ప్రపంచ రాజకీయాల గమనాన్ని మారుస్తున్న ‘Gen Z’ విప్లవం
Gen Z | సుదీర్ఘకాలంగా అధికారంలో పీఠాలు వేసుకుని కూర్చున్న పాలకులకు, పాతకాలపు రాజకీయ వ్యూహాలకు నేటి తరం సరికొత్తగా సవాల్ విసురుతోంది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన 'Gen Z' యువత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. చేతిలోని స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లే ఆయుధాలుగా.. ఏ ఒక్క నాయకుడూ లేకుండానే నిమిషాల వ్యవధిలో వేలాది మందిని వీధుల్లోకి తెస్తూ దిగ్గజ ప్రభుత్వాలను సైతం గడగడలాడిస్తున్నారు.
సుదీర్ఘకాలంగా అధికారంలో పీఠాలు వేసుకుని కూర్చున్న పాలకులకు, పాతకాలపు రాజకీయ వ్యూహాలకు నేటి తరం సరికొత్తగా సవాల్ విసురుతోంది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన 'Gen Z' యువత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. చేతిలోని స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లే ఆయుధాలుగా.. ఏ ఒక్క నాయకుడూ లేకుండానే నిమిషాల వ్యవధిలో వేలాది మందిని వీధుల్లోకి తెస్తూ దిగ్గజ ప్రభుత్వాలను సైతం గడగడలాడిస్తున్నారు.
డిజిటల్ యవనికపై విప్లవ బీజాలు
ఈ తరం చేపట్టిన పోరాటాల ముద్ర 2018 నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడా మార్జోరీ స్టోన్మన్ డగ్లస్ పాఠశాలలో జరిగిన దారుణ కాల్పుల ఘటన తర్వాత, డేవిడ్ హాగ్, ఎమ్మా గొంజాలెజ్ వంటి విద్యార్థులు 'మార్చ్ ఫర్ అవర్ లైవ్స్' పేరుతో దాదాపు 10 లక్షల మందితో తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా చారిత్రాత్మక ర్యాలీ నిర్వహించారు. సరిగ్గా అదే సమయంలో స్వీడన్కు చెందిన 15 ఏళ్ల బాలిక గ్రెటా థంబర్గ్ పార్లమెంట్ ముందు ప్రారంభించిన ఒంటరి పోరాటం, సోషల్ మీడియా వేదికగా 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్' పేరుతో మిలియన్ల మంది విద్యార్థుల వాతావరణ ఉద్యమంగా మారింది. ఇక 2019లో హాంకాంగ్లో చైనా తెచ్చిన క్రిమినల్ అప్పగింత బిల్లుపై సాగిన నిరసనల్లో యువత టెలిగ్రామ్, నావిగేషన్ యాప్లను ఉపయోగిస్తూ 'నాయకుడు లేని' నిరసన నమూనాను ప్రపంచానికి పరిచయం చేసింది.
ఆసియా, ఆఫ్రికాల్లో పాలకుల పతనం
ఈ డిజిటల్ విప్లవాలు క్రమంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పాలకుల పతనానికే కారణమయ్యాయి. 2024లో బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతానికి పైగా ఉన్న రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరించడంపై విద్యార్థులు తిరగబడ్డారు. ప్రభుత్వం ఇంటర్నెట్ షట్డౌన్లు విధించి, బలగాలతో అణచివేయాలని చూసినా యువత వెనక్కి తగ్గలేదు. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఈ రక్తాసిక్త పోరాటం చివరికి 15 ఏళ్ల షేక్ హసీనా నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది. అలాగే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో 2022లో 'అరగాలయ' పేరుతో విద్యార్థులు, యువత సాగించిన సుదీర్ఘ నిరసనలు రాజపక్స కుటుంబ అధికారానికి తెరదించాయి. వేలాది మంది యువకులు అధ్యక్ష భవనాన్ని ఆక్రమించడంతో గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
పన్నుల భారం, హక్కులకై కదనరంగంలోకి..
ఆఫ్రికా దేశమైన కెన్యాలోనూ ఇదే శైలి పునరావృతమైంది. 2024లో ప్రభుత్వం నిత్యావసరాలపై విపరీతంగా పన్నులు పెంచుతూ 'ఫైనాన్స్ బిల్లు' తీసుకురాగా, Gen Z యువత టిక్టాక్, 'X' వేదికలుగా ఏకమై పార్లమెంట్ ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా, అధ్యక్షుడు విలియం రూటో ఆ బిల్లును ఉపసంహరించుకుని, క్యాబినెట్ను రద్దు చేయక తప్పలేదు. ఇక ఇరాన్లో హిజాబ్ సరిగ్గా ధరించలేదనే నెపంతో కస్టడీలో మహ్సా అమిని మరణించడంతో, "మహిళ, జీవనం, స్వేచ్ఛ" అనే నినాదంతో యువత సాధించిన ప్రతిఘటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దాదాపు 500 మందికి పైగా నిరసనకారులు బలైనా, వీధుల్లో మహిళలు బహిరంగంగా హిజాబ్ ధరించకుండా తిరుగుతూ తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు.
ఢిల్లీ పీఠాన్ని కదిలించిన పరీక్షల రగడ
ఇక భారతదేశానికి వస్తే, నీట్ (NEET-UG), యుజిసి-నెట్ (UGC-NET) వంటి జాతీయ పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు, అక్రమాలు వెలుగుచూడటంతో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్, విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో విద్యార్థుల నిరసనలు వెల్లువెత్తాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువత రోడ్లపైకి వచ్చింది. ఈ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం విచారణను సీబీఐకి అప్పగించి, పేపర్ లీకేజీలను నిరోధించేందుకు కఠినమైన కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ ఆందోళనలు సమసిపోలేదు. సంబంధిత కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ యువత ఇప్పటికీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. ఈ పోరాటం చివరికి ఎలాంటి మలుపు తిరుగుతుందనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
భవిష్యత్తు రాజకీయంపై బలమైన ముద్ర
పరిశీలిస్తే.. Gen Z చేపడుతున్న ఈ పోరాటాలు కేవలం తాత్కాలిక నిరసనలు మాత్రమే కావు. నాయకులు లేకపోవడం, నెట్వర్క్ స్పీడ్తో నిర్ణయాలు తీసుకోవడం, సాంకేతికతను ఆయుధంగా మార్చుకోవడం వీరి ప్రత్యేకత. ప్రజాకర్షక హామీలతో కాలం గడిపే రాజకీయ నాయకులకు, యువత ఆకాంక్షలను విస్మరిస్తే ఎదురయ్యే ముప్పును ఈ ఉద్యమాలు హెచ్చరిస్తున్నాయి. పారదర్శకత, బాధ్యతాయుత పాలన కోసం నేటి తరం విసురుతున్న ఈ సవాలు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని మరింతగా మార్చబోతోందనడంలో సందేహం లేదు.
- ఎడ్ల సుధాకర్ రావు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Horoscope | ప్రత్యక్షంలోకి వచ్చిన బుధుడు.. ఈ మూడురాశులవారి జీవితాల్లో అన్నీ సానుకూల మార్పులే..!
జులై 25, 2026

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
జులై 24, 2026

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
జులై 24, 2026
తాజావార్తలు
- ●Jagadeesh Reddy | జెన్జీకి రాజకీయాలు తెలుసు.. దేశ నిర్మాణానికి వారు సిద్ధంగా ఉన్నరు
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. లేఖ సారాంశం ఇదే..
- ●Musi Riverfront | వారం రోజుల్లో మూసీ సుందరీకరణకు టెండర్లు
- ●Nara Rohith | నారా రోహిత్ ట్రిపుల్ ట్రీట్ - హీరోగా... విలన్గా... సర్ప్రైజ్
- ●Dharmendra Pradhan | కాక్రోచ్లకు తలొగ్గిన కేంద్రం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- ●Atal Pension Yojana | నెలకు రూ.5వేల పెన్షన్ కావాలా.. ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరండి..

Jagadeesh Reddy | జెన్జీకి రాజకీయాలు తెలుసు.. దేశ నిర్మాణానికి వారు సిద్ధంగా ఉన్నరు

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. లేఖ సారాంశం ఇదే..

Musi Riverfront | వారం రోజుల్లో మూసీ సుందరీకరణకు టెండర్లు

Nara Rohith | నారా రోహిత్ ట్రిపుల్ ట్రీట్ - హీరోగా... విలన్గా... సర్ప్రైజ్



