాయనుకుంటే..4వేల కోట్లే వచ్చాయి
Advertisement

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్

రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన లేనిదే దేశాభివృద్ధి సాధ్యమా..?

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానిది వివక్షాపూరిత సమాఖ్య ధోరణి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

"భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. ఇండియా అంటే రాష్ట్రాల సమూహం (Union of States). రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన లేనిదే దేశాభివృద్ధి సాధ్యపడదని రాజ్యాంగం చెబితే, కేంద్రం మాత్రం ఈ బడ్జెట్ లో ఆ మూలసూత్రాన్నే విస్మరించింది" అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. దేశ జీడీపీలో 5 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్న తెలంగాణ గురించి బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం గర్హనీయమని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం తరచూ వల్లించే "సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్" అనే నినాదం "తెలంగాణ" విషయంలో కేవలం నీటి మూటలేనని మరోసారి ఈ బడ్జెట్ లో స్పష్టం అయ్యిందన్నారు. ఓ వైపు అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉంటుందని చెబుతూనే, మరోవైపు నిధుల కేటాయింపుల్లో "తెలంగాణ" పట్ల రాజకీయ వివక్ష చూపడం రాజ్యాంగ నైతికత (Constitutional Morality) అనిపించుకోదని హితవు పలికారు. "బడ్జెట్ అనేది ఆర్థిక హేతుబద్ధత(Economic Rationality) ఆధారంగా రూపొందించాలి. కానీ... కేంద్రం రాజకీయ అనుకూలత( Political Expediency)కు ప్రాధాన్యతనిచ్చి తాజా బడ్జెట్లో తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది" అని వివరించారు.

10 నెలలు గడుస్తున్నా ఇచ్చింది 4వేల కోట్లే

"ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ. 22,782 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 10 నెలలు గడుస్తున్నా అందింది కేవలం సుమారు రూ. 4,000 కోట్లు మాత్రమే. అంటే రావాల్సిన దాంట్లో 20 శాతం కూడా అందలేదు. ఇది తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న ఆర్థిక అణచివేత (Fiscal Suppression) కు ఇది మరో సాక్ష్యం" అని వెల్లడించారు. "రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ అనేది సమ న్యాయంగా (Equitable Distribution) జరగాలి. కానీ, సహకార సమాఖ్య (Cooperative Federalism) సూత్రాలకు విరుద్ధంగా "తెలంగాణ" పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షాపూరిత సమాఖ్య ధోరణిని ప్రదర్శిస్తోందని తాజా బడ్జెట్ మరోసారి రుజువు చేసింది" అని అన్నారు. "రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ – 2, గోదావరి – మూసీ అనుసంధానం, బందరు పోర్టు-హైదరాబాద్ డ్రైపోర్టు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే, నాలుగు కొత్త విమానాశ్రయాలు, రైలు కనెక్టివిటీ మెరుగుదల, విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలుకు నిధులు కేటాయించాలని మేము పలుమార్లు కోరినా పట్టించుకోకపోవడం ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలభిస్తోన్న వివక్ష పూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనం" అని ఆందోళన వ్యక్తం చేశారు. "హై స్పీడ్ రైల్ కారిడార్స్"తో "తెలంగాణ"కు మమ అనిపించిన కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరిపై తెలంగాణ నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇకనైనా కేంద్రం తన ధోరణిని వీడి, రాజ్యాంగబద్ధమైన సమానత్వం పాటించాలని కోరారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement