త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Women Reservation | మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు.. ప్ర‌ధాని మోదీకి లేఖ రాయ‌నున్న ప్ర‌తిప‌క్షాలు..!

Women Reservation | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, పాత మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును వెంట‌నే అమ‌లు చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

P

National | Published On Apr 18, 2026, 5.10 pm IST

Women Reservation | మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు.. ప్ర‌ధాని మోదీకి లేఖ రాయ‌నున్న ప్ర‌తిప‌క్షాలు..!
Advertisement

Women Reservation | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, పాత మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును వెంట‌నే అమ‌లు చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఇండియా కూట‌మి భాగ‌స్వామ్య పార్టీల‌న్నీ క‌లిసి దేశ‌వ్యాప్తంగా మీడియా స‌మావేశాలు నిర్వ‌హించి.. ఈ అంశంలో త‌మ వైఖ‌రేంటో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పేందుకు నిర్ణ‌యించాయి. మహిళా రిజర్వేషన్‌కు త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంద‌ని.. బిల్లు పేరుతో రాజ‌కీయ చిత్ర‌ప‌టాన్నే మార్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ఆరోపిస్తున్నాయి.

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మిత్ర‌ప‌క్షాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశం చివరి రోజు ముందు మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్ని పార్టీల అంగీకారంతో ఇప్పటికే సిద్ధంగా ఉన్న పాత మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలా చేస్తే ప్రతిపక్షం పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే, శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం ల‌భించ‌లేదు. ఈ బిల్లుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ ద‌క్క‌లేదు. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వ‌చ్చాయి. దాంతో బిల్లును తిర‌స్క‌రించిన‌ట్లు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌క‌టించారు. ఈ బిల్లును ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)తో లింక్ పెట్ట‌డంతో వివాదానికి కార‌ణ‌మైంది.

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోవ‌డంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ క‌ల్పించే బిల్లును అడ్డుకున్నార‌ని ఆరోపించారు. మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌లు స్పందిస్తూ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేశారు. డీలిమిటేష‌న్‌తో ముడిపెట్ట‌డం ద్వారా ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను మార్చే కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిర‌ణ్ రిజిజు మాట్లాడుతూ బిల్లుతో సంబంధం ఉన్న ఇత‌ర రాష్ట్రాల ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌భుత్వం ముందుకు తీసుకురాద‌న్నారు. అయితే, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌త్యేకంగా పార్ల‌మెంట్ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. కేవ‌లం ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు కేంద్రం రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చింద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement
Advertisement