త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Bengal Exit Polls | బెంగాల్ ఓటరు నాడి దొరకలేదా? సర్వే ఫలితాలు ఆపేసిన ‘యాక్సిస్ మై ఇండియా’!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. అయితే ప్రముఖ సర్వే సంస్థ 'యాక్సిస్ మై ఇండియా' మాత్రం తమ ఎగ్జిట్ పోల్ డేటాను విడుదల చేయబోమని ప్రకటించింది. ఓటర్లు తమ అభిప్రాయాలను చెప్పడానికి నిరాకరించడమే ఇందుకు కారణమని సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా వెల్లడించారు.

J

National | Published On Apr 30, 2026, 3.46 pm IST

West Bengal Exit Polls | బెంగాల్ ఓటరు నాడి దొరకలేదా? సర్వే ఫలితాలు ఆపేసిన ‘యాక్సిస్ మై ఇండియా’!
Advertisement

West Bengal Exit Polls | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. బుధవారం చివరి విడత పోలింగ్ పూర్తి కావడంతో పలు జాతీయ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను విడుదల చేశాయి. కొన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీ (BJP) అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పగా.. మరికొన్ని సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. బెంగాల్ ఓటరు నాడిని పసిగట్టేందుకు సర్వే సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి.

సైలెంట్ గా ఉన్న ఓటర్లు

అయితే, దేశంలోనే అత్యంత కచ్చితమైన సర్వేలు చేస్తుందని పేరున్న 'యాక్సిస్ మై ఇండియా' (Axis My India) మాత్రం బెంగాల్ ఎగ్జిట్ పోల్ డేటాను విడుదల చేయబోమని సంచలన ప్రకటన చేసింది. ఓటర్ల నుంచి సరైన స్పందన రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

దీనిపై యాక్సిస్ మై ఇండియా వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. "మా సర్వే బృందాలు నేరుగా ప్రజలను కలిసి మాట్లాడతాయి. కానీ, తొలి విడత పోలింగ్ తర్వాత మేం ప్రజలను పలకరించినప్పుడు, దాదాపు 60-70 శాతం మంది తమ పెదవి విప్పలేదు. కనీసం అవును లేదా కాదు అని చెప్పడానికి కూడా వారు ఇష్టపడలేదు" అని వివరించారు.

20 శాతం శాంపిల్ తో అంచనా వేయలేం

"ఎన్నికల సమయంలో ఎవరూ ఎవరితోనూ మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. అలాంటప్పుడు కేవలం 20-30 శాతం మంది ఇచ్చిన సమాచారంతో ఫలితాలను అంచనా వేసి నంబర్లు ప్రకటించడం ఏమాత్రం సరికాదని భావిస్తున్నాం. ఎంతగానో శ్రమించినప్పటికీ, ఫలితాలను అంచనా వేయలేకపోవడం మాకు కూడా నిరాశే మిగిల్చింది" అని ప్రదీప్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర సర్వేలు ఏం చెబుతున్నాయి?

బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 148 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) అవసరం. విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజా పోల్ (Praja Poll): బీజేపీకి 178 నుంచి 208 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది.

మ్యాట్రిజ్ (Matrize), పోల్ డైరీ (Poll Diary): బీజేపీకి వరుసగా 161, 171 సీట్లు వస్తాయని, కమలం పార్టీదే అధికారమని పేర్కొన్నాయి.

జన్మత్ పోల్స్ (Janmat Polls): టీఎంసీ కూటమికి 195 నుంచి 205 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది.

పీపుల్స్ పల్స్ (Peoples Pulse): టీఎంసీ ఖాతాలో 177 నుంచి 187 సీట్లు పడతాయని అంచనా వేసింది.

మమతా బెనర్జీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ క్షేత్రస్థాయి బలం వల్లే టీఎంసీకి సానుకూల ఫలితాలు వస్తాయని కొన్ని సర్వేలు విశ్లేషించాయి. ఇకపోతే, వామపక్షాలు, కాంగ్రెస్ కూటమి ప్రభావం నామమాత్రమేనని, వారికి సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయని దాదాపు అన్ని సర్వేలు ముక్తకంఠంతో వెల్లడించాయి. అధికార పీఠం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే ఎన్నికల కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement