త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | స‌ర్‌లో ఆటంకాల‌ను అనుమ‌తించ‌బోం.. స్ప‌ష్టం చేసిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం..!

SIR | స‌ర్ ప్ర‌క్రియ‌లో ఎలాంటి ఆటంకం క‌లిగించేందుకు అనుమ‌తించ‌బోమ‌ని, అన్ని రాష్ట్రాలు ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో అవ‌స‌ర‌మైతే ఆదేశాలు జారీ చేస్తామ‌ని సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ స్ప‌ష్టం చేశారు. ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రుగుతున్న ఓట‌రు జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ అంశంపై దాఖ‌లైన పిటిష‌న్‌పై సోమ‌వారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

P

National | Published On Feb 9, 2026, 5.03 pm IST

SIR | స‌ర్‌లో ఆటంకాల‌ను అనుమ‌తించ‌బోం.. స్ప‌ష్టం చేసిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం..!
Advertisement

SIR | స‌ర్ ప్ర‌క్రియ‌లో ఎలాంటి ఆటంకం క‌లిగించేందుకు అనుమ‌తించ‌బోమ‌ని, అన్ని రాష్ట్రాలు ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో అవ‌స‌ర‌మైతే ఆదేశాలు జారీ చేస్తామ‌ని సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ స్ప‌ష్టం చేశారు. ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రుగుతున్న ఓట‌రు జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ అంశంపై దాఖ‌లైన పిటిష‌న్‌పై సోమ‌వారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ అధికారుల పేర్లు ఇవ్వాలని ఎన్నికల సంఘం రాష్ట్రాన్ని ఎప్పుడూ కోరలేదన్నారు. దీనికి సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ స్పందిస్తూ ప్రస్తుతం 8,500 మంది అధికారుల జాబితాను సమర్పించామని, దాన్ని కోర్టు స్వీకరించాలని కోరారు. దీనికి సీజేఐ స్పందిస్తూ ఆ జాబితాలో అధికారుల పేర్లు, హోదాలు, పనిచేసే ప్రాంతాల వివరాలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. వారిని ఎలా సంప్రదిస్తారు? మరుసటి రోజే సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఈఆర్‌వో) వద్ద రిపోర్ట్ చేయ‌గ‌ల‌రా? అంటూ ప్ర‌శ్నించ‌గా.. దానికి న్యాయ‌వాది దివాన్ అవున‌ని స‌మాధానం ఇచ్చారు.

అయితే, ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది డీఎస్ నాయుడు స్పందిస్తూ.. తమకు అధికారుల పేర్లు అందలేదన్నారు. శనివారం మధ్యాహ్నం 12.30కి అందిన పత్రాల్లో అటువంటి వివరాలు లేవని తెలిపారు. జిల్లా వారీ సమాచారం ఇచ్చామని దివాన్ పేర్కొనగా.. అలాంటి జాబితా తమకు అందలేదని నాయుడు ఖండించారు. వాస్తవాలకు సంబంధించిన వివాదాలు కోర్టు కోరుకోవడం లేదని సీజేఐ హెచ్చ‌రించారు. ఇలాగే విభేదాలు కొనసాగితే బెంగాల్ చీఫ్ సెక్రటరీని వివరణ కోసం పిలవాల్సి వస్తుందని స్ప‌ష్టం చేసింది.

అధికారుల పేర్లు సిద్ధంగా ఉన్నాయని, వారంతా గ్రూప్-బీ అధికారులు అని దివాన్ కోర్టుకు తెలిపారు. అయితే ఫిబ్రవరి 4, 5 నాటికే ఈ జాబితా సమర్పించవచ్చని సీజేఐ వ్యాఖ్యానించ‌గా.. రాష్ట్రం సమయం తీసుకుందని దివాన్ బ‌దులిచ్చారు. ఇప్పటికీ పూర్తిస్థాయి జాబితా అందుబాటులో లేదని, అధికారులు జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) వద్ద హాజరు కావాల్సి ఉంటుందని సీజేఐ పేర్కొన్నారు. రాష్ట్రం సహకరించడం లేదన్న భావనను సృష్టిస్తున్నార‌ని సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మైక్రో-ఆబ్జర్వర్లు వేరే వర్గానికి చెందినవారని తెలిపారు. వారిలో చాలామంది ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల‌కు చెందిన వార‌ని, పశ్చిమ బెంగాల్‌తో ప్రత్యక్ష సంబంధం లేదన్నారు. దీనిపై సీజేఐ ప్ర‌శ్నించ‌గా.. ఆ వ్యక్తులు క్లర్కులు, కస్టమర్ అసిస్టెంట్లు అని, రాష్ట్రం వేరే వర్గానికి చెందిన అధికారులను సూచించిందని సింఘ్వీ వివరించారు.

మ్యాప్ చేసిన, మ్యాప్ చేయని ఓటర్లపై సీజేఐ ప్రశ్నలు లేవనెత్తారు. మ్యాపింగ్ ప్రక్రియపై కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్పష్టత కోరారు. దీనికి దివాన్ స్పందిస్తూ, ఎన్నికల సంఘానికి ఇచ్చిన సూచనలను ప్రస్తావించారు. లాజికల్ డిస్క్రిపెన్సీ (ఎల్‌డీ) కేటగిరీలో ఉన్న లోపాల్లో 50 శాతం కంటే ఎక్కువవి చిన్న స్పెల్లింగ్ పొరపాట్ల వల్లే వచ్చాయని తెలిపారు. కేవలం స్పెల్లింగ్ తప్పుల వల్లే సుమారు 70 లక్షల మంది ఓటర్లు ఆ కేటగిరీలోకి వచ్చారా? అని సీజేఐ ప్రశ్నించారు. గత విచారణలో సిబ్బంది కొరత కారణంగా మైక్రో-ఆబ్జర్వర్లు అవసరమని ఎన్నికల సంఘం చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ప్రస్తుతం 8,500 మంది అధికారులను ఏర్పాటు చేశామని దివాన్ మళ్లీ చెప్పగా.. ఆ జాబితా ఎన్నికల సంఘానికి అందిందా? అని సీజేఐ ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో దేవాల‌యాల‌ను నిర్వహించే ఒక సంస్థ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని, దానికి ఈ అంశంతో సంబంధం ఏమిటని సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి ప్రశ్నించారు. ఒకేసారి ప‌లువురు న్యాయ‌వాదులు మాట్లాడ‌డంపై సీజేఐ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇది నెంబ‌ర్ వ‌న్ కోర్ట‌ని.. మార్కెట్ కాదంటూ వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. క్ర‌మ శిక్ష‌ణ పాటించాల్సిన అవ‌స‌రాన్ని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా న్యాయ‌వాది దివాన్ రాత‌పూర్వ‌క వాద‌న‌లు ప్ర‌స్తావిస్తూ.. మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి 14 నాటికి పూర్తవుతుందని కోర్టుకు తెలిపారు. ఫిబ్రవరి 4న కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.

దివాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ముసాయిదా ఓటర్ల జాబితాలో సుమారు 7.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6.75 కోట్ల మంది ఓటర్ల‌ను ఇప్పటికే గుర్తించారు. ఇంకా సుమారు 32 లక్షల మంది ఓటర్లను గుర్తించాల్సి ఉంది. అదనంగా, లాజికల్ డిస్క్రిపెన్సీ ప్రక్రియ ద్వారా సుమారు 1.36 కోట్ల మంది ఓటర్ల‌ను గుర్తించారు. విచార‌ణ ప్రారంభంలో గ‌తంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను పాటించారా? అని సీజేఐ ఆరా తీశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Advertisement
Advertisement